ఆయన ట్వీట్లు దురుద్దేశపూరితం: సుప్రీం.. 20న తీర్పు
న్యూఢిల్లీ, ఆగస్టు 14: సుప్రీంకోర్టు ప్రస్తుత, పాత ప్రధాన న్యాయమూర్తులపై దురుద్దేశపూరితంగా రెండు ట్వీట్లు పెట్టిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ నేరపూరిత కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు ప్రకటించింది. తాను సుమోటోగా చేపట్టిన ఈ కేసులో ఆయన్ను దోషిగా ప్రకటించింది. ప్రజాహితం కోసం కోర్టు పనితీరుపై చేసిన సద్విమర్శగా ఆ ట్వీట్లను భావించలేమని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి మీద సర్వోన్నత న్యాయస్థానం తనకు తానుగా కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటే అటార్నీ జనరల్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రశాంత్ భూషన్ తరఫు న్యాయవాది చేసిన వాదనను తోసిపుచ్చింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే ఇటీవల మోటార్ సైకిల్ మీద కూర్చొని ఫొటోలకు ఫోజ్ ఇవ్వడంపై ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్ దురుద్దేశ పూరితమని, కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. గత ఆరేళ్లలో ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టిన నలుగురు న్యాయమూర్తులపై మరో ట్వీట్లో చేసిన దుర్భాషపూరిత ఆరోపణలు కూడా సుప్రీంకోర్టును అపకీర్తి పాలు చేసే ఉద్దేశంతో చేసినవేనని చెప్పింది. ప్రశాంత్ భూషణ్ నేరానికి శిక్షను ఈ నెల 20వ తేదీన ఖరారు చేస్తామని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ధిక్కార నేరానికి గరిష్ఠంగా ఆర్నెల్ల జైలు శిక్ష నుంచి కనిష్ఠంగా రెండు వేల జరిమానా వరకు విధిస్తారు. కోర్టు ధిక్కారం కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం 108 పేజీల తీర్పును విడుదల చేసింది. తనకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకొనే అధికారం రాజ్యాంగంలోని 129వ అధికరణ నుంచి దఖలు పడిందని, 1971 నాటి కోర్టు ధిక్కార చట్టంలోని నిబంధనలేవీ తమ అధికారాన్ని పరిమితం చేయబోవని స్పష్టం చేసింది. సుమోటో పిటిషన్ల విషయంలో అటార్నీ జనరల్ సహా ఎవరి అనుమతీ అక్కర్లేదని తేల్చిచెప్పింది. ఈ కేసులో న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ట్విట్టర్ సంస్థ ప్రతివాదులుగా ఉన్నారు. వివాదాస్పద రెండు ట్వీట్ల గురించి తెలిసిన వెంటనే వాటిని తొలగించామని ట్విట్టర్ ఇచ్చిన సమాధానంతో సర్వోన్నత న్యాయస్థానం సంతృప్తి చెందింది. సుప్రీంకోర్టును లాక్డౌన్ మోడ్లో పెట్టి, ప్రజలకు న్యాయం కోసం అభ్యర్థించే ప్రాథమిక హక్కు లేకుండా చేసి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీజేపీ ఎంపీకి చెందిన రూ.50 లక్షల బైక్పై మాస్కు, హెల్మెట్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నారని జూలై 27న ప్రశాంత్ భూషణ్ ట్వీట్ పెట్టారు. అంతకుముందు జూన్ 27న మరో ట్వీట్లో… గత ఆరేళ్ల కాలంలో ఎమర్జెన్సీ లేకున్నా ప్రజాస్వామ్యం ఎంత విధ్వంసానికి గురైందో చరిత్రకారులు గుర్తిస్తారని, అందులో గత నలుగురు ప్రధాన న్యాయమూర్తుల పాత్ర కూడా ప్రస్తావనకు వస్తుందని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. వీటిపై ధర్మాసనం స్పందిస్తూ, ఆయన ఆరోపణలు చేసినప్పటికి సుప్రీంకోర్టు వేసవి సెలవుల్లో ఉందని, వేసవి సెలవుల ధర్మాసనం అలుపెరగక పని చేస్తోందని గుర్తు చేసింది. ఇలాంటి దాడులను తగినంత దృఢంగా ఎదుర్కోకపోతే ఇతర దేశాల్లో దేశ గౌరవం దెబ్బతింటుందని, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిర్భయంగా, నిష్పాక్షికంగా వ్యవహరించే కోర్టులు అవసరమని పేర్కొంది. వాటిపై విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా జరిగే దురుద్దేశపూరిత దాడులను ఏ మాత్రం అనుమతించరాదని పేర్కొంది.
దురదృష్టకరం… న్యాయవాదులు
సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని సీనియర్ న్యాయవాదులు వికాస్ సింగ్, అరవింద్ దాతర్ వ్యాఖ్యానించారు. ప్రశాంత్ భూషణ్ తన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉపయోగించుకున్నారని, ఇది కోర్టు ధిక్కారం కిందకు రాదని అభిప్రాయపడ్డారు.
Courtesy Andhrajyothi