- ఐదు నెలల తర్వాత రోడ్డెక్కిన ట్రావెల్స్
- కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ జాగ్రత్తలు
- ఆన్లైన్లో 150 ప్రైవేట్ బస్సులకు రిజర్వేషన్లు
హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రైవేట్ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల రవాణా శాఖ అధికారుల అనుమతితో ఈ సర్వీసులు శనివారం రాత్రి నుంచి మొదలయ్యాయి. అన్లాక్- 4లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో 5 నెలల తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. ఏపీలోని ప్రధాన ప్రాంతాల నుంచి ఈ బస్సు సర్వీసలు ప్రారంభమయ్యాయి. సుమారు 150 ప్రైవేటు బస్సులకు ఆన్లైన్లో టికెట్ రిజర్వేషన్ విధానాన్ని ఆపరేటర్లు మొదలుపెట్టారు. బస్సుల్లో కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్, వీలైనంత వరకు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఏపీ నుంచి ఆర్టీసీ బస్సులు తిప్పేలా అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో తిప్పే కిలోమీటర్లు తగ్గించాలని.. తాము ఎట్టి పరిస్థితిలోనూ ఏపీ భూ భాగంలో కిలోమీటర్లు పెంచబోమని టీఎస్ ఆర్టీసీ ఇంతకు ముందు స్పష్టం చేసింది. దాంతో ఆర్టీసీ సర్వీసులు నడపటంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.
Courtesy Andhrajyothi