Prof. చల్లపల్లి స్వరూప రాణి
బ్రాహ్మణ వాదుల చేతిలోకెళ్ళిన ఏవాదమైన ఈ దేశానికి సంబంధించిన అర్ధ సత్యాలను, అసత్యాలనే ముందుకు తీసుకొచ్చింది. భారత దేశ చరిత్రలో శ్రమణ సంస్కృతికి, బ్రాహ్మణ వాద సంస్కృతికి మధ్య సుదీర్ఘకాలంగా జరిగిన ఘర్షణ పై బాబాసాహెబ్ అంబేడ్కర్ తప్ప పెద్దగా చర్చించిన వారు లేరు. గొప్ప మార్క్సిస్టు చరిత్రకారులు సైతం చరిత్రలో ‘ఆర్యులు’ అనబడే వారే లేరని వారు చేసిన దాష్టీకాన్నంతా సుఖంగా దాచిపెట్టే ప్రయత్నం చేశారు. అందుకే వారి వాదాన్ని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అయిన గెయిల్ ఆమ్వేద్ ‘Brahmanical Marxism’ అని పేర్కొన్నారు. ఇక మతతత్వ చరిత్రకారుల గురించి చెప్పాల్సిన పనిలేదు. చరిత్రకు మసిపూసి మారేడుకాయని చెయ్యడంలో వారు ‘అబద్దాల ఫ్యాక్టరీ’ ల వంటివారు. చరిత్రపై చెల్లుబాటులో వున్న అరువు సిద్ధాంతాలన్నీ ఇక్కడి చారిత్రక వాస్తవికతపై నేల విడిచి సాము చేసినవే!
స్త్రీవాదం అందుకు మినహాయింపేమీ కాదు. సమాజంలో అతి కొద్దిమంది స్త్రీల సమస్యలైన సతీ సహగమనం, బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం వంటి సమస్యలపై పనిచేసిన వారిని గొప్ప సంఘ సంస్కర్తల్ని చేసి అశేష స్త్రీల జీవన్మరణ సమస్యలైన పేదరికం, వెట్టి చాకిరీ, అంటరానితనం, అవిద్య, మతం పేరున లైంగిక దోపిడీ వంటి వాటిపై అలుపెరుగని పోరాటం చేసి తమ జీవితాన్ని త్యాగం చేసిన జ్యోతీరావు ఫూలేని, సావిత్రీ బాయిని సంస్కర్తల జాబితాలో లేకుండా ఏడు తాటిచెట్ల లోతున పాతిపెట్టారు. అసత్యాలతో ప్రయోగాలు (experiments with untruths) చేసిన గొప్ప ‘దేశభక్తి’ వారిది.
ఇవ్వాళ జ్యోతీరావు ఫూలే సత్యశోధక సమాజాన్ని స్థాపించిన రోజు. మిత్రులందరికీ ఫూలే, అంబేడ్కర్ సామాజిక విప్లవాభివందనాలు.