– వివాదాస్పద ఒప్పందంలో మోడీ హస్తం
– యుద్ధ విమానాల సంఖ్య 126 నుంచి 36కు తగ్గింపు
– అనుభవం..అడ్రస్లేని అంబానీ కంపెనీని చేర్చిన ప్రధాని
– మనోహర్ పారికర్, జైశంకర్లకు తెలపకుండా అనేకమార్పులు
– రాఫెల్ కుంభకోణంపై మీడియాలో సంచలన కథనాలు.. వచ్చేనెలలో సుప్రీంకోర్టు తీర్పు !
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమా నాల కొనుగోలు విషయంలో ప్రధాని మోడీ, ప్రధాని కార్యాలయం అనుస రించిన విధానాలు బీజేపీ ప్రభుత్వా న్ని దాదాపు ‘బోనులో నిలబెట్టినంత’ పనిచేశాయి. ఫ్రాన్స్ మీడియాలో సైతం దీనిపై సంచలన కథనాలు వచ్చాయి. ఇక మనదేశంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ద హిందు’ రాసిన పరిశోధనాత్మక కథనాలు పార్లమెం ట్ను కుదిపేశాయి. సమాధానాలు చెప్పలేక కేంద్రం మాట తడబడింది. ఈ ఒప్పందంపై పలు పిటిషన్లు సుప్రీంకోర్టు ముంగిట ఉన్నాయి. వచ్చే నెలలో తీర్పు ఇవ్వబోతోంది. ఈ తరుణంలో దసరా రోజున రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఫ్రాన్స్కు వెళ్లి మొదటి రాఫెల్ యుద్ధ విమానాన్ని అధికారికంగా స్వీకరించారు. ఈనేపథ్యంలో ‘రాఫెల్ ఒప్పందం’కు సంబంధించి వివాదాస్పదమైన అంశాలు ఇలా ఉన్నాయి…
విమానాల సంఖ్య 126 నుంచి 36కు తగ్గింపు
126 రాఫెల్ యుద్ధ విమానాల్ని భారత్కు అందజేయాల న్నది యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్స్తో చేసుకున్న ఒప్పందం. ఇందులో ఆఫ్సెట్ పార్ట్నర్గా(భాగస్వామి) ప్రభుత్వరంగ సంస్థ ‘హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్’ను మన్మోహన్ ప్రభుత్వం చేర్చింది. ఒప్పందంలో అత్యంత కీలకమైన ఈ అంశాల్ని కొన్ని వారాల వ్యవధిలోనే ప్రధాని మోడీ నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం మార్చేసింది. 126 యుద్ధ విమా నాలు కాకుండా కేవలం 36యుద్ధ విమానాలతో ఒప్పందం చేసుకున్నారు. ఆఫ్సెట్ పార్ట్నర్గా హెచ్ఏఎల్ను తీసేసి, అనిల్ అంబానీకి చెందిన కంపెనీని చేర్చారు. రక్షణ ఉత్ప త్తుల తయారీలో ఓనమాలు తెలువని సంస్థను చేర్చారు. అనుభవం, అడ్రస్లేని కంపెనీకి భాగస్వామ్యం కల్పించారు.
పాత ఒప్పందంలోని కీలకఅంశాల్ని ఆరువారాల్లో మోడీ సర్కార్ మార్చేసింది. అదికూడా అప్పటి రక్షణమంత్రి మనో హర్ పారికర్, విదేశాంగ కార్యదర్శి జైశంకర్లకు తెలియకుం డా పీఎంఓ అంతా తానై కథను నడిపింది. ఈ తతంగ మంతా మీడియాకు చేరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. పాత ఒప్పందాన్ని రద్దు చేసిన విధానం అనుమా నాలు ఉన్నాయంటూ ‘ద హిందు’ రాసిన కథనాలు సంచల నం సృష్టించాయి. రద్దుకు సంబంధించి సరైన సమాచారా న్ని మోడీ సర్కార్ బయటపెట్టడం లేదనీ, సుప్రీంకోర్టును సైతం తప్పుదారి పట్టిస్తున్నారనీ ఆ కథనాల్లో పేర్కొన్నారు. 126 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం 95శాతం పూర్తయిందని స్వయంగా ‘డస్సాల్ట్’ (రాఫెల్ తయారీ కంపెనీ) సీఈఓ ఎరిక్ ట్రాపియర్ చెప్పారు. మరి 95శాతం పూర్తయిన ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేశారంటే ‘మోడీ సర్కార్’నుంచి సమాధానం కరువు!
వేలకోట్ల ప్రభుత్వ ధనంతో ఇలాగేనా?
ప్రధాని మోడీ ఫ్రాన్స్ వెళ్లి ‘ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్’ చేసుకొని వచ్చారు. రాఫెల్ కొత్త ఒప్పందం చేసుకున్నామని ప్రకటించారు. ఇది పూర్తిగా కొత్త ఒప్పందం, వేలకోట్ల రూపాయలు వేరే దేశానికి చెల్లించాల్సిన ఒప్పంద మిది. అలాంటప్పుడు విమానాల సాంకేతిక అంశాలు, వాటి పరిశీలన, నాణ్యత, మన అవసరం, భారత్కు వచ్చాక ఫ్రాన్స్ తీసుకోవాల్సిన బాధ్యత…తదితర అంశాలు మన రక్షణశాఖ నిపుణులు, విదేశాంగశాఖ ఉన్నతాధికారులు తేల్చాలి. ఆ తర్వాత సగటున ఒక విమానానికి ఎంత ధర చెల్లించాలి అన్నది నిర్ణయమవుతుంది. ఈ వడపోతలు, పరిశీలనలు ఏమీ లేకుండా ఏకపక్షంగా ప్రధాని మోడీ కొత్త ఒప్పందం చేసుకొని వచ్చారు. భారతీయ కార్పొరేట్ సంస్థలకు మేలుచేయడానికి ఈ పద్ధతిలో వెళ్లారని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా…తదితరులు ప్రశ్నలు లేవనెత్తారు.
ఫ్రాన్స్ గ్యారెంటీ ఇవ్వదు!
యూపీఏ మొదట కుదుర్చుకున్న ‘126 రాఫెల్ యుద్ధ విమానాల’ కొనుగోలులో ఉన్న అత్యంత ముఖ్యమైన అంశం సార్వభౌమత్వ హామీ (ఫ్రాన్స్ ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ). ప్రధాని మోడీ చేసుకొచ్చిన కొత్త ఒప్పందంలో ఇది లేదు. యుద్ధ విమానాన్ని అందజేసినప్పుడు, చేసిన తర్వాత ఏదైనా లోపం తలెత్తితే ఫ్రాన్స్ ఎలాంటి బాధ్యతా తీసుకోదు. లీగల్గా ఫ్రాన్స్ బాధ్యత వహించే అవకాశం కొత్త ఒప్పందంలో లేదు. వేలకోట్ల రూపాయల ప్రభుత్వ ధనం చెల్లిస్తున్న చోట ఇలాంటి అంశాలు మనదేశానికి ఎంతగానో నష్టం చేస్తాయని రక్షణరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధ విమానం ధర పెంపు!
యూపీఏ కుదుర్చుకున్న 126 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో సగటు విమానం ధర (బెంచ్మార్క్ ప్రైజ్) కన్నా రెండుమూడు రేట్లు పెంచి చెల్లించడానికి మోడీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. బయటికి మాత్రం చాలా తక్కువకు కొంటున్నామని మోడీ సర్కార్ చెప్పుకుంది. మోడీ సర్కార్ మాటలు నిజం కావని ‘డస్సాల్ట్’ నుంచి సేకరించిన సమాచారం చెబుతోంది. బెంచ్మార్క్ ధర పెంపును రక్షణమంత్రిగా మనోహర్ పారికర్ తీసుకోవాలి. కానీ క్యాబినెట్ కమిటీ (రక్షణశాఖ) తీసుకుంది. రక్షణ ఉత్పత్తుల సేకరణ కౌన్సిల్ (డీఏసీ) అంగీకారం తెలుపకుండా, క్యాబినెట్ కమిటీ ఏకపక్షంగా నిర్ణయించటం దారుణమైన తప్పు అని రక్షణరంగ నిపుణుడు మెహంతీ చెబుతున్నారు. ఈ సందేహాలు, అనుమానాలకు వచ్చే నెల సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులో సమాధానం దొరుకుతుందా? లేదా అన్నది చూడాలి!
Courtesy Navatelangana