- రూ. 82 లక్షల విలువైన మందుల కోసం రూ.3.21 కోట్లు డ్రా చేసిన అధికారులు
- ఐఎంఎస్ కుంభకోణంలో ఆసక్తికర విషయాలు
హైదరాబాద్, సెప్టెంబరు బీమా వైద్యసేవల విభాగం(ఐఎంఎస్)లో జరిగిన అవినీతి అక్రమాలపై ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. ఈఎస్ఐలకు మందుల కొనుగోళ్లలో ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ కె. పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ కె.వసంత ఇందిర భారీ అవినీతికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. రూ.2 విలువ చేసే గోలిని రూ.12కు ప్రైవేట్ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేశారని, రూ.82 లక్షల విలువైన మందులకు రూ.3.21 కోట్లను డ్రా చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. అందుకు నకిలీ ఇండెంట్లను సృష్టించారని పేర్కొన్నారు. చర్లపల్లి డిస్పెన్సరీ నుంచే పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పారు. ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణిని అడ్డుపెట్టుకుని 12 మంది ఫార్మాసిస్టులు అందినంత దండుకున్నారని వివరించారు. అయితే, వారందరిని ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 2015-2019 మధ్యకాలంలో భాస్కర ఏజెన్సీ, క్రిస్టల్ ఎంటర్ప్రైజెస్, శ్రీసంతోష్, గరుడు, లక్ష్మీ ఫార్మాల నుంచి మందులను కొనుగోలు చేశారు. కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నిందితులను కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆధారాలు ధ్వంసం! : ఈఎస్ఐలకు మందుల కొనుగోళ్లకు సంబంధించి కీలక ఆధారాలు ధ్వంసమయ్యాయి. ‘‘మందుల కొనుగోళ్లలో గోల్మాల్ వ్యవహరం బయటికి రాగానే.. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి.. తన అనుచరులతో కలిసి ఈఎ్సఐ మందుల కొనుగోళ్ల రిజిస్టర్లను చింపేశారు. ఆధారాలు దొరకకుండా వాటిని కాల్చేశారు. దీనిపై ఆమె అనుచరుల నుంచి మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాలు సంపాదించాం’’ అని ఏసీబీ అధికారి ఒకరు చెప్పారు. దాదాపు రూ.300 కోట్ల వరకు ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారని తెలిపారు. ఈ కేసులో 18 మందిని సాక్షులుగా చేర్చామని, వారి నుంచి కీలక ఆధారాలను సేకరించామని ఆ అధికారి వివరించారు.
Courtesy Andhrajyothi…