– రిజర్వేషన్ నిబంధనల్లేకుండానే
– ఐఐఎం-ఎల పిహెచ్డి అడ్మిషన్ల ప్రక్రియ
న్యూఢిల్లీ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- అహ్మదాబాద్(ఐఐఎం-ఏ) మరోసారి పీహెచ్డీ అడ్మిషన్లలో రిజర్వేషన్ కోటా అమలు చేసేందుకు నిరాకరించింది. 2020 విద్యా సంవత్సరంలో పీహెచ్డీ కోర్సు ప్రవేశ ప్రక్రియలో వేల సంవత్సరాలుగా అణచివేతకు గురైన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చే నిబంధనలను పేర్కొనలేదు. వచ్చే ఏడాది డాక్టోరల్ ప్రొగ్రామ్ కోసం గతవారం ఐఐఎం-ఏ ప్రారంభించిన అడ్మిషన్ పోర్టల్లో ఎస్సీ, ఎస్టీ కోటాకు సంబంధించిన నిబంధనలను ప్రస్తావించలేదు. కాగా, ప్రతి కోర్సు, బ్రాంచీలో కచ్చితంగా రిజర్వేషన్ సీట్లు కేటాయించాలన్న చట్టాన్ని ఐఐఎం-ఏ యాజమాన్యం బేఖాతరు చేస్తూ వస్తున్నదని కొంతమంది ఐఐఎం సిబ్బంది, పూర్వవిద్యార్థులు మండిపడ్డారు. సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్(రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్) చట్టం 2006ను తప్పనిసరిగా అమలు చేయాలని ఐఐఎం-బెంగళూరు అల్యూమ్నీ సిద్ధార్థ్ జోషి తెలిపారు. ఈ మేరకు ఐఐఎం-ఏ డైరెక్టర్ డి సౌజాకు ఓ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఐఎంలలోని మొత్తం 500 మంది సిబ్బందిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు కేవలం నాలుగు లేదా ఐదుగురే ఉన్నారని సిద్ధార్థ్, ఐఐఎం-బెంగళూరు ప్రొఫెసర్ దీపక్ మాల్ఘన్ ఓ పరిశోధనా వ్యాసంలో పేర్కొన్నారు. మూడింట ఒకవంతు ఐఐఎం సిబ్బంది ఆ విద్యాసంస్థల్లో డాక్టోరల్ కోర్సు చేసినవారేననీ, అసలు పీహెచ్డీ కోర్సులో రిజర్వేషన్ లేకుంటే.. అది ఐఐఎం సిబ్బందిలో రిజర్వేషన్ క్యాటగిరీ సిబ్బంది సంఖ్యపైనా ప్రభావం చూపుతుందని వివరించారు.
Courtesy prajashakthi..