వాహనదారులకు విశ్రాంతి మందిరాలు ఎక్కడ?
ఐదేళ్ల కిందటే ప్రతిపాదించినా ఫలితం శూన్యం
మూడుచోట్ల ఏర్పాటు చేయలని నిర్ణయం
స్థలం సిద్ధంగా ఉన్నా అమలుకాని ప్రతిపాదన
రెండేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 98 మంది మృతి
హైదరాబాద్: మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అధికారుల నిర్లక్ష్యం వల్ల బాహ్యవలయ రహదారి (అవుటర్) ప్రమాదాలకు నిలయంగా మారింది. గత రెండేళ్లుగా 98 మందికి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 158 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డుపై ఎక్కడా విశ్రాంతి మందిరాలు కానీ, మూత్రవిసర్జన కేంద్రాలు కాని లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. అయినా ఇది నిజం! ఒకసారి రోడ్డెక్కితే మూత్రవిసర్జనకు ఎక్కడా అవకాశం కూడా లేదు. మళ్లీ రోడ్డు దిగేవరకు ఉగ్గబట్టుకోవలసిందే. పదేళ్ల కిందటే ఈ రోడ్డుపై మూడుచోట్ల విదేశీ తరహాలో అత్యాధునిక షాపింగ్ మాల్స్ తో కూడిన విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదు. ఫలితంగా అనేకమంది వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన వాహనాలను ఆపడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
అవుటర్ రింగ్ రోడ్డు ప్రారంభమై పదేళ్లు రింగ్ రోడ్డు పొడవు 158 కిలోమీటర్లు మొత్తం వరసలు 8 ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు రోజుకు లక్ష ప్రయాణించే వారు దాదాపు 5 లక్షలు ఇంటర్ ఛేంబు 19.
రోడ్డు పక్కగా వాహనాలు నిలపడానికి ఒక వరస ఉన్నా అక్కడ వాహనం ఆపి మూత్రవిసర్జన చేయడానికి ఏర్పాట్లు లేవు. తప్పనిసరై కొందరు రోడ్డు పక్కన అడ్డదిడ్డంగా వాహనాలను ఆపుతున్నారు. అలాంటి చోటే ప్రమాదాలు జరుగుతున్నాయి. విశ్రాంతి మందిరాలు లేకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాల డ్రైవర్లకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండడం లేదు. ఇది కూడా ప్రమాదాలకు ఓ కారణం.ఆగి ఉన్న వాహనాలతో ముప్పు
* గత రెండేళ్లలో రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకుపోయే వాహనాలు రోడ్డు పక్కన ఆపిన వాహనాలను ఢీకొనడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. * విశ్రాంతి లేక నిద్రమత్తులో డివైడర్ను ఢీకొనడం వల్ల మరికొంతమంది చనిపోయారు. * డ్రైవర్లకు విశాంత్రి లేకపోవడం, అతి వేగం ప్రమాదాలకు కారణమని పోలీసు విశ్లేషణలో తేలింది. సొంతంగా చేపడితే బోలెడు ఆదాయం! ఈ రోడ్డులో మూడుచోట్ల హెచ్ఎండీఏనే అన్ని వసతులతో విశ్రాంతి మందిరాలను నిర్మిస్తే ప్రయాణికులు సేద తీరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి మంచి ఆదాయం కూడా వస్తుంది. బల్దియా రూ. 50 కోట్లు ఖర్చు చేస్తే కనీసం ఒక్కచోటైనా ప్రయోగాత్మకంగా విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఐదేళ్ల కిందటే ప్రతిపాదనలు విదేశాల్లోని అవుటర్ రింగ్ రోడ్లను పరిశీలించిన హెచ్ఎండీఏ అధికారులు తుక్కుగూడ, బొంగులూరు, పెద్ద అంబర్ పేట ప్రధాన జంక్షన్ల దగ్గర భారీ విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల కిందటే ప్రతిపాదించారు.
పీపీపీ కింద ఏర్పాటుకు యత్నం మూడుచోట్ల విశ్రాంతి మందిరాల ఏర్పాటు పై ప్రభుత్వం నుంచి తుది అనుమతి తీసుకోడానికి ప్రయత్నిస్తున్నాం. మొదటిదశలో ఒకచోట ప్రైవేటు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం.
–బీఎల్ఎన్ రెడ్డి, సీఈ, హెచ్ఎండీఏ
Courtesy Eenadu…