– కొత్త సచివాలయ నిర్మాణానికి రూ.500 కోట్ల వ్యయం
– మళ్లీ అప్పులు చేయాల్సిందేనంటున్న నిపుణులు
– ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా రుణాలు
– గడ్డు పరిస్థితుల్లో అవసరమా అనే అభిప్రాయాలు
హైదరాబాద్ : పాత సచివాలయాన్ని కూల్చి వేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగల్ ఇచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి నూతన సెక్రటేరియట్ నిర్మాణంపై పడింది. అయితే అందుకు అవసరమైన ఆర్థిక వనరులను సర్కారు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుందనే అంశంపై హైకోర్టు తీర్పు అనంతరం తాజాగా చర్చోపచర్చలు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతమున్న సచివాలయం స్థానంలో నూతన సెక్రటేరియట్ను నిర్మించేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అందుకనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం కూడా చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తదితరులు న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యా(పిల్)న్ని దాఖలు చేసిన సంగతి విదితమే. ప్రస్తుత సచివాలయంలో పది భవనాలున్నాయనీ, వాటి కూల్చివేయటం ద్వారా వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందంటూ వారు తమ పిల్లో పేర్కొన్నారు. దీనిపై అటు ప్రభుత్వం తరఫున, ఇటు పిటీషనర్ల తరఫున నెలల తరబడి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రస్తుత సచివాలయంలో సరైన సదుపాయాల్లేవనీ, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయంటూ ఆ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసిన హైకోర్టు… సచివాలయంలోని భవనాల కూల్చివేతకు గ్రీన్ సిగలిచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా పరిస్థితులు కుదుటపడ్డ వెంటనే నూతన సచివాలయ నిర్మాణ పనులను ప్రారంభించాలని సర్కారు యోచిస్తున్నది. ఇందుకు రూ.500 కోట్లు ఖర్చవుతాయని ఇటు ఆర్థికశాఖ అధికారులు, అటు భవన నిర్మాణ ఇంజినీరింగ్ నిపుణులు అంచనా వేశారు. ఈ డబ్బును సమకూర్చుకునేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. అయితే ఇప్పటికే మన అప్పులు రూ.3 లక్షల కోట్లకు చేరటం, కరోనాతో ప్రభుత్వ ఆదాయం తీవ్రంగా పడిపోవటంతో మరోసారి రుణాలు తీసుకోవటం తప్ప వేరే మార్గం లేదని అధికారులు చెబుతున్నారు. తాజాగా సాధారణ ఖర్చుల కోసం బాండ్లను కుదువ పెట్టటం ద్వారా సర్కార్ ఆర్బీఐ వద్ద రూ.2 వేల కోట్లను తెచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నూతన సచివాలయ నిర్మాణానికి మరోసారి అప్పులు తేవటం తప్ప వేరే మార్గం కనబడటం లేదని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.
కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల్లో మూడు నెలలపాటు సర్కారు కోత విధించిన సంగతి విదితమే. ఫలితంగా మిగిలిన రూ.1,200 కోట్లతో రైతుబంధు డబ్బులను ఇచ్చామంటూ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. మరోవైపు పొదుపు చర్యల పేరిట మిషన్ భగీరథ పథకంలో పని చేస్తున్న 704 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను ప్రభుత్వం తాజాగా తొలగించింది. ఈ విధంగా రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్త సచివాలయాన్ని నిర్మిచటం అవసరమా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక ప్రయివేటు సంస్థ సోమవారం నిర్వహించిన సర్వేలో 91 శాతం మంది నూతన సెక్రటేరియట్ అవసరం లేదంటూ అభిప్రాయాన్ని వెలిబుచ్చటం గమనార్హం.
Courtesy: NT