– భారత్లో సాధారణ ఆరోగ్య సేవలపై కోవిడ్ ఎఫెక్ట్
– మార్చి, ఏప్రిల్ నెలలో అధికం
– ఫలితంగా దేశంలో దీర్ఘకాలిక దుష్పరిణామాలు
– వైద్య, ఆరోగ్య నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : మోడీ సర్కారుకు ముందుచూపు లోపించడంతో ప్రమాదకర కరోనా పరిస్థితులు భారతదేశ ఆరోగ్య రంగాన్ని దెబ్బతీసింది. మిగతా రోగాలకు సంబంధించిన ఆరోగ్యసేవలను ప్రజలకు దూరం చేసింది. దీంతో దేశంలో కేవలం కరోనా రోగులు తప్పా.. మిగతవారు ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా లాక్డౌన్ కఠినంగా సాగిన మార్చి, ఏప్రిల్ నెలలో ఈ ఇవి అధికంగా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులు దీర్ఘకాలిక దుష్పరిణామాలకు దారి తీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తాజాగా అందిన ఆరోగ్య సంబంధిత అధికారిక సమాచారం ప్రకారం.. కోవిడ్ ప్రభావంతో దేశంలో ఇతర సాధారణ ఆరోగ్య సేవలకు అంతరాయం కలిగాయి. వీటి ప్రభావం ఆరోగ్యం రంగంపై దీర్ఘకాలికంగా ఉండే అవకాశం కనిపిస్తున్నదని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సాధారణ ఆరోగ్య సేవల్లో అంతరాయం ఏర్పడటం అంతకముందు అంచనా వేసిన దానికంటే అధికం కావడం గమనార్హం. ముఖ్యంగా రోగనిరోధకత, తల్లులు, శిశువులకు అందే చికిత్స, మూత్రపిండాలు, కాన్సర్, గుండెజబ్బు వంటి రోగాలకు అందే చికిత్సలలో తగ్గుదల కనిపిస్తున్నది. మార్చి నెలలో కంటే ఏప్రిల్లో ఈ చికిత్సలలో తగ్గుదల అధికంగా కనిపించింది.
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లాఆస్పత్రుల వరకు దాదాపు రెండు లక్షల ఆరోగ్య సౌకర్యాల నుంచి ఆరోగ్య సేవలను ఉపయోగించుకొనే సూచికలను నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) కు చెందిన హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(హెచ్ఎంఐఎస్) ట్రాక్ చేస్తూ ఎప్పటికప్పుడూ సమాచారాన్ని నవీకరిస్తుంది. ఈ ఆరోగ్య సౌకర్యాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో, ప్రభుత్వ రంగంలో ఉన్నాయి.
ఈ ఏడాది మార్చిలో మోడీ సర్కారు దేశంలో ‘అనాలోచిత’ లాక్డౌన్ను ప్రకటించి అమలుచేసిన విషయం తెలిసిందే. అయితే గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈ ఏడాది మార్చి నెలలో ఆరోగ్య సేవలు తీవ్రంగా తగ్గాయి. అనంతరం ఎన్హెచ్ఎం ఈ డేటాను ప్రచురించడం మానేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు చెందిన నవీకరించిన సమాచారాన్ని ఎన్హెచ్ఎం ఈ వారం విడుదల చేసింది. దేశంలో లాక్డౌన్ చాలా కఠినంగా ఉన్న మార్చి, ఏప్రిల్ మాసాల్లో తక్కువ మంది మహిళలు ప్రసూతి ఆరోగ్య సంరక్షణను పొందారు. వీటికి తోడు గర్భిణీలపై సాధారణ తనిఖీలు, తల్లి, పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన చాలా ముఖ్యమైన పరీక్షలు తప్పిపోయాయి. సంస్థాగత ప్రసవాల సంఖ్య కూడా పడిపోయింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఏప్రిల్లో 5.80 లక్షల కంటే తక్కువ సంస్థాగత డెలివరీలు జరిగాయి. ఇది చాలా మంది మహిళలు ఇంట్లో అసురక్షిత ప్రసవాలను కలిగి ఉన్నదని సూచిస్తుంది. అలాగే, జనని స్వస్థ్య సురక్ష యోజన(మదర్స్ హెల్త్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం) కింద తమకు లభించే ప్రయోజనాలను పొందిన మహిళల సంఖ్య కూడా జనవరి స్థాయిలో సగానికి తగ్గింది.
రోగనిరోధకత సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని ఈ సంఖ్యలు సూచిస్తున్నాయి. దీనిపై దృష్టిసారించకపోతే దేశంలో పిల్లలపై జీవితకాల ప్రభావాలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరించారు. తీవ్రమైన క్షయవ్యాధిని నివారించే బాసిల్ కాల్మెట్-గురిన్ వ్యాక్సిన్ను పొందిన పిల్లల సంఖ్య జనవరితో పోల్చుకుంటే సగం కంటే తక్కువగా ఉన్నది. ఏప్రిల్లో ఔట్ పేషెంట్ల హజరు జనవరి స్థాయిలో సగానికి(6.9 కోకోట్ల మంది) పడిపోయింది. ఔట్ పేషేంట్ ట్రీట్మెంట్లలో క్యాన్సర్, గుండెజబ్బులు సహా తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి. అయితే ఈ తగ్గుదల రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నదని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్లో తీవ్రమైన సంక్రమణ వ్యాధుల ఇన్పేషెంట్ చికిత్స జనవరిస్థాయిలతో పోలిస్తే 60శాతం తగ్గింది. అయితే పురుషుల కంటే మహిళల సంఖ్యలో క్షీణత ఎక్కువగా ఉండటం గమనార్హం. జూన్ నెలలో టీబీ చికిత్స కోసం నమోదు చేసుకున్న రోగుల సంఖ్య 45శాతం క్షీణించింది. అలాగే హెచ్ఐవీ పరీక్షల్లో పురుషుల సంఖ్య 60శాతం తగ్గిపోవడం గమనార్హం. ప్రస్తుతం దేశం అన్లాక్లో ఉన్నప్పటికీ.. జనవరితో పోలిస్తే జూన్లో పెద్ద, చిన్న శస్త్ర చికిత్సల సంఖ్య పడిపోయింది. ప్రస్తుతం టీబీతో బాధపడుతున్న ప్రతి రోగికి అది భవిష్యత్తులో ప్రాణాంతకం కావచ్చునని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది క్షయవ్యాధి నిర్మూలనుకు ఆటంకంగా ఏర్పడే ప్రమాదమున్నదని సూచించారు. సంస్థాగత ప్రసవాలు తగ్గిపోతే.. అది తల్లి, నవజాత శిశువు మరణాలను పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Courtesy Navatelangana