హైదరాబాద్: ఆస్పత్రులు రోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్న ఫీజులపై నియంత్రణ ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు జరిగేలా చూడాలని పిల్ లో కోరారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–2010ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఫోరం ఫర్ ఎగైనెస్ట్ కరప్షన్ అనే సంస్థ తెలంగాణ హైకోర్టులో పిల్ వేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖలను ప్రతివాదులుగా చేర్చింది.
“రోగుల నుంచి నిర్ధిష్ట ఫీజులను మాత్రమే వసూలు చేయాలని, ఆస్పత్రుల్లో కనీస ప్రమాణాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని 2012లో నోటిఫై చేసింది. తెలంగాణ శాసనసభ కూడా ఆ చట్టాన్ని 2017లో ఆమోదించింది. జిల్లా స్థాయిల్లో అథారిటీలు, రాష్ట్ర స్థాయిలో కౌన్సిల్ ఫర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏర్పాటు చేయాలన్న చట్ట నిబంధనలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. పేదలకు తక్కువ ఫీజుతో వైద్యం అందజేయాలనే చట్టం అమలు జరిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలి’ అని ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టును ‘ఫోరం ఫర్ ఎగైనెస్ట్ కరప్షన్’ సంస్థ కోరింది.