– భారత్లో నాలుగేండ్లు తగ్గిన మానవుల సగటు ఆయుర్దాయం
– యూపీలో 8.5 ఏండ్లు తగ్గుదల
– ప్రపంచ సగటు కన్నా భారత్లో ఎక్కువ
– ప్రపంచవ్యాప్తంగా 88లక్షల మరణాలు: శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడి
” నేడు అత్యధిక సంఖ్యలో మానవుల మరణాలకు ‘గాలి కాలుష్యం’ కారణమవుతోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా చనిపోతున్నవారి సంఖ్య 88లక్షలు. మానవుల సగటు ఆయుర్దాయాన్ని 3ఏండ్లు తగ్గిస్తున్నది. ఇది భారత్లో 4ఏండ్లు, యూపీలో 8.5ఏండ్లుగా నమోదైంది. ఎయిడ్స్, మలేరియా, యుద్ధాలకన్నా…గాలి కాలుష్యం ప్రమాదకరంగా మారింది ”
– మ్యాగజైన్ ‘కార్డియోవాస్క్యులర్ రీసెర్చ్’ ప్రత్యేక కథనం
పారిస్ : మానవుడు జీవితకాలాన్ని గాలి కాలుష్యం గణనీయంగా దెబ్బతీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవుల ఆయు ప్రమాణం మూడేండ్లు తగ్గడానికి, ఏటా 88లక్షల మంది మరణించడానికి (2015లో) గాలి కాలుష్యం కారణమైందని శాస్త్రవేత్తల (మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్, జర్మనీ) తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. వాతావరణంలోకి కార్బన్ ఉద్గారాలు పెరగటం, అత్యంత ప్రమాదకరమైన ధూళి కణాలు శ్వాసకోశ సమస్యల్ని పెంచుతున్నదని, బొగ్గు, చమురు వాడకం తగ్గించుకోవాలని అధ్యయనం పేర్కొన్నది. గాలి కాలుష్యం వల్ల 2015లో చోటుచేసుకున్న మరణాలపై శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధన అంశాల్ని మెడికల్ జర్నల్ అయిన ‘కార్డియోవాస్క్యులర్ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసింది.
ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన జోస్ లీలైవ్డ్(జర్మనీ) మాట్లాడుతూ…” ప్రజా ఆరోగ్యానికి పొగాకు వాడకం కన్నా గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది. సహజవాయువు, ముడి చమురు స్థానంలో పునరుద్పాదక వనరుల వాడకం పెరగాలి” అని అన్నారు.
మలేరియా కన్నా ప్రమాదకరం!
ప్రతిఏటా నమోదవుతున్న మలేరియా మరణాలతో పోల్చితే గాలి కాలుష్యం వల్ల ఏర్పడే మరణాలు 19రేట్లు ఎక్కువగా ఉన్నాయి. హెచ్ఐవీ లేదా ఎయిడ్స్తో పోల్చితే 9రేట్లు ఎక్కువ. మద్యపానం (ఆల్కహాల్)తో పోల్చితే మూడు రేట్లు ఎక్కువ. మానవుల మరణాల్లో అత్యధికం గుండెపోటు, మెదడులో స్ట్రోక్ కారణమవుతున్నాయి. సగం మరణాలు వీటివల్లే ఏర్పడుతున్నాయని, మిగతా సగం మరణాలకు మధుమేహం, హైబీపీ, ఊపిరితిత్తుల సమస్యలు…మొదలైనవి కారణమవుతున్నాయని అధ్యయనం తెలిపింది.
6శాతం మరణాలు గాలికాలుష్యం వల్లే
మొత్తం మరణాల్లో ఆరు శాతం గాలి కాలుష్యం వల్ల ఏర్పడుతున్నాయి. నేడు ప్రజలు పెద్ద సంఖ్యలో కాలుష్యం బారిన పడటం వల్ల వారిలో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యల తలెత్తుతున్నాయి. పొగాకు వాడకం, గాలి కాలుష్యం…ఈ రెండింటినీ మనం అడ్డుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా గాలి కాలుష్యాన్ని అరికట్టడాన్ని నిర్లక్ష్యం చేశామని చెప్పారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో మానవుల సగటు ఆయుర్దాయం 4.1 ఏండ్లు తగ్గిందని అధ్యయనం తెలిపింది. కాలుష్యం వల్ల ఇండియాలో ప్రజల సగటు ఆయుర్దాయం 4 సంవత్సరాలు, పాకిస్థాన్లో 3.8ఏండ్లు తగ్గింది.
యూపీలో పరిస్థితి భయానకం
సుమారుగా 20కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో గాలి కాలుష్యం కారణంగా ప్రజల సగటు ఆయుర్దాయం 8.5ఏండ్లు తగ్గిందని ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’ తెలుపుతున్నది. భారత్లో నమోదైన (4ఏండ్లు) సగటు కన్నా ఇది రెట్టింపు.
చైనాలో పెరిగిన ఆయుష్షు
బీజింగ్: చైనా ప్రభుత్వం 2015 నుంచి కాలుష్యంపై యుద్ధం ప్రకటించింది. కాలుష్య కారణమైన 18,000 పరిశ్రమ లను శాశ్వతంగా మూసివేసింది. కొత్త బొగ్గు ఉత్పత్తి కేంద్రాలను మూడు సంవత్సరాలకు నిషేధించింది. సోలార్ ద్వారా ఒక లక్ష మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. ఎడారి ప్రాంతంలో చెట్లు పెంచి అడవులను పెంపొందిస్తున్నారు. నగరాలలో ఎక్కడికక్కడ నీళ్లు ఇంకి పోయేలా ఏర్పాట్లు చేసింది. దానితో భూగర్భం నీటి మట్టం పెరిగింది. వాటిని ”స్పాంజ్ సిటీలు” అంటున్నారు. ఇండ్లల్లోని బాలక్కానీల్లో, ఇండ్లలో కూడా మొక్కలు పెంచడంతో కాలుష్యం తగ్గి ప్రజల ఆయుష్షు మూడు సంవత్సరాలు పెరిగింది.
Courtesy: NT