– కె. సతీష్ రెడ్డి
స్వయం పాలన కోసం వీరోచితంగా పోరాడిన తెలంగాణ బిడ్డ కొమురం భీమ్. అక్టోబర్ 22, 1901న జన్మించాడు. తల్లిదండ్రులు కొమరం చిన్నూ – సోంబారు దంపతులు. ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామం భీమ్ జన్మస్థలం. భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు.భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు.
అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాన్కొనసాగించాడు. భీమ్కు కుడిభజంగా కొమురం సూరు కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు.వెడ్మ రాము కూడా భీమ్కు సహచరుడిగా ఉన్నాడు. నిజాం సైన్యంమీద, అటవీ సిబ్బంది పైనా కొమరం కొదమసింహంలా గర్జించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్ అడవుల్లో 1940, అక్టోబర్ 27 న, అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ వీరమరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ తిథి రోజునే కొమరం భీమ్ వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ.
ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం. ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి డెబ్భై రెండు ఏండ్లు పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వారి జీవనాధారమైన అడివినుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో వారు తలపడ్డారు. ఆదివాసీ ఆవాసాల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంటవేస్తే అది జంగ్లాత్ భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు వచ్చి గోండులను వారి భూముల నుంచి తరిమేశారు. పంటలను ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు. ఈ వేధింపులు, అణచివేతల నేపథ్యంలోంచే.. ఆదిలాబాద్ గోండన్నలు పోరుబాట పట్టారు.తమ విముక్తి కోసం పోరాట జెండాపట్టారు. ‘మాఊర్లో మా రాజ్యం’అంటూ పన్నెండు గూడాలు బాబేఝరి లోద్దుల్లో రణభేరి మోగించాయి.
కొమురంభీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీవర్గాలపై తుడుం మోగించారు. కొమురంభీం పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించేలోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. భీంతో సహా పన్నెండు మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కారు పాశవికంగా కొమరంభీం పోరాటాన్ని అణచివేసింది. భీం అమరత్వం జోడేఘాట్ లోద్దుల్లో నేటికీ ప్రతిధ్వనిస్తున్నది.ఏహక్కుల కోసమైతే..నాడు భీం ఉద్యమించాడో.. ఆ హక్కుల కోసం ఆదివాసులు నేటికీ నిరంతరం పోరాటం చేయవలసే వస్తున్నది. ప్రజాస్వామిక రాజ్యమని చెప్పుకుంటున్న నేడు కూడా..ఆదివాసుల అవస్థలు ఏమీ తీరలేదు. నేటి పాలకులు ఆదివాసులపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ… హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఆదివాసుల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా.. పైపూత మాటలతో జోకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక రక్షణ ఇచ్చే రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూలును తుంగలో తొక్కి ఆదివాసులపై అన్నివైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. ప్రాజెక్టులు, గనుల తవ్వకాల పేరుతో నిర్వాసితులను చేస్తున్నారు. ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టాన్ని అమలు పర్చడంలేదు. అన్యాక్రాంతమవుతున్న అడవులను, భూములను పట్టించుకోరు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నె,కోయ తెగలే కాకుండా నాయక్పోడ్, ఆంధ్ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్,ములుగు,భద్రాద్రి,నాగర్ కర్నూల్ జిల్లాలలో నివసిస్తున్నాయి.
ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఏటా విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్నా, ఆదివాసులకు కనీస వైద్య సౌకర్యాలు అందడంలేదు. ప్రతిఏటా అయిదు వందల నుంచి వేయి వరకు మలేరియా, విష జ్వరాలు, డెంగ్యూ, మరణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారలేమితో మరణిస్తున్న పిల్లల సంగతి లెక్కేలేదు. భీం పోరాటం చేసిన ప్రాంతంలో (జోడేఘాట్) నేటికీ తాగడానికి నీళ్ళులేవు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ సమాజాల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. భీం పోరాటం జరిగి 72ఏండ్లు అవుతున్నా, ఆపోరాట స్ఫూర్తి నేటికీ ఉంది. 1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది. బాబేఝురి లోద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నది.నిజాం పాలకుల నిరంకుశత్వానికి.. అధికారుల దమన నీతికి ఎదురు నిలిచి పోరాడిన కొమురం భీం ఆశించిన లక్ష్యాలను నేటి పాలకులు నెరవేర్చలేక పోతున్నారు. ఏండ్లు గడుస్తున్నా జల్, జంగిల్, జమీన్పై ఆదివాసీలు నేటికీ హక్కులు పొందలేకపోతున్నారు. నాటి నుంచి నేటి వరకు గిరిజనులు హక్కుల కోసం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు.
Courtesy Nava Telangana