- జీఎస్టీ పరిహార బాధ్యత కేంద్రానిదే
- జీఎస్టీ కౌన్సిల్ భేటీలో మంత్రి హరీశ్
హైదరాబాద్, ఆగస్టు 27 : జీఎస్టీ పరిహారం చెల్లించే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రాల ఆదాయానికి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర ప్రభుత్వం హమీ ఇవ్వడం వల్లే జీఎస్టీలో అన్ని రాష్ట్రాలు చేరాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారం రూ. 5,420 కోట్లు, ఐజీఎస్టీ రూ. 2,700 కోట్లు.. మొత్తం రూ. 8,120 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారమన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీశ్, సీఎస్ సోమేశ్, ఆర్థిక, వాణిజ్య, పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడారు. జీఎస్టీలో చేరడం వల్ల రాష్ట్రాలు 60 నుంచి 70 శాతం ఆదాయాన్ని కోల్పోయాయని, కేంద్రం మాత్రం 31 శాతం మాత్రమే కోల్పోయిందని చెప్పారు. ఈ కారణంగా రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని చెప్పారు. గతంలో జరిగిన 7వ, 8వ, 10వ కౌన్సిల్ సమావేశాల్లో జీఎస్టీ ఆదాయంలో రాష్ట్రాలకు లోటు ఏర్పడితే ఏదో రూపంలో పరిహారం చెల్లిస్తామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. సంచిత నిధి నుంచి లేదా, అప్పు తీసుకుని అయినా చెల్లిస్తామని కేంద్రం హమీ ఇచ్చిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం సంచిత నిఽధిలో జమ చేసి వాడుకుంటోందని, సెస్ తగ్గినపుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని సూచించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
కేంద్రమే జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాలని, రాష్ట్రాలు అప్పులు తీసుకుంటే రాష్ట్రానికో వడ్డీ రేటు ఉంటుందని, చెల్లింపుల్లోనూ గందరగోళం తలెత్తుందని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాలన్నారు. ఐజీఎస్టీకి సంబంధించి తెలంగాణకు రూ.2700 కోట్లు రావాల్సి ఉందని, జీఎస్టీ పరిహారం రూ. 5,420 కోట్లు రావాలని, ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. అత్యధికంగా జీఎస్టీ చెల్లించే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, అత్యంత తక్కువ పరిహారం తీసుకునే రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణ రూ.18,082 కోట్లు జీఎస్టీ సెస్ రూపంలో కేంద్రానికి చెల్లిస్తే, తీసుకున్నది రూ.3,223 కోట్లేనని పేర్కొన్నారు. జీఎస్టీ అమలు చేసిన మొదటి సంవత్సరంలో తెలంగాణ రూ. 169 కోట్లు మాత్రమే పరిహారం తీసుకుందని, రెండో ఏడాది పరిహారం సున్నా ఉండగా, మూడో ఏడాది స్వల్ప మొత్తమే పరిహారంగా దక్కిందని పేర్కొన్నారు. సెస్ వచ్చే ఈ ఏడాది మాత్రం కొవిడ్ అని, జీఎస్టీ అమలు వల్ల నష్టమని విభజిస్తే తీవ్రంగా నష్టపోతామన్నారు. ఈ విధానం.. ఆర్థిక నిర్వహణ సరిగా లేని రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చుతూ, అభివృద్ధి దిశగా అడుగులు వేసే తెలంగాణ వంటి రాష్ట్రాలకు నష్టం చేస్తోందని పేర్కొన్నారు.
Courtesy Andhrajyothi