- మన్మోహన్ కేబినెట్లో మంత్రి
- గ్రామీణ ఉపాధి హామీ రూప శిల్పి
పట్నా/న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆదివారం ఎయిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర సమస్యల వల్ల తుది శ్వాస విడిచారని ఆయన సన్నిహితులు తెలిపారు. జూన్ నెలలో కరోనా బారిన పడిన రఘువంశ్ పట్నాలో చికిత్స తర్వాత కోలుకున్నారు.
అయితే, శుక్రవారం మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించినా లాభం లేకపోయింది. ఆర్జేడీ నేతగా సుదీర్ఘకాలం పని చేసి, లాలూ ప్రసాద్ యాదవ్కు కుడి భుజంగా పేరు గడించిన 74 ఏళ్ల రఘువంశ్ ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. ఆర్జేడీ ఉపాధ్యక్షుడిగా, 5 సార్లు ఎంపీగా, మన్మోహన్ సింగ్ కేబినెట్లో మంత్రిగా సేవలందించారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి రూపకల్పన చేసి ప్రజాదరణ పొందారు. గత ఎన్నికల్లో నితీశ్తో పొత్తు పెట్టుకోవాలని రఘువంశ్ పట్టుబట్టడంతో లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వితో సంబంధాలు బెడిసికొట్టాయి.
ప్రముఖుల సంతాపం
రఘువంశ్ ప్రసాద్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తదితరులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.