కోల్కతా: దేశంలో రోజురోజుకూ మూకదాడులు తీవ్రమవుతున్నాయి. మతిస్థిమితం లేదనే కనికరం లేకుండా విచక్షణారహితంగా దాడి చేసి, హత్యచేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని బుర్ద్వాన్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఉదరు(48) మతిస్థిమితంలేని వ్యక్తి. దొంగతనం చేశాడనే అనుమానంతో ఆయనను కొందరు దుండగులు పట్టుకుని కరెంట్ స్థంబానికి కట్టేసి, విచక్షణారహితంగా కొట్టారు. వారి దెబ్బలు తాళలేక బాధితుడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ దారుణాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దాడిని అడ్డుకున్నారు. అనంతరం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే తరహాలో దుర్గాపూర్లో మరో మూకదాడి జరిగింది. దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని పట్టుకుని స్థానిక దుండగులు దాడికి పాల్పడ్డారు. దుండగుల దెబ్బలు తాళలేక బాధితుడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆరుగురిని అరెస్టు చేశారు. గత మూడు నెలల్లో రాష్ట్రంలో పదికిపైగా మూకదాడి ఘటనలు జరిగాయనీ, ఈ దాడులను నివారించడానికి ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ప్రతిపక్షాలు వారు డిమాండ్ చేస్తున్నాయి.
Courtesy Navatelangana..