– మార్షల్స్ సాయంతో రాజ్యసభలో అగ్రిబిల్లుల ఆమోదం
– పెద్దలసభలో బలప్రయోగం… టీవీ ఆడియో కట్
– వెల్లో ప్రతిపక్షాలు ఆందోళన.. రైతులకు మరణ శాసనమంటూ నినాదాలు
– సభలో సంఖ్యాబలం లేకుండా మూజువాణి ఓటుతో నెగ్గింపు
– ఓటింగ్ కు ప్రతిపక్షాలు డిమాండ్.. నో అన్న సర్కారు
– బిల్లుకు మద్దతిచ్చిన వైసీపీ, టీడీపీ
– కాంగ్రెస్, లెఫ్ట్, టీఆర్ఎస్ తదితర ప్రాంతీయ పార్టీల వ్యతిరేకత
న్యూఢిల్లీ : రైతులకు, వ్యవసాయ రంగానికి సంబంధించిన రెండు వివాదస్పద బిల్లులు రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ప్రభుత్వం ఆమోదించుకుంది. బిల్లుల ఆమోదం నియంతృత్వంగా జరిగింది. ప్రతిపక్షాలు డివిజన్ (ఓటింగ్) కోరితే అందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడలేదు. డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ సింగ్ చేత ముజువాణీ ఓటుతో ఆమోదించుకుంది. ఈ సందర్భంగా కనీవిని ఎరగని రీతిలో రాజ్యసభలో మార్షల్స్ పోటెత్తారు. ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు మార్షల్స్ను ప్రయోగించారు. రాజ్యసభ వెల్ మొత్తం మార్షల్స్, భద్రతా సిబ్బందితో నిండిపోయింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ టీవి ఆడియోను తొలగించారు. ఎవరికీ వినపించకుండా ఆడియోను కట్ చేశారు. రాజ్యసభ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ రకంగా ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం దారుణమని మండిపడ్డాయి.
తొలుత ప్రతిపక్షాలన్ని ముక్తకంఠంతో బిల్లులను వ్యతిరేకిస్తూ, సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం ససేమిరా అంది. దీంతో ప్రతిపక్షాలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టాయి. వెంటనే బిల్లుపై ఓటింగ్ ప్రక్రియ నిర్వహించకుండా, మూజువాణి ఓటుతో ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. దీంతో ప్రతిపక్షాలు తమ ఆందోళనకు తీవ్రతరం చేశాయి. మూజువాణి ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ కొద్ది సేపు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో ఇదే తంతు మొదలైంది. ఓటింగ్ను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ హౌస్ రూల్ బుక్ (రాజ్యసభ నియమ నిబంధనలతో కూడిన పుస్తకం)ను డిప్యూటీ చైర్మెన్కు చూపించేందుకు ప్రయత్నించారు. ఆయనను మార్షల్స్ అడ్డుకున్నారు. ”ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య దారుణ హత్య” అని డెరిక్ అన్నారు. టీఎంసీ, ఆమ్ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్ (అధికార బీజేపీ, ఎన్డీఏ భాగస్వామి) సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకులు లాగేందుకు ప్రయత్నించారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ రెండు బిల్లులను విస్తృత పరిశీలనకు కోసం రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష పార్టీలు చేసిన డిమాండ్ను తిరస్కరించారు. అలాగే సీపీఐ(ఎం) ఎంపీలు కెకె రాగేష్, ఎలమరం కరీం, సీపీఐ ఎంపీ బినరు విశ్వం, టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తదితర ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన సవరణ తీర్మానాలు మూజువాణి ఓటుతో వీగిపోయాయి. ఈ బిల్లులను కాంగ్రెస్, ఆర్జేడి, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీ,డీఎంకే, బీజేడీ, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీిఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్ సహా దాదాపు 20 పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీి, అన్నాడీఎంకె, జేడీయూ, వైసీపీ తదితర పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చాయి.
ప్రతిపక్షాల ఆందోళన నడుమ బిల్లులు ఆమోదం
ప్రతిపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య రెండు వ్యవసాయ బిల్లులకు మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆదివారం రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ”ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మర్స్ సర్వీసు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ బిల్లులు ఎంతో చారిత్రాత్మకమైనవని, రైతు జీవన శైలిలో చాలా మార్పులు తెస్తాయని అన్నారు. తరువాత ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. ఈ బిల్లులను విస్తృత పరిశీలన కోసం సెలెక్ట్ కమిటికి పంపాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులను సభ ఆమోదం తెలిపిందని ప్రకటించిన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
రైతులను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు?: డెరిక్ ఓబ్రెయిన్
”రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మీరేమో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2028 నాటికి గానీ రైతుల ఆదాయం రెట్టింపు కాదు. ఇలాంటి వాగ్దానాలపై ప్రజల్లో విశ్వసనీయత లేదు. నాలుగు నిబంధనల్లో కనీస మద్దతు ధర అనేది ఓ అంశం మాత్రమే. మేము ఆ నాలుగు అంశాలనూ వ్యతిరేకిస్తున్నాం. కేవలం కనీస మద్దతు ధరను మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్న ప్రచారాన్ని చేయకండి. నేనూ చాలా పెద్ద ప్రసంగాలు చేయగలను” అంటూ ధ్వజమెత్తారు. తమకు ఎవరూ లెక్చర్స్ ఇవ్వాల్సిన పని లేదన్నారు
రైతులను బానిసలుగా మారుస్తారా?: టీకేస్ ఇళంగోవన్
ఈ బిల్లులు రైతులను బానిసలుగా మారుస్తాయని, మోడీ సర్కార్ రైతులను బానిసలుగా మారుస్తారా? అని టిఎంకె ఎంపి టికెఎస్ ఇళంగోవన్ ప్రశ్నించారు. ”కార్పొరేట్ శక్తులకు రైతులు బానిసలవుతారు. జిడిపిలో రైతుల భాగస్వామ్యం 20 శాతం. ఈ బిల్లులు రైతుల ఉసురు తీసుకునేవి. రైతులను ఆట వస్తువులుగా మార్చేస్తాయి” అని విమర్శించారు.
రైతులు గురించి ఆలోచించరా? : రాం గోపాల్ యాదవ్
దేశంలోని రైతాంగం గురించి ఆలోచించరా అని ఎస్పీ రాజ్యసభ పక్షనేత రాం గోపాల్ యాదవ్ ప్రశ్నించారు. ”కేంద్రం వైఖరి చూస్తుంటే ఈ బిల్లులపై ఎలాంటి చర్చ చేపట్టకూడదన్నట్టుంది. కేవలం పరుగో పరుగు అన్నట్లుంది. గత ఆరు సంవత్సరాలలో జీడీపీలో వ్యవసాయ సహకారం 6 శాతం ఎందుకు తగ్గిపోయింది? ఆలోచించారా?” ప్రశ్నించారు.
రైతులకు డెత్ వారెంట్ : ప్రతాప్ సింహ బాజ్వా
వ్యవసాయ బిల్లులు అన్నదాతలకు డెత్ వారెంట్ లాంటివని కాంగ్రెస్ ఎంపీి ప్రతాప్ సింగ్ బస్వా వ్యాఖ్యానించారు. రైతుల ప్రాణాలను హరించే ఈ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును ఆమోదించడమంటే రైతుల మరణ శాసనంపై సంతకం చేయడం లాంటిదే” అని విమర్శించారు.
రైతులు బలహీనులని భావించకండి: నరేశ్ గుజ్రాల్
రైతులు బలహీనులని భావించవద్దని శిరోమణి అకాలీదళ్ పక్షనేత నరేష్ కుమార్ గుజ్రాల్ మోడీ సర్కార్కు హితవు పలికారు.”ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలి. పంజాబ్ రైతులు బలహీనులని భావించకండి” అని అన్నారు.
ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోడని హామీ ఇవ్వగలరా?: సంజయ్
ప్రతిపక్షాలు లేనిపోని పుకార్లు సష్టిస్తున్నాయని ప్రధాని మోడీ అంటున్నారని, కేవలం పుకార్ల ఆధారంగానే అకాలీదళ్కు చెందిన హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారా? చెప్పాలంటూ కేంద్రాన్ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఆందోళనపై పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కావాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లులతో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉండదని కేంద్రం ప్రకటించిందని, ఈ వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన తరువాత దేశంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోరన్న హామీని కేంద్రం ఇవ్వగలదా? అని ప్రశ్నించారు.
అంత తొందరెందుకు? : దేవెగౌడ, మాజీ ప్రధాని
వ్యవసాయ బిల్లులను ఆమోదింపజేసుకోవడంలో మోడీ ప్రభుత్వానికి ఎందుకింత తొందర? అని మాజీ ప్రధాని,జేడీఎస్ నేత దేవెగౌడ ప్రశ్నించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మోడీ ప్రభుత్వం ఎందుకింత తొందర పెడుతోందంటూ నిలదీశారు.
మళ్లీ ఈస్టిండియా కంపెనీలా జరుగుతోంది: మనోజ్ కుమార్
ఈ బిల్లుల ఆమోదంతో మళ్లీ ఈస్టిండియా కంపెనీలా జరుగుతోందని ఆర్జేడీి ఎంపీి మనోజ్ కుమార్ ఝా పేర్కొన్నారు. గతంలో ఈస్టిండియా కంపెనీ, పోర్చుగీసువారు భారత్పై ఎలా దాడి చేశారో ఇప్పుడు కూడా అదే జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
వైసీపీ, టీడీపీ మద్దతు, టిఆర్ఎస్ వ్యతిరేకం
ఈ బిల్లులను ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మద్దతివ్వగా… తెలంగాణలోని అధికార టిఆర్ఎస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యసభలో వైసీపీ విజయసాయిరెడ్డి రైతుల బిల్లులపై మాట్లాడగా ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. రైతు బిల్లులపై కాంగ్రెస్ తీరును ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలనే ఎన్డీఏ బిల్లుగా తీసుకొచ్చిందని, కాంగ్రెస్ ఆత్మవంచన మానుకోవాలని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించగా… ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని, అలాగే ఆయన క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, కెసి వేణుగోపాల్తో సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అలాగే ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. అవినీతి కేసులు ఉండటంతోనే మీరు బీజేపీికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతలు కూడా అభ్యంతరం తెలిపారు. దీంతో చైర్మెన్ స్థానంలో కూర్చోన్న ప్యానల్ చైర్మన్ ఎల్.హనుమంతయ్య స్పందిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలేమైనా ఉంటే తొలగిస్తామన్నారు.
Courtesy: NT