- ఇది తీవ్రమైన విషయం
- దర్యాప్తు అవసరం: హైకోర్టు
అమరావతి : హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన విషయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదని పేర్కొంది. దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ డి.రమేశ్తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేసినప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్కుమార్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఓ ఐపీఎస్ అధికారిని, న్యాయమూర్తుల కదలికలను దగ్గరగా పరిశీలించేందుకు ఒక్కొక్కరిపై ఐదారుగురిని నియమించారని తనకు విశ్వసనీయ సమాచారం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. అన్ని వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. అందుకు అంగీకరించిన హైకోర్టు దీనిపై విచారణను 20కి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టుకు చెందిన కొందరు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, దీనిపై సీబీఐ నేతృత్వంలోని సిట్తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ విశాఖపట్నం గోపాలపట్నానికి చెందిన న్యాయవాది ఎ.నిమ్మీగ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
రాజకీయ పెద్దల ప్రోద్బలంతో ఫోన్ ట్యాపింగ్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీˆ యత్నించారన్న ఆరోపణలపై వాస్తవాలను తేల్చాలని ఆయన కోరారు. ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని కోర్టుకు సమర్పించారు.
దర్యాప్తునకు ఆదేశించండి: పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్కుమార్
ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్కుమార్ వాదనలు వినిపిస్తూ… ‘ఫోన్ ట్యాపింగ్కు పాల్పడటం చట్ట విరుద్ధం. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇది గోప్యత హక్కును హరించడమే. దర్యాప్తునకు ఆదేశించండి…’ అని కోరారు. పత్రిక కథనం ఆధారంగా దర్యాప్తు ఎలా సాధ్యమన్న ధర్మాసనం ప్రశ్నకు బదులిస్తూ.. ‘ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు వాటిని రక్షించాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇటీవల ఇచ్చిన తీర్పులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టింగ్లను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అప్పటి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీకి కూడా ఫిర్యాదు చేశారు. దేశ చరిత్రలో ఆర్జీ ఫిర్యాదు చేసిన సందర్భాలు లేవు. హైకోర్టు జడ్జిలకు, న్యాయస్థానానికి కళంకం తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, మద్దతుదార్లు యత్నాలు చేశారు…’ అని వివరించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఒక పత్రికలో ప్రచురితమైన కథనాన్ని తర్జుమా చేసి ఆయన చదివి వినిపించారు.
ప్రభుత్వం చేసిందంటారా?: ధర్మాసనం
ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. మీ ఆరోపణల ప్రకారం ప్రభుత్వమే ట్యాపింగ్ చేసిందంటారా? అని న్యాయవాదిని ప్రశ్నించింది. ఔను అని ఆయన బదులిచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ.. ‘రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఆ విషయాన్ని అఫిడవిట్లో పేర్కొన్నాను. ట్యాపింగ్ వ్యవహారం మొత్తాన్ని ఓ ఐపీఎస్ అధికారి పర్యవేక్షించారు…’ అని వివరించారు. దీనిపై ఆ అధికారి పేరు చెప్పాలని ధర్మాసనం కోరగా.. ఆ వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తానన్నారు.
తప్పుడు కథనాన్ని ప్రచురించారు: ఏఏజీ
సీఎస్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఫోన్లు ట్యాపింగ్ చేశారని తప్పుడు కథనాన్ని పత్రికలో ప్రచురించారు. పత్రిక యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాం. ఆ కథనం ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారు? పత్రిక యాజమాన్యాన్ని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చి వార్త ప్రచురణకు ఆధారం ఏమిటో వివరాలు అఫిడవిట్ వేసేలా ఆదేశాలు జారీ చేయాలి…’ అని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘ ప్రస్తుతం ఆ మేరకు ఆదేశాలు జారీ చేయలేం. పత్రికకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని చెబుతున్న నేపథ్యంలో తదుపరి చర్యలు మీరే తీసుకోవచ్చు…’ అని వ్యాఖ్యానించింది. ఇది తీవ్రమైన విషయం కాబట్టే సంబంధిత మీడియాను ప్రతివాదిగా చేర్చి నోటీసు ఇవ్వాలని కోరుతున్నట్లు అదనపు ఏజీ తెలిపారు. ఆ పత్రికకు వ్యతిరేకంగా పిటిషనర్ ఎలాంటి అభ్యర్థన చేయనప్పుడు ఎందుకు నోటీసు జారీ చేయాలని ధర్మాసనం ప్రశ్నించింది. వార్త ప్రచురణకు మూలాధారం ఏమిటో తగిన సమయంలో పరిశీలిస్తామని తెలిపింది. పిటిషనర్ అదనపు అఫిడవిట్ వేస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయని పేర్కొంది.
న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్ జోక్ అనుకుంటున్నారా?: ధర్మాసనం
రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ తరఫున ప్రభుత్వ న్యాయవాది(జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలిస్తే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నట్లు అర్థమవుతోందని, ఇలాంటి తీవ్రమైన అంశంపై అన్ని వివరాలు లేకుండా పిటిషనర్ కోర్టును ఆశ్రయించడానికి ఇదేమి జోక్ కాదని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందిస్తూ…. ‘న్యాయమూర్తుల ఫోన్ నంబర్లు ట్యాపింగ్ చేయడం జోక్ అనుకుంటున్నారా? అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తే మీకు వచ్చిన సమస్య ఏమిటి..’ అని ప్రశ్నించింది. దీనికి జీపీ బదులిస్తూ… ‘మాకు అభ్యంతరం లేదు. పత్రికలో కథనం పరిశీలిస్తే కొందరు న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడినట్లు ఉంది. ఏ న్యాయమూర్తి మీడియా హౌజ్కు వెళ్లి మాట్లాడినట్లు మేము అనుకోవడం లేదు. పరిపాలనాపరంగా ప్రభుత్వం దీనిపై హైకోర్టుకు వివరాలు పంపింది. సంబంధిత పత్రికకు నోటీసు ఇచ్చాం. అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. వ్యాజ్యంలో పత్రికను ప్రతివాదిగా చేర్చాలి…’ అని కోరారు.
Courtesy Eenadu