– ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ తరలింపు
– ఇంకా కొనసాగుతున్న 12 గంటల పనివిధానం
– సంక్షేమ పథకాలు వర్తించవు…
– చట్టాలు అమలు కావు
– ప్రమాదం జరిగితే యజమాని దయాదాక్షిణ్యాలపై ఆధారం
హైదరాబాద్లోని కాటేదాన్ పారిశ్రామిక వాడ బిస్కట్, ఆయిల్, ప్లాస్టిక్ పరిశ్రమలకు పెట్టింది పేరు. ఇక్కడ వెలిసిన 100కు పైగా పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులే సగానికిపైగా ఉన్నారు. కాటేదాన్లో కార్మిక చట్టాలు అసలే అమలు కావు. అయితే వలస కార్మికుల నుంచి మొదలుకొని అందరూ విధిగా 12 గంటలు పనిచేయాల్సిందే. కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు వర్తించవు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు యజమానులు దయతలిచి ఎంతిస్తే అంత తీసుకోవాల్సిందే. ఎదురు తిరిగినా, ప్రతిఘటించినా ఉద్యోగం ఉండదు. అందుకే పాధికోసం వలస వచ్చిన కార్మికులు అరకొర జీతాలతో నిర్భందంగా పనిచేస్తూ దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు.
కాటేదాన్ పరిశ్రమల్లో దాదాపు పదివేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, మరో 2 వేల మందికి పైగా పరోక్షంగా పనిచేస్తున్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న బిస్కట్, ఆయిల్, ప్లాస్టిక్ మొత్తం వాటాలో సగానికిపైగా కాటేదాన్ కార్ఖానాలదే… ఒరిస్సా, ఉత్తర్ప్రదేశ్, బీహార్, జార్ఖ్ండ్, చత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారున్నారు. వీరంతా ప్రొడక్షన్, కెమిస్ట్ర్, సూపర్వైజర్ విభాగాలలో పని చేస్తుండగా, హమాలి, డ్రైవర్, ప్యాకింగ్ విభాగాల్లో స్థానికులు పని చేస్తున్నారు. కార్మికశాఖ నిబంధన ప్రకారం 8 గంటలు పని చేయాల్సి ఉండగా ఇక్కడ 12 గంటల పనివిధానం కొనసాగుతున్నది. ఇక్కడ కార్మిక చట్టాలు పనిచేయవు. యజమాన్యం చెప్పిందే వేదం. స్థానిక కార్మికులు ఉంటే పనిగంటలు, జీత బత్యాలు, సంక్షేమ పథకాల గొడవలుంటాయని పరిశ్రమల యజమానులు అవసరమున్న కార్మికుల్లో సగానికి పైగా మందిని ఇతర రాష్ట్రాలనుంచి తీసుకొస్తారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థే నడుస్తున్నా అటు పోలీసులు గానీ, కార్మికశాఖ అధికారులుగానీ పట్టించుకోరు. మునీం, టేకేదార్ (దళారులు) తదితర పేర్లతో పిలువబడే వీరు ఆయా రాష్ట్రాల నుంచి కార్మికులకు అడ్వాన్స్ ఇచ్చి తీసుకొస్తారు. ఏడాదినుంచి రెండేండ్ల వరకు ఒప్పందంతో ఒక వ్యక్తికయితే రూ. 5వేలు, ఇద్దరికయితే రూ. 10వేల చొప్పున అడ్వాన్స్లు చెల్లించి మునీంలు తీసుకొస్తారు. పరిశ్రమల ఆవరణలో లేదా దగ్గర్లో పిట్టగూడులాంటి చిన్న ఇండ్లను నిర్మించి ఇస్తారు. 12 గంటలకు రూ. 220 నుంచి రూ. 260 వరకు జీతం చెల్లిస్తారు ఇంటి కిరాయి నిమిత్తం అంటూ ప్రతి వారం చెల్లించే మ్తొంత్తలోంచి రూ. 20 నుంచి రూ. 50 తీసకుంటారు. స్థానిక కార్మికుల్లో కొంత మందిని మినహ వలస కార్మికులను కార్మికశాఖ రిజిస్టర్ చేయదు. వారికి కార్మికశాఖ సంక్షేమబోర్డు ద్వారా అందాల్సిన పథకాలేవి వర్తించవు. ఏదైనా ప్రమాదం జరిగి అంగవైకల్యం లేదా మృతి చెందినా కార్మికశాఖనుంచి ఎలాంటి నష్ట పరిహారం రాదు. పరిశ్రమల యజమానులు దయతలిచి ఎంతిస్తే అంత తీసుకొని పోవాల్సిందే. ఎదురు తిరిగితే ఉద్యోగం ఉండదు. ప్రశ్నిస్తే పుట్టగతులుండవు. యజమానులు కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. వందల కిలోమీటర్ల దూరంనుంచి పొట్టచేత పట్టుకొని ఉపాధికోసం వలస వచ్చిన కార్మికులు అరకొర జీత భత్యాలతో నిర్బంధంగా పనిచేస్తూ దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. పనిగంటల గురించిగానీ, కనీస సౌకర్యాల గురించిగానీ అదికారులెవరు ఇటు తొంగి చూడరు. ఏండ్లుగా ఈ విధానం నిర్బంధంగా అమలు జరుగుతున్నా ఏవరు పట్టించుకోకపోవడంతో యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పేరు కూడా చెప్పడానికి భయపడే స్థితిలో ఉన్నారంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాపక్షపాతమంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న కార్మికుల వెట్టి కనిపించక పోవడం శోచనీయం
కార్మిక చట్టాలను అమలు చేయాలి
కాటేదాన్ పారిశ్రామిక వాడలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు.12 గంటల పనివిధానం, అరకొర జీతాలు, నిర్బంధగా పనిచేయించడం ఇక్కడ సర్వసాధారణం. ఏండ్లుగా జరుగుతున్న అన్యాయంపై అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న వేతనాలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే కాటేదాన్ కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలి. అక్రమంగా కార్మికులను తీసుకొస్తున్న వారిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
–కుర్మయ్య, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు
Courtesy Navatelangana..