అందాలలోయ కాశ్మీర్పై ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ కుట్ర ఇప్పటిది కాదు. దేశ స్వాతంత్రానికి ఎంత చరిత్ర ఉందో ఆ నేల పై కాషాయ కుతంత్రాలకు అంతే చరిత్ర ఉంది.
1.భారత్లో విలోనం కాకూడదన్న మహారాజు ప్రతిపాదన – బలపరిచిన ఆరెస్సెస్
మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో ఇండియా పాకిస్తాన్ గా విడదీశారు.అప్పుడే స్వదేశీ సంస్థానాలుగా ఉన్న హైదారాబాద్, కాశ్మీర్ విషయంలో ఇండియాలో కలవాలో లేక పాకిస్తాన్ లో కలవాలో లేక ఎటూకలవకుండా ప్రత్యేక దేశాలుగా ఉండాలో నిర్ణయించుకునే అధికారం ఆయా సంస్ధానాథిపతులకు ఇచ్చారు. ఇది భారత
ఉపఖండంలో బ్రిటిష్ వారి పన్నాగంలో భాగమే. వాస్తవానికి ఇండియాలోగానీ, పాకిస్తాన్ లో గానీ చేరకుండా స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకోమని బ్రిటిష్ వారు ప్రోత్సహించారు. తద్వారా ఆ రెండు సంస్థానాల లోని ప్రజలను భారతదేశం లోని ప్రధాన ప్రజాతంత్ర స్రవంతి నుండి వేరు చేసి ఆ తరువాత వాటిని తమ సామాజ్యవాద ప్రయోజనాలు కోసం ఉపయోగించు కోవాలని వారు కుట్రపన్నారు.
ఈ కుట్రకు ఆ నాటి కాశ్మీర్ మహారాజు హరిసింగ్ సహకరించాడు. కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే వాంఛను ఆయన మౌంట్ బాటన్ కు 1947 అక్టోబర్ లో రాసిన లేఖ లో వెలిబుచ్చారు. . భారత దేశంలో విలీనం కారాదన్న మహారాజు ప్రతిపాదనను జమ్ము ప్రతి పాదనను జమ్ము ప్రజాపరిషత్ బలపరించింది. ఇది జమ్ము – కాశ్మీర్ లోని ఆర్ ఎస్ ఎస్ కు చెందిన రాజకీయ విభాగం .
2. భారతలో విలీనం అవడంలో కీలక భూమిక కాశ్మీర్ ప్రజలది. బ్రిటిష్ వారి కుట్రలో భాగాస్వామిగా వ్యవహరించిన కాశ్మీర్ మహారాజు హరిసింగ్ , ఆయన కు దన్నుగా నిలిచిన ఆరెస్సెస్ విభాగం జమ్ము ప్రజా పరిషత్ కాశ్మీర్ను భారత దేశంలో కలపకూడదన్న వైఖరి తీసుకున్నాయి. ఐతే కాశ్మీర్ ప్రజలు వేరే వైఖరితో ఉన్నారు .ఒకప్పుడు కాశ్మీర్ మతసామరస్యానికి, శాంతికి మారుపేరుగా ఉండేేది. హిందూ, ముస్లిం, భౌద్ధమతాలు అక్కడ ప్రజలలో ప్రాచుర్యం పొందాయి. మతసామ రస్యానికి ప్రతీక అయిన సూఫీ పండితుల భోధనలు కాశ్మీరీయులపై బలమైన ప్రభావం కలిగివుండేది. అందువల్లనే దేశ విభజన సమయంలో ప్రక్కన ఉన్న పంజాబ్లో మత కల్లోలాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నా, కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంత, సమైక్య పరిస్థితులలో తమ కుట్ర పారదని గ్రహించిన బ్రిటిష్ పాలకులు వాయవ్యం వైపు నుండి, పశ్చిమ వైపు నుండి కొండ జాతుల వారిని అడ్డం పెట్టుకుని అనేక మంది సీనియర్ బ్రిటీష్ సైనిక అధికారులతో కాశ్మీర్పై దాడి చేయించారు. ముజఫర్ బాద్ (ఇది ప్రస్తుతం పాక్ ఆధీనంలో ఉంది) వద్ద దాడి చేసి శ్రీనగర్ వైపుగా ముందుకు సాగారు.అప్పటికే ప్రజల నుండి వేరుపడిపోయిన మహారాజు తన బంధువులతో, సలహాదారులతో కలిసి జమ్మూకు పారిపోయాడు. ఈ క్లిష్ట దశలో నేషనల్ కాన్ఫరెన్స్ ముందుకు వచ్చింది. ప్రతిఘటిం చమని కాశ్మీర్ ప్రజలకు పిలుపునిచ్చింది తమకు సహాయంగా నిలవమని భారత ప్రభుత్వాన్ని కోరింది. 1947 అక్టోబర్ 26వ తేదీన భారత సైన్యాలు కాశ్మీరును దురాక్రమణదారుల నుండి కాపాడేందుకు, కాశ్మీర్ భారత్లో విలీనం కావడానికి ఒప్పందం కుదిరింది.ఈ దశలో కూడా సైన్యాన్ని పంపవద్దని మౌంట్బాటిన్ భారత ప్రభుత్వంపై వత్తిడి తెచ్చాడు. కాని అదిపనిచేయ లేదు. కాశ్మీర్ ప్రజల పట్టుదలే గెలిచింది. కాశ్మీర్ రాజు- బ్రిటీష్ సామ్రాజ్యవాదం-ఆరెస్సెస్కుట్రలు వమ్మయినాయి.
కాశ్మీర్ ప్రజాప్రభుత్వపు అభ్యుదయ సంస్కరణలు – వ్యతిరేకించిన ఆరెస్సెస్
దురాక్రమణ దారులను ఓడించిన తర్వాత 1950 అక్టోబర్లో రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడేందుకు ఎన్నికలు జరపాలని నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయించింది. 1951లో ఎన్నికలు జరిగాయి. 45 స్థానాలను నేషనల్ కాన్ఫెరెన్స్ గెలిచింది. రాజ్యాంగసభ 1951 నవంబరు 5న సమావేశం అయింది. ఆ రాజ్యాంగ సభ చేసిన తీర్మానాలు అనుసరించి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం కాశ్మీర్లో అనేక ప్రజాతంత్ర సంస్కరణలను అమలు చేసింది.
1) కాశ్మీర్లో ఉండిన వంశపారంపర్య రాచరిక పాలనా విధానాన్ని రద్దుచేసి ప్రజలెన్ను కున్న వారితోనే ప్రభుత్వం ఏర్పడాలన్న రాజ్యాంగ నిర్ణయసభ నిర్ణయం శాసనంగా మారింది.
2.భూస్వామ్య విధానాన్ని రద్దు చేసి భూస్వా ముల భూములను ఎటువంటి పరిహారమూ చెల్లించకుండానే సాగుచేసుకుం టున్న కౌలుదార్లకు పంచిపెట్టింది.
3. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల రుణభారాన్ని తగ్గించేందుకు రుణాల కన్సీలియేషన్ బోర్డులు ఏర్పాటు చేసింది.
ఈ నిర్ణయాలను వమ్ముచేయాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఐరాస ద్వారా పలు ఒత్తిడులు తెచ్చారు. ఇంకోపక్క నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్, జమ్మూ ప్రజాపరిషత్, ఆందోళనలు ప్రారంభించాయి.
1. జమ్మును కాశ్మీర్ నుంచి విడదీయాలనే విచ్ఛిన్నకర డిమాండ్ను జమ్ము పరిషత్ ముందుకు తెచ్చింది.
2.రాజప్రముఖ్గా మహారాజు హరిసింగ్ ఉండాలని, అతనికి రాజభరణం చెల్లించాలని, వీటికి వీలు కల్పించేందుకు రాజ్యాంగంలోని 238 అధికరణాన్ని కాశ్మీర్కు వర్తింపచేయాలని డిమాండ్ చేసింది. అంటే ప్రజాస్వామిక పద్ధతిన ఎన్నికయ్యే ప్రభుత్వం బదులు తిరిగి దొడ్డిదారిన మహారాజు నిరంకుశపెత్తనాన్ని తేవాలని ఆర్ఎస్ఎస్ ప్రయత్నించింది.
3. భారత రాజ్యాంగంలోని 31వ అధికర ణాన్ని కాశ్మీర్కు వర్తింపజేయాలని ఆర్ఎస్ఎస్ వాదించింది. ఇది అమలైతే, భూస్వాముల నుండి స్వాధీనం చేసుకున్న భూములన్నింటికీ నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఆ విధంగా ఆర్ఎస్ఎస్ ప్రజలకు వ్యతిరేకంగా భూస్వాములకు అనుకూలంగా వ్యవహరించింది.
4. ఈరోజు జాతీయ జెండా ఔన్నత్యం గురించి ఆర్ఎస్ఎస్ తెగ హడావిడి చేయడం మనం చూస్తున్నాం. కానీ 2002 వరకూ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం నాగపూర్లో జాతీయజెండా ఎగరలేదు. కాషాయ ధ్వజమే ఎగిరింది. అంతేకాదు. కాశ్మీర్లో మహారాజు హరిసింగ్ పతాకమే ఎగరాలన్న వైఖరి తీసుకుంది. కాశ్మీర్ ప్రజలు రాచరికంపై పోరాడిన క్రమంలో తమ పోరాట పతాకాన్ని రూపొందించాలను కున్నారు. దాన్ని వ్యతిరేకించడానికి ఆర్ఎస్ఎస్కు హఠాత్తుగా జాతీయజెండా మీద ప్రేమ పుట్టు కొచ్చింది. ఆరోజు కాశ్మీర్ మహారాజుకు అన్నిరకాల ప్రత్యేకమైన హక్కులూ ఉండాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేసిన ఆర్ఎస్ఎస్ జనసంఘం, ఈ రోజు కాశ్మీర్ ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రత్యేక హక్కులూ ఉండరాదని వాదిస్తోంది.
Courtesy Prajasakti