– ఎనిమిదేండ్ల కనిష్టానికి పడిపోయిన భాగస్వామ్యం
– ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో 52శాతానికి తగ్గిన వైనం
– ఎన్ఆర్ఈజీఎస్ పోర్టల్ అధికారిక సమాచారం
న్యూఢిల్లీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్)లో మహిళల వాటా పడిపోయింది. ఈ పథకం కింద కల్పించబడిన మొత్తం వ్యక్తి-రోజులలో మహిళల వాటా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో ఎనిమిదేండ్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో అది 52.46 శాతానికి తగ్గిపోయింది. ఈనెల 24 వరకు ఎన్ఆర్ఈజీఎస్ పోర్టలలో లభించే డేటా విశ్లేషణతో ఈ విషయం అర్థమవుతోంది. ఈ సమాచారం ప్రకారం.. 2013-14లో 52.82 శాతంతో మహిళల వాటా అత్యల్పంగా ఉన్నది. 2016లో ఇది 56.16శాతానికి పెరిగింది. అయితే ఇది గతేడాదితో పోలిస్తే 2.24శాతం పాయింట్లు తగ్గింది. దేశవ్యాప్తంగా 13.34 మంది క్రియాశీల ఎన్ఆర్ఈజీఎస్ కార్మికులు ఉన్నారు. వీరిలో 6.58 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అంటే వీరి శాతం 49శాతంగా ఉన్నది. కరోనా మహమ్మారితో కలిగే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వలస కార్మికులు తమ గ్రామాలకు అధిక సంఖ్యలో తిరిగి వచ్చిన తర్వాత పురుషుల భాగస్వామ్యం పెరిగినట్టు ఆధారాలు సూచించాయి. అయితే మహిళల వాటా తగ్గడానికి గల కారణాలు లేకపోవడం గమనించాల్సిన అంశం.
18 రాష్ట్రాలు, యూటీలో తగ్గుదల
మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మహిళల వాటా తగ్గాయి. వాటా తగ్గుదల జాతీయ సగటు 2.24 శాతంగా ఉన్నది. ఇక రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్(3.58శాతం తగ్గింది), పశ్చిమ బెంగాల్ (3.32శాతం), తెలంగాణ(2.62శాతం), హిమాచల్ప్రదేశ్ (2.44శాతం)లు ఉన్నాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, తమిళనాడు, ఉత్తరాఖండ్, సిక్కిం, బీహార్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు మహిళల వాటా క్షీణించిన జాబితాలో ఉన్నాయి.
కేరళలో పెరిగిన మహిళల భాగస్వామ్యం
మహిళల వాటా పెరిగిన రాష్ట్రాల్లో కేరళ, మిజోరం, మధ్యప్రదేశ్, మణిపూర్, గుజరాత్, మహారాష్ట్ర, నాగాలాండ్, అసోం, కర్నాటక, పుదుచ్చేరి, గోవా,అరుణాచల్ప్రదేశ్, త్రిపురలు ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరం కేరళలో అత్యధికంగా(91.38శాతం) మహిళల వాటా ఉన్నది. తర్వాత పుదుచ్చేరి(87శాతం), తమిళనాడు(84.82శాతం), గోవా(75.75శాతం), రాజస్థాన్(65.35శాతం), హిమాచల్ప్రదేశ్(60.31శాతం) ఉన్నాయి. మహిళల వాటా తక్కువగా జమ్మూకాశ్మీర్లో 30.72శాతంతో తక్కువగా ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో యూపీ(33శాతం), నాగాలాండ్(36శాతం), అరుణాచల్ప్రదేశ్(40శాతం), జార్ఖండ్(40.77శాతం), మధ్యప్రదేశ్(41 శాతం) లు ఉన్నాయి.
Courtesy: NT