– ది హిందూ ఇంటర్వ్యూలో ప్రశాంత్ భూషణ్
న్యూఢిల్లీ : నిజాలను ప్రేమించే వ్యక్తికి స్వీయ ధర్మబద్ధమైన అహం తప్పనిసరి అని సీనియర్ న్యాయవాది, ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలు సుప్రీంకోర్టు పనితీరు, న్యాయమూర్తులను ప్రస్తావిస్తూ ఆయన చేసిన రెండు ట్వీట్లను కోర్టు ధిక్కరణ కింద పరిగణించి సుప్రీంకోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు రూ.1 జరిమానా విధించింది. వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణలు చెప్పనందుకు ఆయనపై కోర్టు విమర్శలు చేసింది. ప్రశాంత్ భూషణ్ది మొండితనం, అహంతో కూడిన వైఖరి అని విమర్శించింది. తనకు ఉన్నది ధర్మబద్ధమైన అహం అని భూషన్ తాజాగా ది హిందూ ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పలు అంశాలను వెల్లడించారు.
విమర్శలు, తీవ్ర విమర్శలు కోర్టును రక్షిస్తాయని మీరు చెప్పారు. విమర్శలు అనేవి తగిన విధంగా, లక్ష్మణ రేఖను దాటకుండా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది కోర్టు విమర్శకులను స్వీయ సెన్సార్ చేయమని అడుగుతుందా లేక బహిరంగంగా మాట్లాడేటప్పుడు బెటర్ జడ్జిమెంట్ ఇవ్వాలని కోర్టు విజ్ఞప్తి చేస్తుందా?
- కోర్టు రెండు విషయాలను చెప్తోంది. తీవ్రమైన విమర్శలను స్వీకరించేందుకు కోర్టులు సిద్ధంగా ఉండాలని నేను చెప్పినప్పుడు ప్రజలు కూడా అలా చేయాలని నేను అనలేదు. విమర్శలు అనేవి అన్యాయమైనవా, భయంకరమైనవా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కోర్టుల గౌరవం తాను ఇచ్చే తీర్పులు, తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుదే తప్ప ప్రజలు చెప్పేదానిపై కాదు.
కోర్టుతో పాటు అటార్నీ జనరల్ కోరినా క్షమాపణలు చెప్పనందుకు మీకు మొండితనం, అహం అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై మీరేమంటారు?
- ప్రతి ఒక్కరికి స్వీయ, ధర్మబద్ధమైన అహం ఉంటుంది. అంటే సరైన కారణం ఉంటే క్షమాపణలు చెప్పవచ్చు. తగిన కారణం లేకుండా క్షమాపణలు చెప్పాలని మిమ్నల్ని ఎవరూ బలవంతం చేయలేరు. ఇదే స్వీయ, ధర్మబద్ధమైన అహం అంటే. మీరు తప్పుగా ఏమీ చెప్పకుంటే, మీరు చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉంటే అక్కడ మీ అహం అలాంటిదిగా ఉండాలి. సత్యాన్ని ప్రేమించే వ్యక్తికి స్వీయ ధర్మబద్ధమైన అహం తప్పనిసరి.
న్యాయమూర్తులకు వ్యక్తిగత ఉద్దేశాలను ఆపాదించడం ధిక్కారం కిందకు వస్తుందని కోర్టు పేర్కొంది. తమను తాము రక్షించుకునేందుకు, సమర్ధించుకునేందుకు విమర్శలపై ప్రతిస్పందించేందుకు అనుమతిస్తే అది న్యాయస్థాన గౌరవానికి ఆరోగ్యకరమైనది కాదా?
- నా ఉద్దేశం ప్రకారం తమపై వచ్చిన విమర్శలపై న్యాయమూర్తులు స్పందించగలగాలి. ఇతరులు కూడా ఈ వ్యాఖ్యలకు స్పందించవచ్చు. జడ్జిల వైఖరికి సంబంధించి వచ్చే కొన్ని ప్రశ్నలపై అందరి ఉద్దేశం కనిపించే విధంగా ఉంటుంది. ఉదాహరణకు, న్యాయమూర్తులు తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండే సందర్భాలు ఉండే కేసులు కొన్ని ఉంటాయి. ఇప్పటికీ వారు అటువంటి కేసులను డీల్ చేస్తుంటారు.
కోర్టును అపవాదు చేసినందుకు ధిక్కార చర్యలు తీసుకునే ముందు విస్తృత సంప్రదింపులు అవసరమా?
– ఫుల్ కోర్టు సమావేశం తర్వాతే ధిక్కారం కింద సుమోటా కేసును స్వీకరించాలి. రెండోది.. తీర్పులపై అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం ఉండాలి. ఆర్టికల్ 21 ప్రకారం అప్పీల్ చేసుకోవడం అనేది ప్రాథమిక హక్కు.
మీరు చేసిన ట్వీట్ వేగంగా షేర్ చేయబడింది. ఇది ఫన్నీ నుంచి నిందలతో కూడిన కామెంట్లతో వేలాది మంది స్పందించారు. ఇది ధిక్కారానికి ఆచరణాత్మకం కాదా?
- సిద్ధాంతపరంగా ఇది ధిక్కారం కావచ్చు. కానీ ఇలా చేయడం ప్రజాప్రయోజనం కాదు. ఎందుకంటే ఇకమీదట ప్రజలు మంచి వ్యాఖ్యలు కూడా చేయకుండా ఆగిపోతారు.
ఒక సీనియర్ న్యాయవాదిగా, మీరు చేసిన ట్వీట్లలో మీరు మరింత రక్షణాత్మకంగా వ్యవహరించి ఉండాలా?
– లేదు.. నా మోటార్ సైకిల్ ట్వీట్.. ఇది ప్రధానంగా కోర్టులను లాక్డౌన్ కింద ఎందుకు ఉంచుతున్నారో చెప్పేందుకు ఉద్దేశించబడింది. ఇది పిటిషన్దారుల సమస్యలను తెలుపుతుంది. సాధారణ సమయంలో విన్న కేసులను, లాక్డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స ద్వారా విన్న కేసులను పరిశీలించండి. సాధారణం కంటే 10 శాతం కూడా లేవు.
వర్చువల్ కోర్టు విచారణలు ఒక క్రిమినల్ ధిక్కార కేసుల్లో ప్రత్యేకించి వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షణను నిరూపించేందుకు తగినంత అవకాశాన్ని ఇస్తాయా?
- ఇది కేవలం వ్యక్తిగత స్వేచ్ఛ ప్రశ్న కాదు. ఈ-కాన్ఫరెన్స్ ద్వారా తగిన విచారణలు జరగడం లేదు.
ధిక్కార చర్య రెండు ట్వీట్లకు పరిమితం చేయబడింది. అయినప్పటికీ మీరు ఇచ్చిన సమాధానం కోర్టులకు చెందిన గత అనుభవాలను తాకింది. మీ సమాధానం కూడా నిర్లక్ష్యమైనదని, ధిక్కారం యొక్క తీవ్రతకు అద్ధం పడుతోందని కోర్టు పేర్కొంది. మీ సమాధానం ద్వారా కోర్టుకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు.? - నేను నా మంచి నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలియజేశాను. నేను చేసిన వ్యాఖ్యలపై పూర్తి విశ్వాసంగా ఉన్నాను. నేను చేసిన ట్వీట్లలో పలు విషయాలు ఉన్నాయి. గత ఆరు సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా ధ్వంసమైందో, కోర్టులు అందుకు ఏ రూపంలో సహకరించాయో చెప్పాను. ఇందులో గత నలుగురు ప్రధాన న్యాయమూర్తులకు కూడా కీలక పాత్ర ఉంది. ప్రజాస్వామ్యం గణనీయంగా నాశనమైందని నేను ఎందుకు భావించానో నేను సమాధానం ఇచ్చాను. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిని చూడండి.. రెగ్యులేటరీ సంస్థ విధ్వంసం చూడండి.. మీడియాపై దాడిని చూడండి.. అని పేర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని, హక్కులను రక్షించేందుకు కోర్టులు కీలక పాత్ర పోషించాలని నేను చెప్పాను.
సత్యమే నాకు రక్షణ అని పేర్కొంటూ మీరు శిక్షకు సిద్ధమని చెప్పారు. మరోవైపు మీ న్యాయవాది రాజీవ్ ధావన్ మిమ్నల్ని శిక్షించవద్దని కోర్టును కోరారు. మీకు, మీ న్యాయవాదికి మధ్య ఆలోచనలో తేడాలు ఉన్నాయా?
- లేదు. నన్ను జైలుకు పంపితే కోర్టుల గౌరవానికి మరింత నష్టం జరుగుతుందేమో అని ఆయన భావించారు తప్ప మరేమీ లేదు.