50 శాతం దాకా తగ్గిన రిటైల్ అమ్మకాలు.. నాకే వ్యక్తిగతంగా 7-8 కోట్ల నష్టం: ఈటల
ఫార్మారంగంపైనా కొవిడ్-19 పిడుగు
30% పడిపోయిన గ్రానైట్ ఎగుమతులు
కరోనా ప్రభావం వల్ల రాష్ట్రంలో ఒక్క పౌల్ట్రీ పరిశ్రమకే ఇప్పటివరకూ రూ.1000 కోట్ల నష్టం వాటిల్లింది. పౌల్ట్రీ రైతుగా నాకే రూ.7-8 కోట్ల నష్టం వచ్చింది. నష్టం వస్తుందని షట్టర్ క్లోజ్ చేసి దుకాణం మూసివేసేటట్టు ఉండదు. కోళ్ల పరిశ్రమ అంటేఅమ్మకాలున్నా లేకున్నా రోజూ కోళ్లకు దాణా వేయాల్సిందే’’
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పిన మాటలివి.
ఒక్క పౌల్ట్రీ రంగంపైనే కాదు! గ్రానైట్ నుంచి ఫార్మా, హోటల్స్ వరకూ అన్ని పరిశ్రమలూ కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఎక్కువ ప్రభావం కనిపిస్తున్నది మాత్రం పౌల్ట్రీ పైనే. చైనాలో కరోనా రాగానే ఆ ప్రభావం.. పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. రిటైల్ కౌంటర్లలో చికెన్ అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 7 లక్షల బ్రాయిలర్ కోళ్లు విక్రయం అయ్యేవని, వీటి అమ్మకాలు పడిపోయాయని అంటున్నారు. రెండు రాష్ట్రాల్లో రోజుకు దాదాపు 7 కోట్ల గుడ్లు అమ్ముడవుతాయి. ఆ విక్రయాలు కూడా పడిపోయాయి. ఇలాగే నెల రోజులకు మించి కొనసాగితే మాత్రం మరిన్ని కష్టాలు, తీవ్ర నష్టాలు తప్పవని పౌల్ట్రీ పరిశ్రమకు చెందినవారు అంటున్నారు. కరోనా దెబ్బ ఫార్మారంగంపైనా పడింది. ఆ రంగానికి సంబంధించి చైనా నుంచి 58 రకాల ముడిపదార్థాల సరఫరా నిలిచిపోయింది.
దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఔషధ ఉత్పత్తులపై ఆ ప్రభావం ఎంత మేరకు ఉందో తెలపాలంటూ రాష్ట్రానికి లేఖ రాసింది. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి చైనాకు నెలకు 7వేల మీటర్ల వరకూ గ్రానైట్ ఎగుమతి అవుతుంది. నెలకు రూ.60 కోట్లకు పైగా గ్రానైట్ ఎగుమతుల టర్నోవర్ ఉంటుంది. కానీ ఇప్పుడు గ్రానైట్ ఎగుమతి 30 శాతం పడిపోయినట్టు క్వారీల నిర్వాహకులు చెబుతున్నారు. గ్రానైట్ పరిశ్రమకు సంబంధించిన పలు పరికరాలు చైనాలోనే లభిస్తాయి. ఇప్పుడవి దిగుమతి కావట్లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ధరలు పెరిగి ఆ ప్రభావం వినియోగదారులపై పడుతుందని, క్వారీల యజమానులు, గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు.
స్టార్హోటళ్లలో..
హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగికి కరోనా సోకినట్లు వచ్చిన వార్తలతో హైటెక్ సిటీ ప్రాంతంలోని నక్షత్ర హోటళ్లలో ఒక్కసారిగా రూమ్ బుకింగ్లు రద్దయినట్లు తెలుస్తోంది. కంపెనీలు మీటింగ్లు, ఈవెంట్లను రద్దు చేసుకుంటున్నందున కరోనా ప్రభావం హోటల్ పరిశ్రమపై తీవ్రంగా ఉంది. 15 రోజులుగా కరోనా వల్ల రూమ్ ఆక్యుపెన్సీ రేటు 10ు తగ్గిందని ప్రముఖ హోటల్ యజమాని ఒకరు తెలిపారు.
పెట్రోల్… డీజిల్.. ఢమాల్..
కరోనా’ ప్రభావంతో హైదరాబాద్లో ద్విచక్రవాహనాలు, కార్లు చాలావరకూ ఇంటికే పరిమితమయ్యాయి. బస్సులు, ఆటోలు, క్యాబ్ల్లో కూడా ప్రయాణికులు తగ్గిపోయారు. నగరంలో రోజుకు 50 లక్షల లీటర్ల పెట్రోలు, 55 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. సుమారు 25% అమ్మకాలు తగ్గినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.
మెడికల్ షాపులపై దాడులు
మాస్కుల ధరలను పెంచి అమ్ముతున్నవారికి నోటీసులు
రాజధానివాసికి కరోనా సోకడంతో అప్రమత్తమైన ప్రజలు మాస్కులు కొంటుండడంతో మెడికల్ షాపులవారు వాటిని అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారు. రూ.5 విలువ చేసే మాస్కును.. ఏకంగా రూ. 50, 60, 80కు అమ్ముతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. దీంతో తనిఖీలు చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు.. అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలకు నోటీసులు జారీ చేశారు.
Courtesy Andhrajyothi