– రైతుబంధు పేరుతో విత్తన సబ్సిడీ ఎత్తివేత ?
– 55 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయని సర్కార్
– యాసంగి సీజన్కు ఎగనామమే : రైతు సంఘాలు
రైతులేనిదే రాజ్యంలేదనే పాలకులపై అన్నదాతలు ఎన్నో ఆశలు పెట్టుకుంటుంటారు. ఈ సారైనా తమ తలరాతలు మారుతాయనుకుంటారు. ఇప్పటికే ప్రయివేటు మార్కెట్పై ఆధారపడి నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతుల సంఖ్య ఎక్కువే. సర్కారు ఇచ్చే కొద్దిపాటి సబ్సిడీ విత్తనాలు కూడా కొద్దిమందికే చేరేవి. కానీ ఈ యాసంగికి 60లక్షల ఎకరాలు పండించి దేశంలోనే తెలంగాణను అగ్రభాగన ఉంచుతామని సీఎం అంటున్నారు. మరి 55 కోట్లు కేటాయించినా ఎందుకు ఖర్చు చేయలేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రైతుబంధు పేరుతో విత్తన సబ్సిడీని ఎత్తివేయటానికే ఇదంతా అనే చర్చ నడుస్తున్నది. ఈ చేత్తో ఇచ్చి..ఆ చేత్తో గుంజుకునే ప్రయత్నాలు సర్కారు చేస్తున్నదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతున్నది.
అన్నదాత బాగుంటేనే… బంగారు తెలంగాణ సాధ్యం
– సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
సన్న, చిన్నకారు రైతుకు ఆసరానిచ్చే విత్తన సబ్సిడీకి ఎసరొచ్చింది. యాసంగి ప్రారంభమై నప్పటికీ విత్తన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. దీంతో విత్తన సబ్సిడీపై రైతుల్లో సందిగ్ధత ఏర్పడింది. సబ్సిడీ విత్తనాలు ఇస్తుందా? లేదా? అనే సంశయం నెలకొంది. విత్తన ఉత్పత్తి రైతులకు సబ్సిడీ ఇవ్వడంతోపాటు కొత్త వంగడాల విత్తనాలను ప్రోత్సహించడానికి విత్తన సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వానా కాలం, యాసంగి సీజన్ల కోసం మండల కేంద్రంలో సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నది. పట్టాదారుపాసుపుస్తకం, ఆధార్కార్డు వ్యవసాయ విస్తరణాధికారులకు చూపించి ఈ విత్తనాలను రైతులు తీసుకెళతారు. రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించిన విత్తనాలను సబ్సిడీ ధరలకు అందిస్తున్నది. 2020-21 బడ్జెట్లో విత్తన సబ్సిడీ కోసం రూ 55 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా విత్తన సబ్సిడీని ఎత్తేస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సోనా, మక్కలు, కందులు, పెసర్లు, జొన్నలు, వేరుశనగలతోపాటు నాణ్యమైన కొత్త విత్తనం, దిగుబడి బాగా వస్తుందని ప్రభుత్వం భావిస్తే దానిని ప్రోత్సహించడానికి కూడా సబ్సిడీ ఇస్తున్నది. గతంలోనైతే వరి ఐదు రూపాయలు, కందికి కిలోకు 50శాతం, మక్కలకు సబ్సిడీ రూ 20 రూపాయలు, సోయాబీన్, పసుపు తదితర విత్తనాలకు సైతం సబ్సిడీ అందేది. ఇప్పటికీ విత్తన సబ్సిడీపై నిర్ణయం తీసుకోకపోవడంతో సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
అన్నదాతకు దిక్కెవరు..!
రోజు రోజూకు వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు రూ 5వేల చొప్పున ప్రతి సీజన్కు ఇస్తున్నది. 60 లక్షల రైతులకు రైతు బంధు అందిస్తున్నది. సీజన్కు దాదాపు రూ 7500 కోట్లు ఇస్తున్నది. రైతుకు పెట్టుబడి చెల్లిస్తున్న నేపథ్యంలో విత్తన సబ్సిడీని సర్కారు పెడచెవిన పెడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుబంధు పెట్టుబడితోనే విత్తనాలు కొనుగోలు చేస్తారన్న ఆలోచన ప్రభుత్వంలో కనపడుతున్నది. విత్తన లైసెన్స్దారులు, పీఏసీఎస్, ప్రయివేటు ఏజెన్సీల వద్ద విత్తనాలు కొనుగోలు చేస్తే కూడా సదరు రైతులకు సబ్సిడీ వస్తుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో పేద రైతులకు మరింత అన్యాయం జరగనుంది. సబ్సిడీ విడుదల కాకపోవడంతో రైతులకు విత్తనం ఎలా అందుబాటులో ఉంచాలనే విషయంలో వ్యవసాయ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. సబ్సిడీ విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభించడంతో వ్యవసాయ శాఖ ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడం లేదు. దీంతో యాసంగికి సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయడం సాధ్యం కాకపోవచ్చని తెలిసింది. దీంతో ప్రయివేటు కంపెనీలు విత్తనాలను ఇష్టానుసారం అమ్ముకునే అవకాశం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 189573.58 క్వింటాళ్ల విత్తనాల ఉంటే, అందులో 171828.40 క్వింటాళ్లను జిల్లాకు పంపిణీ చేసినట్టు తెలిపింది. అయితే విత్తన సబ్సిడీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో అవి రైతులకు చేరలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 174984 మంది రైతులు సబ్సిడీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు.
యాసంగి సాగు 60 లక్షల ఎకరాల అంచనా
వానాకాలం సీజన్లో 1.30 కోట్ల ఎకరాల్లో సాగైంది. వరి, పత్తిపంట అత్యధికంగా సాగయ్యాయి. యాసంగి సీజన్కు మాత్రం 60 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఆరుతడి పంటలకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మూలిగేనక్కపై తాటిపండు పడినట్టు విత్తన సబ్సిడీ విడుదల కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సబ్సిడీ లేదు…నకిలీ విత్తనాలపై నియంత్రణ లేదు
దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయ విధాన విశ్లేషకులు
విత్తనాల ఖర్చు పెరుగుతున్నాయి. విత్తన ధరలు రెట్టింపు అవుతున్నాయి. ప్రయివేటు కంపెనీలపై నియంత్రణ లేకపోవడంతో ఎక్కువ ధరకు విత్తనాలు కొనాల్సి వస్తున్నది. అయినా నాణ్యనమైన విత్తనాలు అందడం లేదు. నకిలీ విత్తనాలతో రైతు నష్టపోతున్నారు. సోయాబీన్, మక్కలు, పత్తి విత్తనాలు నకిలీ కావడంతో అనేక చోట్ల రైతులు దెబ్బతిన్నారు. విత్తన సబ్సిడీ అందలేదు. ప్రయివేటు కంపెనీలపై నియంత్రణ అసలే లేదు. సబ్సిడీ విత్తనాలపై రైతులకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులూ లేవు.
Courtesy Nava Telangana