– రాజధానిలో కిలో రూ.80
– కృత్రిమ కొరత సృష్టిస్తున్న దళారులు స్టాక్ గురించి బెంగవద్దు : కేంద్రం
న్యూఢిల్లీ : ఉల్లి ధరలు ఒక్కసారిగా ఘాటెక్కాయి.. ప్రభుత్వాలనే కూల్చేసిన చరిత్రగల ఉల్లి ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో ఒక్కింటికి రూ.60 నుంచి 80కి చేరింది. అంటే దాదాపు వారంలో ధర మూడు రెట్లు పెరిగింది. ప్రధాన ఉల్లి ఉత్పత్తి రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకలో కరువు కారణంగా గతేడాది పంట దెబ్బతింటే… ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చే పంట అందకుండా పోయింది. అందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇందులో వాస్తవం లేదని రైతువర్గాలు అంటున్నాయి. ఏడాదిలో మూడుసార్లు ఉల్లి సాగు చేయటంతో ఏడాది పొడవునా సరఫరా కొనసాగుతుంటుంది. పంట విషయాన్ని కట్చేస్తే… ఢిల్లీలోని ప్రధాన మార్కెట్ ఆజాద్పూర్ మండీలో టోకు ధర రూ. కిలోకు రూ.27.74. కాగా, పెద్ద వ్యాపారులు, పంపిణీదారులు దీనిని రిటైల్ వ్యాపారులకు కిలోకు రూ.42 చొప్పున విక్రయిస్తున్నారు. స్థానిక దుకాణదారులు కిలో రూ.60 నుంచి రూ.80కి విక్రయిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే… ఉల్లి ధర మొదటి దశలో 51శాతం, రెండో దశలో 50 శాతంపైనే ఘాటెక్కిస్తున్నారు. ఢిల్లీ అయినా.. మరెక్కడైనా జరుగుతున్నది ఇదే. లాభం మొత్తం మధ్యవర్తులు, దళారుల చేబుల్లోకి చేరుతున్నది.
ఉల్లి ఉత్పత్తి ఎంత?
2018-19 సంవత్సరానికి గాను వ్యవసాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన హార్టికల్చర్ పంటల మూడవ ముందస్తు అంచనా ప్రకారం.. 2019 జూన్తో ముగిసిన వ్యవసాయ సంవత్సరంలో ఉల్లి ఉత్పత్తి 23.28 మిలియన్ టన్నులు. ఆచరణాత్మకంగా చూస్తే ఇది గత ఏడాదిలానే ఉన్నది. అంటే.. ఉల్లి సరఫరా బాగా పడిపోయిందనీ, డిమాండ్ పెరగటంతో అది ధరల పెరుగుదలకు దారితీసిందనటంలో వాస్తవంలేదు. మరోవైపు నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (ఎన్హెచ్బీ) నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం… హౌల్సేల్ మార్కెట్లకు ఉల్లిపాయల రాక గణనీయంగా పడిపోయింది. 2018-2019లో జనవరి – సెప్టెంబర్ మధ్య నెలవారీ సరఫరాను పోల్చి చూస్తే… గత సెప్టెంబరులో 3.98 లక్షల టన్నుల ఉల్లిపాయ హౌల్సేల్ మార్కెట్కు రాగా, ఈ సంవత్సరం సెప్టెంబర్ 23 వరకు 1.63 లక్షల టన్నులు వచ్చింది. అంటే సంగం కంటే తక్కువ. గతేడాదితో పోలిస్తే ఉత్పత్తిలో తగ్గుదలలేనప్పటికీ.. ప్రస్తుత ఏడాది హౌల్సేల్ మార్కెట్కు ఉల్లిరాక స్థిరంగా తగ్గింది. ధరలను పెంచేందుకే రెండు ప్రధాన ఉత్పత్తి ప్రాంతాల నుంచి ఉల్లి సరఫరాపై కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దీనిపై ముంబై, బెంగళూరు నుంచి పలు ఫిర్యాదులు కూడా వచ్చాయి. వీటితోపాటు.. వరదల కారణంగా కూడా కొంత అంతరాయం ఏర్పడింది. కానీ, ఇది ఉల్లి సరఫరాను సగానికి తగ్గించేది ఎంత మాత్రం కాదని వ్యవసాయ నిపుణులు స్పష్టంచేశారు.
ధరల పొందిక…
గతేడాదిలోనూ మే వరకూ ఉల్లి ధరలు పడిపో యాయి, ఆ తరువాత జులై వరకూ పెరగ్గా.. ఆ తర్వాత సెప్టెంబర్ వరకు కొద్దిగా తగ్గాయి. కానీ ఈ ఏడాది మొత్తం స్థిరంగా పెరిగింది. అలాగే వినియోగ దారులు చెల్లించేది చాలా ఎక్కువ.. రైతులు పొందుతున్న ధర చాలా తక్కువ. కొరత కాలంలో బడా వ్యాపారుల లాభాలు అసాధారణ స్థాయిలో పెరుగుతు న్నాయి. రైతులకు వారు చెల్లించే ధరను మాత్రం కొద్దిగా పెంచారు. ఈ ఏడాది రిటైల్, హౌల్సేల్ ధరల మధ్య వ్యత్యాసం విపరీతంగా పెరిగింది. జనవరి 2019లో క్వింటాల్కు సుమారు రూ.727 (లేదా కిలోకు రూ .7.27) కాగా, ప్రస్తుతం క్వింటాల్కు రూ.1,372 (రూ. కిలోకు 13.72). ఎన్హెచ్బీ ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్లో వ్యాపా రుల మార్జిన్ రెట్టింపయ్యింది. గత సెప్టెంబరులో మార్జిన్ క్వింటాల్కు రూ.808కాగా, ఇది దాదాపు 70% పెరిగి ప్రస్తుత క్వింటాల్ స్థాయికి రూ.1,372 కు చేరుకున్నది. కృత్రిమ కొరత సృష్టించి చేస్తున్న ఉల్లి దోపిడీపై ప్రభుత్వం చేస్తున్నదేమిటి? పూణే, ముంబయి, నాసిక్, బెంగళూరు ల్లోని ప్రధాన గిడ్డంగులపై దాడులు జరపాలి. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేయ టం ద్వారా ధరలను నియంత్రించే చర్యలకు ప్రభుత్వం పూనుకోవాలి. అలాగే, ఉల్లిపాయలను సేకరించి తదుపరి పంట వచ్చేవరకూ సరసమైన ధరలకు విక్రయించాలి. ఉత్పత్తికి పెద్ద కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వల్ల ప్రభుత్వం వ్యాపారులపై ఎలాంటి చర్యలూ తీసుకోవటంలేదన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దళారులపై చర్యతీసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. మరోవైపు కావాల్సినంత స్టాక్ ఉన్నదని నాఫెడ్ నుంచి ఉల్లిని విక్రయిస్తామని కేంద్రమంత్రి నరేంద్రతోమర్ అంటున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో మొబైల్ కౌంటర్లో కిలో 22 రూపాయలకు ఉల్లి విక్రయిస్తుండగా జనం బారులు తీరారు. మరి ఉల్లిధర ఎప్పుడు తగ్గుతుందోనని గృహిణులు ఆందోళనచెందుతున్నారు.
Courtesy Nava telangana…