- బ్రిటన్లో ఓ వలంటీర్కు
- ‘ట్రాన్స్వర్స్ మైఎలిటిస్’
- మెదడు, వెన్నెముకల్లోని
- మైలీన్ తొడుగుకు వైరల్ ఇన్ఫెక్షన్
- తాత్కాలికంగా నిలిచిన ట్రయల్స్
- ‘న్యూయార్క్ టైమ్స్’,
- ‘స్టాట్ న్యూస్’ సంచలన కథనాలు
- పునః సమీక్షిస్తాం: ఆస్ట్రాజెనెకా
- భారత్లో సమస్యేం లేదు: ‘సీరం’
న్యూయార్క్ : ఆశలు రేకెత్తించిన ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ (ఏజెడ్డీ1222) ప్రయోగ పరీక్షలకు అనుకోని అవాంతరం వచ్చిపడింది. దానికి సంబంధించి జరుగుతున్నట్రయల్స్ మంగళవారం నుంచి తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈమేరకు వివరాలతో ‘న్యూయార్క్ టైమ్స్’, ‘స్టాట్ న్యూస్’లు సంచలన కథనాలను ప్రచురించాయి. బ్రిటన్లో ప్రయోగ పరీక్షల్లో పాల్గొంటున్న ఓ వలంటీర్ ‘ట్రాన్స్వర్స్ మైఎలిటి్స’తో అస్వస్థతకు గురవడంతో ఆస్ట్రాజెనెకా ఈ ఆకస్మిక నిర్ణయానికి వచ్చిందని వెల్లడించాయి. ఆ వలంటీర్ మెదడు, వెన్నెముకల్లోని మైలీన్ తొడుగుకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపాయి. దీనిపై ఆస్ట్రాజెనెకా కంపెనీ స్పందించింది.
‘‘ప్రయోగ పరీక్షలు జరిగే క్రమంలో ఇలాంటి అవాంతరాలు, తాత్కాలిక నిలుపుదలలు సాధారణం. ఇంత భారీఎత్తున ట్రయల్స్ నిర్వహించే క్రమంలో ఎక్కడో ఒకచోట వలంటీర్లు అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకు గల కారణాన్ని తెలుసుకునేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీతో దర్యాప్తు జరగాల్సి ఉంది’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. దర్యాప్తు ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేసి ప్రయోగ పరీక్షల నిర్వహణలో కాలయాపన జరగకుండా చూస్తామని, వలంటీర్ల ఆరోగ్య భద్రతకు పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమ దేశంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన ప్రతిపాదనలను పునః సమీక్షిస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్తో భారత్లో ప్రయోగ పరీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయని, వలంటీర్లలో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) బుధవారం ప్రకటించింది. విదేశాల్లో జరుగుతున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాల్లో తలెత్తిన దుష్ప్రభావం, పలు దేశాల్లో ప్రయోగాలను నిలుపుదల చేసిన అంశాన్ని తమకు ఎందుకు తెలియజేయలేదంటూ ఎస్ఐఐకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) డాక్టర్ వి.జి.సోమానీ షోకాజ్ నోటీసు జారీచేశారు. రోగుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇచ్చేలా దర్యాప్తు నివేదిక వచ్చే వరకు ప్రయోగ పరీక్షలను ఎందుకు నిలుపుదల చేయకూడదో తెలుపాలంటూ షోకాజ్ నోటీసులో కోరింది. త్వరగా సమాధానం ఇవ్వకుంటే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.
Courtesy Andhrajyothi