భూపాల్
ప్రజలందరికీ ‘ఆరోగ్యమే మహాభాగ్యం‘ అనే విధానం ఉండాలి. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రం మీ పర్సేనాకు మహాభాగ్యంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా నేర్పిన గుణపాఠం నుండైనా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలలో ప్రజారోగ్యం గురించి ప్రభుత్వ విధానాల గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్నది. కరోనాను కూడా కనకవర్షం కురిపించే విధంగా మార్చుకున్న కార్పొరేట్ల దుర్మార్గాలు చూశాక ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగుపర్చాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరిగింది. కోవిడ్-19 పరిస్థితుల్లో స్పెయిన్లో ప్రయివేట్ ఆస్పత్రులను సైతం ప్రభుత్వం జాతీయం చేసింది. ప్రజల ఆరోగ్య ఖర్చులు ప్రభుత్వాలే భరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. క్యూబా లాంటి చిన్న దేశం అనేక దేశాలు దేశంలో కరోనాను అరికట్టి 70 దేశాలకు సహాయం చేస్తున్నది. కానీ మనదేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశాయి. కరోనా ట్రీట్మెంట్కు కార్పొరేట్ హాస్పిటల్స్ను అనుమతించి వారి దోపిడీకి బాటలు వేశాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు చేసిన వాగ్దానాలు వట్టి మాటలుగానే మిగిలాయి. ఫలితం ఈ ఐదు మాసాలలో దేశంలో కరోనా కేసులు 27లక్షలు, మరణాలు 51 వేలు దాటాయి. కరోనా ప్రభావిత దేశాలలో ప్రపంచంలో 3వ స్థానంలోి, ఆసియాలో మొదటి స్థానంలో ఉన్నాం. ఇలాగే కొనసాగితే బహుశా త్వరలో మొదటి స్థానంలోకి రావచ్చు. ఎందుకు ఈ దుస్థితి? ఏ విధానాల ఫలితమిది అనేది గమనంలోకి తీసుకోకుంటే పరిష్కారం లభించదు.
కేంద్రంలో బీజేపీ పాలకులు చెప్పినట్లు నమస్కారాలు పెడితే, ప్లేట్లు కొడితే, పూలు చల్లితే, దీపాలు వెలిగిస్తే కరోనా అరికట్టబడదు. బీజేపీ ప్రజాప్రతినిధుల ఉపదేశాలైన ఆవు మూత్రం తాగితే, బురద పూసుకుంటే, హనుమాన్ చాలీసా చదివితే, అప్పడాలు తింటే పోదని వారికే కరోనా సోకడంతో జ్ఞానోదయమయ్యి ఆసుపత్రుల వెంబడి పరిగెత్తారు. అంటే వైద్యం దీనికి పరిష్కారం. అందులోనూ ప్రభుత్వ వైద్యరంగం అయితేనే పేద ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా బతికే స్థితి ఉంది. కానీ ప్రభుత్వ వైద్యరంగం సరళీకరణ విధానాల వల్ల 1991 నుంచి కునారిల్లడం ప్రారంభమైంది. నాటి నుంచి ప్రయివేటు వైదర్యరంగం మూడుపూలు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నది. నూతన ఆర్థిక విధానాల పేరిట ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ షరతులకు లొంగి, రుణాలు తీసుకొని ప్రజలకు ఉచిత సేవల నుండి తప్పుకోవాలనే విధానం అనుసరించడం వల్ల ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాల ఖర్చు తగ్గిపోయింది. దీని ఫలితమే నేటి వైద్య రంగం దుస్థితి. నాటినుంచి పాలించిన పాలకులందరికీ ఈ దుష్ట విధానంలో భాగం ఉంది.
ప్రభుత్వ వైద్యరంగం పరిస్థితి – సమస్యలు!
74వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకున్నాం. 136 కోట్ల మంది భారతీయులకు ఆరోగ్యం పట్ల భరోసా లేదు. ఆర్థిక అసమానతలు, సామాజిక వైవిద్యాలు ఉన్న మనదేశంలో ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలని 1943లో వేయబడిన ‘భోర్ కమిటీ’ 1946లో ప్రతిపాదనలు ఇచ్చింది. దేశంలో ప్రాథమిక ఆరోగ్యంపై కేంద్రీకరించాలని ఈ కమిటీ చెప్పింది. 40 వేల జనాభాకు ఒక పీహెచ్సీ ఉండాలని, ఇద్దరు డాక్టర్లతో కలుపుకుంటే 35మంది పర్మినెంట్ పారామెడికల్ సిబ్బంది ఉండాలని నిర్దేశించింది. ఇది నేటికీ అమలుకావడం లేదు. ప్రపంచంలో మొదటిసారి ప్రాథమిక ఆరోగ్యంపై 1978లో పూర్వ ‘కజక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్’ అయిన నేటి కజకిస్థాన్లోని ‘ఆల్మాఅటా’లో అంతర్జాతీయ మహాసభలో 2000 నాటికి ‘అందరికీ ఆరోగ్యం’ తీర్మానం చేశారు. డబ్ల్యుహెచ్ఓలోని దేశాలన్నీ దీనికి కట్టుబడాలని చెప్పాయి. అందుకు మనదేశం కూడా అంగీకరించింది. కానీ నేటివరకు అనేక తీర్మానాలు చేసుకున్నా లక్ష్యాలు పెట్టుకున్నా ఫలితం సాధించలేదు. పేదరికాన్ని, ప్రాథమిక ఆరోగ్య అవసరాలను చూపించి యూరోపియన్ కమిషన్తో సహా అనేక సంస్థల నుంచి గ్రాంట్లు పొందారు. కానీ పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేదన్నది వాస్తవం.
దేశంలో వైద్య రంగంలో మానవ వనరుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. డబ్ల్యుహెచ్ఓ ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టరు ఉండాలి. ప్రభుత్వ డాక్టర్ల సంఖ్య లెక్కిస్తే 10,189 మందికి ఒక డాక్టరు ఉన్నాడు. దేశంలో 6లక్షల మంది డాక్టర్ల కొరత ఉంది. ఇంకా నర్సులు 20లక్షల మంది అవసరం ఉంది. ప్రభుత్వం మాత్రం ప్రైవేటు డాక్టర్లు, ప్రభుత్వ డాక్టర్లు అందరినీ కలిపి 1,456మందికి ఒక డాక్టరు ఉన్నారని చెబుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో 1,250మందికి ఒక డాక్టరు ఉంటే ప్రక్క రాష్ట్రాలలో మెరుగుగా ఉంది. తమిళనాడులో వెయ్యికి 4, కర్నాటక 2.8, కేరళ 2.3, ఢిల్లీ 3 చొప్పున ఉన్నారు. మన రాష్ట్రంలో నేటికీ 10 వేల పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 2,500 డాక్టరు పోస్టులు, మిగిలిన 7,500 పారామెడికల్. పోస్టులు ఖాళీ ఉన్నాయి. 1996 నుంచి 4వ తరగతి పోస్టుల భర్తీ రద్దుచేసి ఔట్సోర్సింగ్కు అప్పగించారు. ఒక్కోరకమైన ఆరోగ్య సమస్యకు ఒక్కో స్కీం పెట్టారు. మలేరియా, ఫైలేరియా, టీబీ, కంటి సమస్య, ఎయిడ్స్ తదితరాలతో పాటు చివరకు 108, 104, 102, నేషనల్ హెల్త్ మిషన్ పేరిట మొత్తం ఆరోగ్య వ్యవస్థను స్కీమ్ల క్రింద మార్చివేశారు. అందులో పనిచేసే సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకుండా చేశారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించారు. బడ్జెట్లో కోతలు పెడుతున్నారు.
ప్రయివేటు కార్పొరేట్ రంగంకు పెద్దపీట వేయడంతో దేశంలో ప్రతి సంవత్సరం 57 మిలియన్ల (5.7 కోట్ల) మంది పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. పేదవారి ఆదాయంలో 65శాతం వైద్యం కోసం జేబునుండి ఖర్చు పెట్టుకొని అప్పులపాలై ఆస్తులు అమ్ముకుంటున్నారు. సంవత్సరానికి 7లక్షల మంది బలహీనంగా ఉండి రోగనిరోధకశక్తి లేక బలమైన ఆహారం, మంచినీరు లేకపోవడంతో చిన్న చిన్న బబ్బులకే చనిపోతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే నిధులు పెంచాలి. కేంద్రీకరణ పెరగాలి. కేంద్ర బడ్జెట్లో 6శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తే 2శాతం మించడం లేదు. ధనిక రాష్ట్రమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం 1.82 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం రూ.5,116 కోట్లు (2019-20) 3.5శాతం మాత్రమే కేటాయించింది. ఇందులో సగం పైగా జీతభత్యాలకే ఖర్చు అవుతున్నది. 2014 తరువాత 6ఏండ్లుగా ఒక్క కొత్త ఆస్పత్రిని నిర్మించలేదు. ప్రతి జిల్లాకు నిమ్స్ స్థాయి హాస్పిటల్ కడతానన్నారు. ఉస్మానియా కొత్త భవనం కడతామన్నారు. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామన్నారు. కానీ ఒక్కటీ నెరవేరలేదు. కరోనాను అరికట్టడంలో రూ.1,000 కోట్లు, రూ.5,000 కోట్లు అయినా ఖర్చు పెడతామన్నారు. కానీ పీపీఈ కిట్లు, గ్లౌజులు, శానిటైజర్లకు కూడా కొరత ఉంది. వందల మంది డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎం, పారామెడికల్ సిబ్బంది కరోనా బారినపడితే కనీసం వైద్యఖర్చులు కూడా భరించడంలేదు. కరోనా వచ్చిన వారంతా హో క్వారంటైన్లో ఉండి ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాలని చేతులెత్తేశారు. డా|| నరేష్ డిప్యూటీ డిఎంహెచ్ఓ, హెడ్ నర్స్ వి. జయమణి, ల్యాబ్ టెక్సీషియన్ కుర్షిద్ అలీ, సుబ్బరాజులు కరోనా వల్ల మరణించారు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల పరిస్థితి ఇది. ఒక కేరళ తప్ప ప్రజారోగ్యంపై శ్రద్ధ పెడుతున్న ప్రభుత్వమే లేదు.
కేరళ వామపక్ష ప్రభుత్వం దేశానికి, ప్రపంచానికి ఒక రోల్మోడల్ అయ్యింది. కేరళ ప్రభుత్వం కోవిడ్-19 కోసం రూ.20 వేల కోట్ల ఖర్చు చేస్తున్నది. సంవత్సర బడ్జెట్లో 5.5శాతం రూ.7,186 కోట్లు కేటాయించి అందులో సగం నిధులు పట్టణ, గ్రామీణ ఆరోగ్య సేవలకు యిస్తున్నది. కరోనా సమయంలో కూడా 5వేల పోస్టులు భర్తీ చేసింది. కరోనాను జయప్రదంగా కంట్రోల్ చేసి ప్రపంచం మన్ననలు అందుకుంటున్నది. దీనికి ప్రధాన కారణం పట్టణ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం, విద్యా, వైద్యరంగాలకు తమ ప్రాధాన్యతలో పెద్ద పీట వేయడమే. యిప్పటికైనా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేరళను ఆదర్శంగా తీసుకోవాలి.
ప్రభుత్వం తీసుకోవల్సిన తక్షణ చర్యలు
కేసిఆర్ ప్రభుత్వం (అసెంబ్లీలో) వాగ్దానం చేసినట్టు తక్షణం రూ.5వేల కోట్లు కేటాయించి, కరోనాను అరికట్టడంలో కేరళ పద్ధతి (డబ్లూహెచ్ఓ గైడ్లైన్స్)ని అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించి ఆదుకోవాలి. ఫ్రంట్లైన్లో పని చేస్తున్న వైద్య సిబ్బందిలో కరోనా బారిన పడినవారికి వైద్య ఖర్చులు భరించాలి. చనిపోతే కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా యివ్వాలి.
మరోపక్క దీర్ఘకాలికంగా వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి యిప్పటి నుండైనా ప్రణాళిక ఉండాలి. రాష్ట్ర బడ్జెట్లో 10శాతం నిధులు కేటాయించాలి. ఖాళీ పోస్టుల భర్తీతో పాటుగా కాంట్రాక్టు, ఔట్స్సోర్స్ ఉద్యోగులందరిని పర్మనెంట్ చేయాలి. 108, 102, 104, హాస్పిటల్స్లోని 4వ తరగతి వర్కర్స్ అందరికీ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలి. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో ప్రతి 20 వేల జనాభాకు ఒక పిహెచ్సి, గిరిజన ప్రాంతాలలో అయితే 10 వేల జనాభాకు ఒక పీహెచ్సీని ఏర్పాటు చేయాలి. గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖల మధ్య సమన్వయంతో ఆరోగ్యం, అంటు వ్యాధుల నివారణ పట్ల అప్రమత్తత పెంచాలి. కార్పొరేటు హాస్పిటల్స్పై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. వారి దోపిడీని అరికట్టాలి.
ప్రజలందరికీ ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే విధానం ఉండాలి. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రం మీ పర్సేనాకు మహాభాగ్యంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా నేర్పిన గుణపాఠం నుండైనా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి.
Courtesy: NT