– అనిల్ సద్గోపాల్
”నూతన విద్యా విధానం (ఎన్ఇపి)- 2020”ని జూలై 29న కేంద్రం ప్రకటించింది. అంతకు మునుపు కేంద్రం చేపట్టిన కొన్ని చర్యలను కూడా దీనితో కలిపి పరిశీలించాలి. అప్పుడే దీని వెనుక ఉన్న అసలు ఎజండా అర్ధమౌతుంది. మే 1వ తేదీన ప్రధాని మోడీ ఎన్ఇపి ని సమీక్షిస్తూ మన విద్యా విధానానికి గుండెకాయలా ఆన్లైన్ విద్యాబోధన ఉండబోతోందని ప్రకటించారు. మన చదువుల నాణ్యత పెరగడానికి, ప్రపంచ స్థాయికి మన విద్యా విధానం చేరుకోడానికి ఆన్లైన్ విద్యా బోధన దోహదం చేస్తుందని మోడీ అన్నారు. ఇక్కడ రెండు సందేహాలు తలెత్తుతాయి. మొదటిది-ఆన్లైన్ చదువు వలన విద్య నాణ్యత పెరిగినట్టు దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? తద్విరుద్ధంగా ఉపాధ్యాయునికి, విద్యార్ధికి మధ్య ప్రత్యక్ష మానవ సంబంధం లేకుండా ఉంటే విద్యార్ధి నేర్చుకోగలిగే సామర్ధ్యం తగ్గిపోతుందని చెప్పడానికి కావలిసినన్ని దృష్టాంతాలు ఉన్నాయి. ఇక రెండవది-ఈ ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలేమిటి? వీటిని ఎవరు నిర్ణయించారు? మన దేశంలోని ఉన్నత విద్యాలయాలు ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో మొదటి 100 ర్యాంకుల్లోనూ ఉండాలని కోరుకోవడం ఈమధ్య పరిపాటి అయింది. అయితే ఈ ర్యాంకులను నిర్ణయించేది మార్కెట్ శక్తులే తప్ప విద్యావేత్తలు కారు. విద్యా వ్యాపారానికి అనుగుణంగా ఈ ర్యాంకులు నిర్ధారించబడతాయి తప్ప సమాజాన్ని మార్చడంలో, పై మెట్టుకు తీసుకుపోవడంలో విద్య ఎటువంటి పాత్రను పోషించిందన్నది వాటికి పట్టదు.
కాని ఎన్ఇపి ఎటువంటి తటపటాయింపులూ లేకుండా ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల గురించి మాట్లాడుతోంది. మరి ఈ ఆన్లైన్ చదువు ప్రస్తావన ఎందుకొచ్చింది? మే 1వ తేదీన ప్రధాని ప్రకటన వెలువడిన వెంటనే గూగుల్ సంస్థ అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీలో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. ఆ వెనువెంటనే ఆన్లైన్ చదువుల వ్యాపారం వచ్చే నాలుగేళ్ళలో రూ. లక్షా 12 వేల అయిదు వందల కోట్లకు పెరగనుందని ఒక మార్కెటింగ్ ఏజన్సీ అంచనాలు ప్రకటించింది. అంటే ప్రధాని ఆన్లైన్ చదువుల గురించి ప్రకటించింది చదువుల నాణ్యతను పెంచడంకోసం కాదు. కార్పొరేట్ల వ్యాపారానికి, దోపిడీకి అవకాశాలు పెంచడం కోసం.
ఇదే దిశగా యుజిసి కూడా వ్యవహరిస్తోంది. తొలుత యూనివర్సిటీలు కరోనా పరిస్థితుల దృష్ట్యా పరీక్షలను నిర్వహించాలా వద్దా అన్నది ఆయా స్థానిక పరిస్థితులను బట్టి ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీయే నిర్ణయించుకోవచ్చునని అనుమతించింది. కాని జూలై 6న అందుకు విరుద్ధంగా సెప్టెంబరు నెలాఖరు లోపు అన్ని యూనివర్సిటీలూ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి తీరాల్సిందేనంటూ ఆదేశాలిచ్చింది. అప్పటికే ఏడు రాష్ట్రాలలో పరీక్షలు రద్దు చేసినట్టు ప్రకటించారు కూడా. కాని ఆ నిర్ణయాలు చెల్లవని, పరీక్షలు జరిపితీరాలని యుజిసి ఆదేశించింది. ఇదంతా కొన్ని హైటెక్ కంపెనీల లాభాలను పెంచడానికే తోడ్పడుతుంది.
మొత్తం స్టార్స్ ప్రోగ్రాం (స్ట్రెందెనింగ్ టీచింగ్-లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ ప్రోగ్రాం) కు అయ్యే ఖర్చులో కేవలం 1.4 శాతం మాత్రమే ప్రపంచబ్యాంకు ఇవ్వనుంది. అదికూడా రుణంగానే. అయినా ఆ ప్రపంచబ్యాంకు కనుసన్నలలోనే ఈ స్టార్స్ అంతా నిర్వహించనున్నారు. విద్యా వ్యాపారమే ప్రపంచబ్యాంకు ప్రధాన ఎజండా.
పై మూడు ఉదాహరణలను బట్టి ఎన్ఇపి వెనుక ఉన్నది నయా ఉదారవాద ఎజండా అన్నది స్పష్టం అవుతోంది. ఇదిగాక ఆరెస్సెస్-బిజెపి యొక్క ”హిందూ రాజ్యం” ఆధిపత్యం అనేది కూడా ఎన్ఇపిలో అంతర్భాగం.
* బ్రాహ్మణాధిపత్యం
”సుసంపన్నమైన మన భారతీయ ప్రాచీన విజ్ఞానం, సనాతన భావాలు” విద్యా విధానం స్వీకరించి బోధించాలని ఎన్ఇపి పేర్కొంది. ఇక్కడ కేవలం బ్రాహ్మణాధిపత్యానికి ప్రతీకగా ఉన్న వాటినే ప్రాచీన జ్ఞానానికి ప్రాతిపదికగా తీసుకున్నారు తప్ప బ్రాహ్మణేతర సాంప్రదాయాలను కాదు. గౌతమ బుద్ధుడు, మహా వీరుడు వంటి వారు సమాజాన్ని కులాలుగా విడదీయడాన్ని సవాలు చేశారు. తార్కికంగా ప్రశ్నించి తెలుసుకునే బోధనా పద్ధతులను అనుసరించారు. పరిశీలన, అనుభవం, ఆచరణ వంటివి జ్ఞానానికి ఆధారాలుగా ఉండాలే తప్ప విశ్వాసాలు జ్ఞానం కాజాలవని లోకాయతులు చెప్పారు. మరి ఇదంతా కూడా మన ప్రాచీన విజ్ఞానమే కదా? మన ప్రాచీన తమిళ సాహిత్యం చాలా విలువైనది. మనకు సంక్రమించిన వారసత్వం. క్రీ.శ. ఒకటో శతాబ్దం నుంచీ కేరళలో స్థిరపడిన సిరియన్ క్రైస్తవులు, వారి పాత్ర మన వారసత్వంలో భాగమే. వీటన్నింటినీ ఎన్ఇపి విస్మరించి కేవలం బ్రాహ్మణాధిపత్యాన్ని సమర్ధించే భాగాన్నే పరిగణన లోకి తీసుకుంది.
మధ్య యుగాల్లో ఇస్లామిక్ సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాలతో మిళితమై రెండింటినీ సమన్వయం చేస్తూ సూఫీ తత్వం ముందుకొచ్చింది. ఫలితంగా మన దేశం శాస్త్ర విజ్ఞానం, ప్రభుత్వ నిర్వహణ, వాణిజ్యం, సాహిత్యం, సంగీతం, కళలు వంటి రంగాలలో ముందడుగులు వేయగలిగింది. కాని ఎన్ఇపి ఈ విలువైన మధ్యయుగాల విజ్ఞానాన్ని విస్మరించింది. వ్యవసాయంలో, అటవీ సంరక్షణలో, ప్రకృతి వనరుల పరిరక్షణలో మన గిరిజనుల విజ్ఞానం, అనుభవాలు ఎన్ఇపి పరిగణన లోకి తీసుకోలేదు. ఇవన్నీ విడిచిపెట్టి కేవలం బ్రాహ్మణవాద విజ్ఞానమే మన యావత్తు విజ్ఞాన వారసత్వం అనుకుని 21వ శతాబ్దం లోకి అడుగు పెడితే మనం బోర్లా పడక తప్పదు.
* కుల వ్యవస్థ, పితృస్వామ్య భావజాలం
సమాజంలో అట్టడుగున ఉన్నవారు చదువు నేర్చుకుని, నైపుణ్యాన్ని సాధించి ఆర్థికంగా, సామాజికంగా పైస్థాయికి చేరుకోడానికి కుల వ్యవస్థ లోని ఆధిపత్య స్వభావం, పితృస్వామ్య భావజాలం లోని ఆంక్షలు ఏవిధంగా ఆటంకంగా వ్యవహరించాయో ఎన్ఇపి తన పరిగణన లోకి తీసుకోడంలో విఫలమైంది. సావిత్రీబాయి-జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహు మహరాజ్, డా|| బి.ఆర్. అంబేద్కర్ (మహారాష్ట్ర), సి.జ్యోతి దాస్, సింగార వేలర్, పెరియార్ ఇ.వి. రామస్వామి (తమిళనాడు), నారాయణ గురు, అయ్యంకళి (కేరళ), కందుకూరి, గురజాడ (ఆంధ్ర), రంగారావు, కృష్ణరాజ వడయార్ (కర్నాటక) వంటి వారు కుల వ్యవస్థకు, పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా సాగించిన కృషిని ఎన్ఇపి గుర్తించడంలో పూర్తిగా విఫలమైంది. మెరిట్ అనే కొలబద్దను మాత్రమే ఎన్ఇపి పరిగణిస్తోంది. రిజర్వేషన్లు, రాజ్యాంగం లోని 16వ అధికరణం, స్వాతంత్య్ర కాలం నుండీ ఇప్పటిదాకా సామాజిక న్యాయం సాధించడానికి జరిగిన ఉద్యమాలు- అన్నింటినీ విస్మరించింది. ”సామాజిక న్యాయం”కు పోటీగా ఐక్యరాజ్యసమితి (ఐరాస) రూపొందించిన నిలకడగల అభివృద్ధి లక్ష్యాలు-4 (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్-4) ముందుకు తెచ్చింది. అణగారిన తరగతులకు సాధికారత కల్పించే రాజ్యాంగ నిర్దేశిత లక్ష్యాలను పక్కనబెట్టి పాలకుల దయాధర్మాల మీద ఆధారపడ్డ ఐరాస లక్ష్యాలను మందుకు తేవడమే ఓ కుట్ర.
* అస్పష్టత, అంతర్గత వైరుధ్యాలు, నయవంచన
సూటిగా, స్పష్టంగా ఎన్ఇపి దేనినీ చెప్పలేదు. అంతా అస్పష్టంగా, దేనినీ తేల్చకుండా ప్రస్తావించింది. ఇది కూడా ఎన్ఇపి వ్యూహమే. ప్రాథమిక బాధ్యతల గురించి పేర్కొంటుంది కాని ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఉండదు. ‘ఉచిత విద్య’ స్థానంలో ‘స్థోమతకు తగ్గ విద్య’ వచ్చి చేరింది. ‘విద్య’ కు, ‘అక్షరాస్యత’కు మధ్య తేడా లేనట్టు, ‘యత’, ‘అనియత’ విద్యల మధ్య తేడా లేనట్టు వ్యవహరిస్తుంది. రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడ్డ తరగతులు, మత పరంగా, భాషా పరంగా మైనారిటీలు…వంటి పదాలేవీ ఎన్ఇపి లో లేవు. శతాబ్దాల నుండీ ఆ తరగతుల ప్రజలపై సాగిన, సాగుతున్న అణచివేతను, వివక్షతను మరుగు పరుస్తూ ఆ తరగతులనన్నింటినీ కట్టగట్టి ‘సామాజిక, ఆర్థిక ప్రతికూలతలతో ఉన్న సమూహాలు’ అని, ‘తక్కువ ప్రాతినిధ్యం కలిగిన సమూహాలు’ అని వ్యవహరించింది.
* ఫెడరలిజంపై, రాష్ట్రాల హక్కులపై దాడి
మన రాజ్యాంగపు మౌలిక లక్షణాలలో ఫెడరల్ స్వభావం చాలా ముఖ్యమైనది. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. కాని ఎన్ఇపి మొత్తం విద్యా వ్యవస్థకు సంబంధించిన కీలక నిర్ణయాలనన్నింటినీ కేంద్రం గుప్పెట్లో పెట్టడానికి పూనుకుంది. ప్రీ స్కూలు (నర్సరీ) దశ నుండి ఉన్నత విద్య వరకూ అన్ని స్థాయిల లోనూ రకరకాల నియంత్రణ వ్యవస్థలను ఎన్ఇపి ప్రతిపాదిస్తున్నది. ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన నుండి, ఉన్నత విద్యలో పరిశోధనల స్థాయి దాకా, అన్నీ ఈ నియంత్రణ వ్యవస్థల పరిథి లోనే ఉంటాయి. పరీక్షల నిర్వహణ, సిలబస్ రూపకల్పన, ఉపాధ్యాయుల ప్రమాణాలు అన్నీ కేంద్రం నియంత్రిస్తుంది. రాజ్యాంగం విద్యా రంగంలో రాష్ట్రాలకు, 5వ, 6వ షెడ్యూళ్ళ ప్రకారం గిరిజన పాలనా మండళ్ళకు, పంచాయితీలకు, జిల్లా పరిషత్తులకు వివిధ అధికారాలు కల్పించింది. ఎన్ఇపి వాటన్నింటినీ తోసిరాజంటోంది. ఇంత తీవ్రమైన మార్పులపై పార్లమెంటులో కనీస చర్చ కూడా లేకుండానే కేంద్రం ఎన్ఇపి ని ప్రకటించింది.
(‘సంఘపరివారం జొరబడడానికే ఎన్ఇపి’ తదుపరి సంచికలో)
(వ్యాసకర్త డిల్లీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ మాజీ డీన్, జాతీయ విద్యాహక్కు వేదిక వ్యవస్థాపక సభ్యులు)
Courtesy Prajashakti