– 2022 నాటికి న్యూట్రిషన్ లక్ష్యాలను భారత్ చేరుకోలేదు
– బీజేపీ పాలిత రాష్ట్రాలు దారుణం
– తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : భారత్లోని చిన్నారులు, మహిళల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో భాగంగా ‘నేషనల్ న్యూట్రిషన్ మిషన్'(ఎన్ఎన్ఎం)ను 2022 నాటికి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ప్రస్తుత ట్రెండ్ను బట్టి చూస్తే కేంద్రం ఆ లక్ష్యాన్ని సాధించేలా కనబడటం లేదు. ఈ విషయాన్ని ‘ది లాన్సెట్ చైల్డ్ అండ్ అడోల్సెంట్ హెల్త్’ లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో పోషకాహారలోపం సమస్య ఎంతో కొంత తగ్గినప్పటికీ.. నిర్దేశించిన లక్ష్యాన్ని మాత్రం అది చేరుకోలేదని అధ్యయంన స్పష్టం చేసింది. కాగా, పోషకాహార లక్ష్యాలను సాధించే విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రదర్శన అధ్వాన్నంగా ఉండటం గమనార్హం.
ఎన్ఎన్ఎం నిర్దేశిత లక్ష్యం ప్రకారం 2022 నాటికి.. శిశువులు తక్కువ బరువుతో జన్మించడం, చిన్నారుల్లో తక్కువ బరువు సమస్యను ఏడాదికి రెండుశాతం, చిన్నారుల్లో పెరుగుదల లోపాన్ని 25శాతం, మహిళల్లో, ఐదేండ్లలోపు చిన్నారుల్లో రక్తహీనతను ఏడాదికి మూడుశాతం తగ్గించాలి. ప్రపంచ ఆరోగ్యసంస ్థ(డబ్ల్యూహెచ్ఓ), యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) మాత్రం ప్రపంచవ్యాప్తంగా 2030 వరకు లక్ష్యాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం.. 2012 నుంచి 2030 మధ్య.. శిశువులు తక్కువ బరువుతో జన్మించడంలో 30శాతం తగ్గుదల, ఐదేండ్లలోపు చిన్నారుల్లో పెరుగుదల లోపాన్ని 50శాతం తగ్గించడం, అలాగే 15 నుంచి 49 ఏండ్ల మధ్య ఉన్న యువతులు, మహిళల్లో రక్తహీనతను తగ్గించడం, శిశులకు మొదటి ఆరునెలలు తల్లి పాలు అందేలా 70శాతం లక్ష్యా న్ని సాధించడంతో పాటు చిన్నారు ల్లో అధిక బరువు సమస్యను మూడు శాతానికి తగ్గించేలా నిర్దేశించారు.
1990-2017 వరకు ఉన్న ట్రెండ్ను ఆధారంగా చేసుకొని ఎన్ఎన్ఎం 2022, యూనిసెఫ్-2030 మధ్య ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం పోల్చింది. సోషియో డిమోగ్రాఫిక్ ఇండెక్స్(ఎస్డీఐ) ఆధారంగా తక్కువ, మధ్యస్త, అధిక ఎస్డీఐ రాష్ట్రాలుగా వర్గీకరించింది. తక్కువ ఎస్డీఐ రాష్ట్రాల జాబితాలో బీజేపీ, ఎన్డీయే పాలిత బీహార్, జార్ఖండ్, యూపీ, అసోం లతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, ఒడిషా వంటి రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు మధ్యస్త ఎస్డీఐ రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. అధిక ఎస్డీఐ రాష్ట్రాల జాబితాలో కేరళ ఉన్నది.
2017లో ఐదేండ్లలోపు చిన్నారుల మరణాలకు పోషకాహార లోపమే ప్రధాన కారణమని అధ్యయనం కను గొన్నది. దీనితో దాదాపు 68.2శాతం మంది చిన్నారులు మరణించారు. 2017లో తక్కువ బరువుతో జన్మించిన శిశువులు 21.4శాతం, చిన్నారుల్లో పెరుగుదల సమస్య 39.3 శాతం, తక్కువ బరువును కలిగి ఉన్న చిన్నారులు 32.7 శాతంగా ఉన్నారు. ఇక ఐదేండ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత 59.7శాతం, మహిళల్లో(15 నుంచి 49 ఏండ్ల మధ్య వయసు) ఈ సమస్య 54.4శాతంగా నమోదైంది. 53.3 శాతం మంది శిశువులకు తల్లిపాలు అందగా, స్థూలకాయం తో బాధపడుతున్న చిన్నారులు 11.5శాతంగా ఉన్నారు.
అయితే 2017 వరకు ఉన్న ట్రెండ్ను బట్టి భారత్లో ఎన్ఎన్ఎం 2022 లక్ష్యాన్ని అధ్యయనం అంచనావేసింది. దీని ప్రకారం.. తక్కువ బరువుతో జన్మించే చిన్నారులు 8.9శాతం, పెరుగుదల లోపం 9.6శాతం, తక్కువ బరువు 4.8శాతం, చిన్నారుల్లో రక్తహీనత 11.7శాతం, మహిళల్లో రక్తహీనత 13.8శాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నది. చిన్నారులకు, మహిళల పోషకాహారం కోసం ఉద్దేశించిన పథకాలను అమలు చేయడంలో మోడీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నదని మహిళాసంఘాలు, సామాజిక కార్య కర్తలు ఆరోపిస్తున్నారు. ఈ శాఖకు కేంద్రం బడ్జెట్లో తక్కువ నిధులను కేటాయిస్తున్నదనీ, అలాంటప్పుడు నిర్దేశిత లక్ష్యా లు ఎలా సాధిస్తామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Courtesy Nava telangana…