- పడవ లోపలే ఉండిపోయారా?
- లేక దిగువకు కొట్టుకుపోయారా?
- గల్లంతైనవారి కోసం గాలింపు
- మృతులు 8 మంది వివరాల గుర్తింపు
- అండగా ఉంటాం: ఏపీ సీఎం జగన్
- బోటు యజమానిపై కేసు నమోదు
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 16 తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో పడవ మునిగి రెండో రోజు కూడా గడిచిపోయింది. సోమవారం కచ్చులూరు నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ 80 మంది ఎన్డీఆర్ ఎఫ్ సభ్యులు, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు, నౌకాదళ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఉపయోగం లేకపోయింది. దేవీపట్నం సమీపంలో నెలల వయసున్న పసిబిడ్డ మృతదేహం దొరికింది కానీ.. ఆ మృతదేహం పడవ ప్రమాదానికి సంబంధించింది కాదేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదసమయంలో పడవలో ఉన్న 73 మందిలో 27 మంది సురక్షితంగా బయటపడగా, గల్లంతైన వారిలో ఎనిమిది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. వారి వివరాలను కూడా అధికారులు గుర్తించారు. ఆచూకీ లభ్యం కాని 38 మంది బోటు లోపలే ఉండిపోయారా? గోదావరి దిగువ భాగానికి కొట్టుకుపోయారా అనేది స్పష్టం కాలేదు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల నుంచి ఒక మృతదేహం కిందికి కొట్టుకుని పోయినట్టు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కానీ ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. మృతదేహం సముద్రంలోకి వెళ్లి పోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సముద్రం వరకూ అన్ని గోదావరి పాయల వద్ద గాలింపు చేపట్టవలసి ఉంది. కాగా.. ప్రమాదం జరిగి రెండో రోజు గడిచిపోయినా గల్లంతైన వారి ఆచూకీ తెలియకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. ప్రమాదానికి గురైన పడవ యజమాని వెంకటరమణపై 304(ఏ) సెక్షన్ కింద కేసు నమోదైంది. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. టికెట్లు విక్రయించిన ఏడు ట్రావెల్ ఏజెన్సీలు, పడవ డ్రైవర్లపైనా కేసు నమోదైంది.
ఆదుకుంటాం: సీఎం జగన్: ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలని ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షలు, ప్రమాదం నుంచి బయటపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
మృతులు వీరే..: ప్రమాదంలో మరణించిన ఎనిమిది మంది పేర్లు, వివరాలను అధికారులు నిర్ధారించారు. విశాఖకు చెందిన తలారి అప్పలనరసమ్మ(45), బొండా లక్ష్మి(35), గుంటూరు జిల్లాకు చెందిన మండపాక కృష్ణకిశోర్ (30), హైదరాబాద్ ఉప్పల్ స్వరూ్పనగర్కు చెందిన అంకం శివజ్యోతి(48), తిరుపతి మంగళం రోడ్డుకు చెందిన దుర్గం హాసిని(12), వరంగల్కు చెందిన బస్కేఅవినాశ్(22), బస్కే రాజేందర్(55), మంచిర్యాలకు చెందిన లక్ష్మణ్(26) మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
వీరంతా మృత్యుంజయులు: వరంగల్ కడిపికొండకు చెందిన అనాపల్లి యాదగిరి, బస్కే దశరథ్, బస్కే వెంకటస్వామి, గోనె ప్రభాకర్, దర్శనాల సురేష్, హయాత్నగర్కు చెందిన కోదండ అర్జున్, పాడి జరినికుమార్, హుజూర్నగర్కు చెందిన శివకుమార్, చంపాపేట్కు చెందిన సోలిటి రాజేశ్, అంబర్పేట వాసి మేడి కిరణ్కుమార్, జగద్గిరిగుట్టకు చెందిన నరాలపురం సురేశ్.
315 అడుగుల లోతులో పడవ: ప్రమాదానికి గురైన పడవ గోదావరిలో 315 అడుగుల లోతులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పడవ జాడ వెతకడానికి ఉత్తరాఖండ్ నుంచి సైడ్స్కాన్ సోనార్ను తీసుకొచ్చారు. అది నీటిలో ఎంత లోతున ఉన్న వస్తువునైనా పసిగడుతుంది. పడవ ఉనికి కోసం నౌకాదళ బృందం ఈ స్కానర్తో లోపలికి వెళ్లి దాన్ని గుర్తించారు. దాన్ని బయటకు తీయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ నుంచి ఒక బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చాయి.
Courtesy Andhrajyothi…