20 అంతస్తుల పోలీస్ టవర్స్ ఖర్చు పైపైకి..
టవర్స్ నుంచి మానిటరింగ్ కు ప్రత్యేక శాటిలైల్ వ్యవస్థ
రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో తెలుసుకునే టెక్నాలజీ
లక్ష సీసీ కెమెరాల ఫుటేజీని నిమిషాల్లో ప్రాసెస్ చేస్తుంది
పోలీస్ శాఖకు ముందు నుంచీ కేసీఆర్ స్పెషల్ ట్రీట్
హైదరాబాద్, వెలుగు: పోలీస్ టవర్స్ ఎత్తు మాదిరిగానే ఖర్చు కూడా అంతకంతకు పెరిగిపోతోంది. టవర్ల నిర్మాణానికి ముందుగా రూ. 300 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఇప్పుడు రెండింతలకు పైగా అయ్యే చాన్స్ ఉంది. ఇప్పటికే 600 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరో 100 కోట్లు ఖర్చు చేసేందుకు సర్కార్ రెడీగా ఉంది.
ప్రతి కదలికపైనా నిఘా
చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయే అత్యాధునిక నిఘా వ్యవస్థపోలీస్ టవర్లతో అందుబాటులోకి రాబోతోంది. మారుమూల ప్రాంతాల్లో జరిగిన సంఘటనలనూ వెంటనే తెలుసుకునే టెక్నాలజీ సిస్టమ్ వస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రం మొత్తం గట్టి పోలీసు పహారాలోకి వెళబోతోంది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలీస్ టవర్స్ (ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్) త్వరలో పూర్తి కానుంది. లక్ష సీసీటీవీల ఫుటేజీ నినిమిషాల్లో ప్రాసెస్ చేసే టెక్నాలజీని టవర్స్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకి వచ్చినప్పటినుంచి తిరిగి ఇంటి కెళ్లే వరకుప్రతి కదలికను టవర్స్ నుంచి మానిటరింగ్ చేసే టెక్నాలజీని సమకూర్చనున్నారు. టవర్స్లో కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం కోసం మరో రూ. 150 కోట్ల ఖర్చవొచ్చని చెబుతున్నారు. టెండర్లు దక్కించుకున్న షాపుర్జీ పల్లోంజీ సంస్థ 2015 నవంబర్లో నిర్మా ణ పనులు స్టార్ట్ చేసింది. రెండున్నరేళ్లలో టవర్స్ అందుబాటులోకి వస్తాయని అంచనా వేశారు. కానీ నిధుల కొరత వల్ల పనుల్లో ఆలస్యం జరిగింది. కేసీఆర్ రెండోసారి సీఎం బాధ్యతలు చేపట్టాక టవర్స్ పనులు వేగవంతం చేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఆదేశించారు. కానీ కరోనావల్ల పనులు మళ్లీ ఆలస్యమయ్యాయి. ఈ మధ్యే వేగం పెంచారు. ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. అవి పూర్తవగానే పోలీస్ శాఖకు బిల్డింగ్ అప్పగించనున్నారు. టవర్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు కావాల్సిన టెక్నాలజీ పరికరాలను సెట్ చేయడానికి నాలుగైదు నెలలు పట్టొచ్చని ఆఫీసర్లు అంటున్నారు.
ప్రత్యేక శాటిలైట్ వ్యవస్థ
రాష్ట్రంలో పోలీసు నిఘాను టవర్స్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేకంగా శాటిలైట్ వ్యవస్థ అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం పోలీసు శాఖ శాటిలైట్ను రెంట్కు తీసుకునే చాన్స్ ఉంది. మారుమూల ప్రాంతంలో జరిగిన ఘటనను కూడా టవర్స్ నుంచి గుర్తించి వెంటనే స్థానిక పోలీసులను అలర్ట్ చేసేందుకు శాటిలైట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సీసీ కెమెరాలను హైదరాబాద్లోని పోలీస్టవర్స్కు లింక్ చేయడానికి ప్రత్యేక శాటిలైట్ అవసరం ఉంటుందని ఓ సీనియర్ ఆఫీసర్ తెలిపారు.
నిఘా నడమ జనజీవనం
పోలీస్ టవర్స్అందుబాటులోకి వస్తే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కుదరదు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న ప్రజలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. అనుమానితుల కదలికలను టవర్స్ నుంచే ఈజీగా గుర్తించవచ్చు.‘ఇంటి నుంచి బయటికొచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లేవరకు ఏం చేస్తున్నాడు. ఎక్కడెక్కడికి వెళ్లాడు. ఎవరెవర్ని కలిశాడు’ లాంటి విషయాలను క్షణాల్లో కనిపెట్టొచ్చని ఓ సీనియర్ ఆఫీసర్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే మెయిన్ సిటీలు, జిల్లా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. పోలీస్ టవర్స్ అందుబాటులోకి రాగానే అన్నిపోలీస్ కమిషనరేట్స్ పరిధిలోని పోలీస్ వ్యవస్థను టవర్స్ నుంచి మానిటరింగ్ చేసేలా అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే పోలీసు గుప్పిట్లో రాష్ట్రం
రాష్ట్రం ఇప్పటికే పోలీసు గుప్పిట్లో ఉందని విమర్శలున్నాయి. ప్రతి రాజకీయ నేత కదలికలపైనా నిఘా పెట్టారని, లీడర్ల ఫోన్లను టాపింగ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష లీడర్ల ఇంటి చుట్టూ నలుగురైదుగురు పోలీసులు మఫ్టీలో ఉంటారని ప్రచారం ఉంది. ప్రజా సమస్యలపై ఆందోళన చేసేందుకు నేతలు ఇంటి నుంచి బయటికి రాగానే అరెస్టు చేస్తున్నారు. హౌజ్ అరెస్టులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ మధ్య శ్రీశైలం పవర్ ప్లాంట్ ఫైర్ యాక్సిడెంట్ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన నేతలను వందల సంఖ్యలో పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. గత నెలలో భూపాలపల్లి జిల్లాలో దళితుడు రాజబాబును స్థానిక టీఆర్ఎస్ లీడర్లు కొట్టి చంపారని ఆరోపణలు వచ్చాయి. ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేతలను మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు.
పోలీస్శాఖకు ముందు నుంచీ ప్రియారిటీ
కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ పోలీస్శాఖకు స్పెషల్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పోలీసు వెహికల్స్ను పక్కన పెట్టి కొత్త వెహికల్స్ను సమకూర్చారు. పోలీసులకు వారాంత సెలవులు శాంక్షన్ చేశారు. హోంగార్డులకు జీతాలు పెంచారు. గత పాలకులకు భిన్నంగా పోలీసు బాసులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రగతి భవన్లో జరిగే చాలా రివ్యూల్లో డీజీపీలకు చోటు కల్పించారు. డీజీపీగా రిటైరయిన అనురాగ్ శర్మను సలహాదారుడిగా నియమించారు.
Courtesy Velugu