– విస్కాన్సిన్లో నిరసనల హోరు
– కాల్పులను ఖండిస్తూ ఆందోళనలు..బాష్పవాయుగోళాల ప్రయోగం
కెనోషా : అగ్రరాజ్యంగా పిలుపించుకుంటున్న అమెరికాలో నల్లజాతీయులకు రక్షణ కరువైంది. కొన్ని రోజుల క్రితం జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడికి సంబంధించిన ఘటన మరవకముందే.. విస్కాన్సిన్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. జాకబ్ బ్లేక్ అనే 29 ఏండ్ల నల్లజాతీయుడిపై ఇద్దరు పోలీసు అధికారులు కాల్పులు జరిపి తీవ్రంగా గాయపర్చిన విషయం విదితమే. బాధితుడి చిన్నారులు చూస్తుండగానే అధికారులు ఈ దురాగతానికి పాల్పడటం గమనార్హం. కాగా, ఈ ఘటనపై విస్కాన్సిన్లోని కెనోషా సిటీలో అశాంతి రాజేసుకున్నది. కాల్పుల ఘటనను వ్యతిరేకిస్తూ కెనోషా నగరంలో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనను చేపట్టారు. బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో నిరసనకారులు పోలీసు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలుచేశారు. బృందంలోని కొందరు ఆందోళనాకారులు న్యాయస్థానం పక్కనే ఉన్న మునిసిపల్ పబ్లిక్ సేఫ్టీ భవనంలోకి బలవంతంగా వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడి కర్ఫ్యూను ధిక్కరిస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, వారిపై పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. నల్లజాతీయుడిపై కాల్పుల ఘటనను విస్కాన్సిన్ గవర్నర్ టోనీ ఎవర్స్ కూడా ఖండించారు. పోలీసుల వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఈ అంశానికి సంబంధించి పోలీసు సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా ప్రత్యేక శాసన సభ సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు.
కాగా, శస్త్ర చికిత్స తర్వాత బ్లేక్ స్థిరంగా ఉన్నాడని ఆయన తండ్రి వెల్లడించారు. బాధితుడి ముగ్గురి కుమారులు తమ కారులో కూర్చున్నప్పుడు కొద్ది అడుగుల దూరం నుంచే ఆయనపై కాల్పులు జరిగాయని బ్లేక్ కుటుంబ న్యాయవాది బెన్ క్రంప్ తెలిపారు. ఈ ఘటనపై అధికారులు జవాబుదారిగా ఉండాలని అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డెమోక్రాటు నేత జో బిడెన్ తెలిపారు. ” మరొక నల్లజాతీయుడు ఇలా బలి కావడం బాధాకరం. ఆగ్రహంతో దేశం మరోసారి మేల్కొంటుంది” అని ఆయన అన్నారు.
Courtesy: NT