చల్లపల్లి స్వరూపరాణి
రామాయణ, మహాభారతాలు, పురాణాలు, భగవత్గీత, మనుస్మృతి, పద్దెనిమిది పురాణాలు బ్రాహ్మణీయ వర్గాలు తమ వాదానికి అనుకూలంగా, తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోడానికి, దైవపరమైన ఆమోదం వుందని ప్రజల్ని నమ్మించడానికి రాయబడిన సాహిత్యం. కాలక్రమణిక (chronology) ప్రకారం చూస్తే యివన్నీ బౌద్ధాన్ని అంతమొందించి దాని స్థానంలో వైదిక హిందూ మతాన్ని(బ్రాహ్మణ వాదాన్ని) తిరిగి ప్రతిష్టించుకునే క్రమంలో సుమారు క్రీస్తు శకం వొకటో శతాబ్దం తర్వాత రాసుకున్నవి అని అర్ధమౌతుంది. కులాల పుట్టుకను దైవపరమైన విషయంగా చెబుతూ, సృష్టికర్త వివిధ శరీర అవయవాల నుంచి నాలుగు వర్ణాలు పుట్టాయని పేర్కొన్న వేదాలు అపౌరుషేయాలు(ప్రశ్నించడానికి వీలు లేనివి) అని షరతులు విధించిన వైదిక సాహిత్యాన్ని బుద్ధుడు ప్రశ్నించాడు. అంతేకాకుండా బ్రాహ్మణాధిక్యతను, కర్మ కాండల పేరుతో పురోహిత వర్గం సాగించే అహేతుకతను మొత్తంగా అశాస్త్రీయ వాదాన్ని బుద్ధుడు ప్రశ్నించి స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికగా ప్రత్యామ్నాయ వ్యవస్థను యేర్పాటు చేశాడు. ఆధ్యాత్మిక రంగంలో వున్న నిరంకుశ ధోరణికి బౌద్ధం సవాలు విసిరి జ్ఞానం అందరిది అని చెప్పింది.
బుద్ధుని సిద్ధాంతాన్ని బింబిసారుడు, అశోకుడు, కనిష్కుడు, హర్షవర్ధనుడు వంటి పాలవర్గం అధికారికంగా ప్రచారంచెయ్యడం వలన ప్రాచీన కాలంలో బౌద్ధం వేగంగా దూసుకు వెళ్ళింది. అశోకుడు తన రాజ్యాన్ని బౌద్ధ రాజ్యంగా ప్రకటించి అక్కడ బ్రాహ్మణ మతంలో వుండే యజ్ఞ యాగాలు, క్రతువులకు స్తానం లేదని వాటిని నిషేధించాడు. దీంతో బ్రాహ్మణ పూజారి వర్గం జీవన భృతిని కోల్పోయింది. బౌద్ధం అధికారిక మతమయ్యాక అనేక రకాలుగా అసంతృప్తికి గురైన బ్రాహ్మణ వర్గం పుష్యమిత్ర శుంగుడి రూపంలో ప్రతీకార చర్యకు పాల్పడింది. పుష్యమిత్రుడు అశోకుడి మునిమనవడైన బృహద్రదుడి రాజ్యంలో సైన్యాధికారి. అతడు కుట్రతో రాజుని చంపి రాత్రికి రాత్రి మౌర్య సామ్రాజ్యాన్ని అధిష్టించాడు. బౌద్ధ విప్లవంతో బ్రాహ్మణ వర్గం పోగొట్టుకున్న ప్రాభవాన్ని తిరిగి పొందడానికి తన అధికారాన్ని, శక్తియుక్తులను వుపయోగించాడు. పుష్యమిత్రుడే సుమతీ భార్గవ అనే బ్రాహ్మణ పండితుడి చేత మనుస్మృతిని రాయించాడు. మనుస్మృతి ద్వారా బౌద్ధం ప్రవేశ పెట్టిన సమత, కరుణ, ప్రజ్ఞ వంటి భావనలకు విరుద్ధమైన సామాజిక అసమానతల్ని, స్త్రీ అణచివేతని తిరిగి పునరుద్దరించాడు. నిజానికి స్త్రీలు, సూద్రుల విషయం లో మరింత కఠినతరం చేశారనవచ్చు. మనుస్మృతి మామూలు సాహిత్య గ్రంధం కాదు. అది వొకరకంగా శిక్షా స్మృతి లాంటిది. దానిని యీ దేశంలో శతాబ్దాల తరబడి పాటిస్తూనే వున్నారు. అందుకే ప్రముఖ Indologist, వెండీ డోనిగర్ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే వరకు యీ దేశంలో మనుస్మృతి శిక్షాస్మృతిగా చెలామణి అయ్యిందని పేర్కొంది. పుష్యమిత్రుడిలాగా రాజ్యాధికారాన్ని పొందకపోయినప్పటికీ తర్వాత బ్రాహ్మణ పురోహిత వర్గం రాజాస్థానాలలో మంత్రులుగానూ, ముఖ్య సలహాదారులుగానూ వుండి తమ వర్గ ప్రయోజనాలను నెరవేర్చుకున్నారు. కుల వ్యవస్థని స్థిరీకరిస్తూ, సామాజిక అసమానతలకు దైవపరమైన ఆమోదం వుందని ప్రజల్ని నమ్మించడానికి భగవత్గీత, యితిహాసాలైన రామాయణ, మహా భారతాలు, పద్దెనిమిది పురాణాలు యీ క్రమంలోనే రచించడం జరిగింది. భౌతికంగా బౌద్ధాన్ని అంతమొందించడానికి వొక వైపు బౌద్ధ బిక్షువులను హతమారుస్తూ విహారాలనూ, చైత్యాలనూ హిందూ దేవాలయాలుగా మారుస్తూ, మరోవైపు బ్రాహ్మణవాదాన్ని పునరుద్దరించడానికి తమకు అనుకూలమైన సాహిత్యాన్ని సృష్టించారు. ద్విముఖ వ్యూహంతో నడిచిన యీ బ్రాహ్మణవాద పునరుజ్జీవన దశని అంబేడ్కర్ ‘Counter Revolution’ అంటాడు.
బ్రాహ్మణ మత సాహిత్యమంతా పూర్తిగా అహేతుకంగా, కల్లబొల్లి కట్టుకధలతో నిండి వుండి వారి సన్నాయి నొక్కులకు విష్ణుమూర్తి అనే దేవుడి దశావతారాలను అడ్డం పెట్టు కోవడం చూస్తాం. బ్రాహ్మణవాదులు ‘ధర్మాన్ని’ (అంటే తమ కులాధిపత్యాన్ని) కాపాడటానికి విష్ణువు ఆయా కాలాలలో ఆయా రూపాలలో పుట్టాడనే మరో కొత్త కధని పురాణాల ద్వారా సృష్టించారు. వారిదంతా ‘లిఖిత పూర్వక మైన కుట్ర’ అనవచ్చు. వారి సాహిత్యంలో ‘ ధర్మం’ అంటే కులపరమైన అసమానతలు యెల్లకాలం కొనసాగి వారి పీఠాలు చెక్కుచెదరకుండా వుండడమే! వుదాహరణకు తన సూద్ర వర్ణ ధర్మానికి భిన్నంగా తపస్సు చేసుకుంటున్న శంభూకుడిని రాముడు చంపి వర్ణ ధర్మాన్ని కాపాడడం వంటిదన్నమాట! అయితే పురాణ లిఖిత సాహిత్యానికి సమాంతరంగా అనార్య, బ్రాహ్మణేతర జాతులు బ్రాహ్మణ సాహిత్యానికి భిన్నమైన కధనాలతో తమ ఆకాంక్షలను, ప్రాపంచిక ధృక్పధాన్ని చాటుతూ మౌఖిక సాహిత్యాన్ని సృష్టించుకున్నారు. వీరి మౌఖిక సాహిత్యమంతా కధలు, కళారూపాలలో వుండడం వలన ‘ జానపద సాహిత్యం’ గా ‘పామరుల కళలు’గా దీనిని బ్రాహ్మణ సాహిత్యకారులు తక్కువచెయ్యడం తెలిసిందే! బ్రాహ్మణ సాహిత్యంలోని ప్రముఖ పాత్రలైన రాముడు, కృష్ణుడు వంటి పాత్రలన్నీ వర్ణ ధర్మాన్ని ప్రతిష్టించేవిగా పాజిటివ్ గా వుంటే అనార్య జాతుల మౌఖిక సాహిత్యంలో అవే పాత్రలు దుర్మార్గంగా కనిపించడం విశేషం. బ్రాహ్మణ సాహిత్యం రాముడు చంపిన రావణుడిని రాక్షసుడంటే, అనార్యుల జానపద మౌఖిక సాహిత్యం రావణుడిని గొప్ప ఆత్మగౌరవం వున్న పోరాట యోధుడిగానూ, రాముడిని పిరికి పంద గానూ చిత్రిస్తుంది. బ్రాహ్మణుల మహాభారతం కృష్ణుడిని గొప్ప అవతార పురుషుడిగా చిత్రిస్తే అనార్యుల మౌఖిక సాహిత్యం ‘కపట నాటక సూత్రధారి’ గా చిత్రిస్తుంది.జానపద కళారూపమైన ‘అల్లీరాణి కధ’ లో మోసంతో అల్లీరాణిని వోడించారని కృష్ణుడిని, అర్జునుడిని కధకుడు బండబూతులు తిడతాడు. యిది వ్యాస భారతంలోని ‘ ప్రమీలార్జునీయం’ అనే కధకు జానపద, బ్రాహ్మణేతర సాహిత్య రూపం. అలాగే నరకుడు, మహిషాసురుడు శూర్పణఖ, జాంబవతి, అల్లీరాణి, హిడింబి వంటి పాత్రలు బ్రాహ్మణ సాహిత్యంలో నెగెటివ్ గానూ, జానపద సాహిత్యంలో పాజిటివ్ గానూ కనిపిస్తాయి. ‘తూర్పు రామాయణం’, ‘యెల్లమ్మ కధ’, వంటివి యీ కోవలోకి వస్తాయి. అలాగే వైదిక సాహిత్యం కులాల పుట్టుకకు దైవికమైన కట్టుకధలను అల్లితే అవైదిక మౌఖిక సాహిత్యం తమదైన దృక్పధంతో కులపురాణాలను రూపొందించి తమ జాతులలో ఆత్మ గౌరవాన్ని ప్రోది చెయ్యడానికి ప్రయత్నించిందని చెప్పాలి. యీ సాహిత్యాన్ని పరిశీలిస్తే బ్రాహ్మణేతర అనార్య జాతుల దృక్పధం మనకు అర్ధమౌతుంది. మౌఖిక సాహిత్యాన్ని పామర సాహిత్యంగా తీసి పారేయడం కూడా బ్రాహ్మణ వాద నైజమే! అందుకే ఫూలే, అంబేడ్కర్ లు పురాణ సాహిత్యాన్ని బ్రాహ్మణేతర దృష్టి నుంచి వ్యాఖ్యానించారు. మన దక్షిణాదిలో భాగ్యరెడ్డి వర్మ కూడా అదే తరహాలో బ్రాహ్మణ సాహిత్యాన్ని విశ్లేషించాడు. నిజానికి లిఖిత సాహిత్యం కంటే జానపద మౌఖిక సాహిత్యమే రాసిలోనూ, వాసిలోనూ ఎక్కువ.
అసలు రామాయణ, మహాభారతాలు, పురాణ కధలు నిజంగా చరిత్రలో జరిగాయా? లేదా? అనేదానికంటే అవి యే లక్ష్యాలతో, యెవరి ప్రయోజనాల కోసం రాయబడ్డాయి అనేది ఆలోచించవల్సిన విషయం. అలాగే జానపద మౌఖిక సాహిత్యం దానికి భిన్నమైన కధనాలను, దృక్పధాన్ని కలిగి వుండడం వెనుక చరిత్రలో అనార్యులైన నేటి పీడిత కులాలు పొందిన అణచివేత లేదా? దీనితో పాటు హిందూ మత సాహిత్యంలో కనిపించే నాయకులు(సురులు) ప్రస్తుతం యెవరి ప్రతినిధులుగా వున్నారు? వారి దృష్టిలో ‘రాక్షసులు’, ‘మొరటు’ వారిగా చెప్పబడ్డ వారు (అసురులు) యెవరి ప్రతినిధులుగా వున్నారు? అనేది స్పష్టమే! పరస్పర శత్రు కూటాలైన బ్రాహ్మణ వర్గం, దానిచే పీడనకు గురైన బ్రాహ్మణేతర వర్గాల మధ్య వున్న సంఘర్షణ కు వారి వారి సాహిత్యాలు అద్దం పడుతున్నాయనేది కాదనలేని అంశం. అంబేడ్కర్ భారతదేశ చరిత్ర మొత్తం బౌద్ధానికీ, హిందూ మతానికీ మధ్య జరిగిన పరస్పర ఘర్షణ అని అంటాడు. బౌద్ధం అన్ని కాలాలలో ప్రబలంగా లేకపోయినప్పటికీ బ్రాహ్మణ, బ్రాహ్మణేతర వర్గాలు భిన్న ధృవాలుగా వుండి, నిరంతరం ఘర్షణ పడుతూ తమ సాహిత్యాల ద్వారా వారి ధృక్పధాలను వ్యక్తపరిచాయనేది స్పష్టం.