సింగరేణి కార్మికులకు యాజమాన్యం షాక్.. చరిత్రలో ఫస్ట్ టైమ్!
- కార్మికులకు సింగరేణి యాజమాన్యం షాక్..
- చరిత్రలో బోనస్ తప్పడం ఇదే తొలిసారి
- విద్యుత్తు సంస్థల బకాయిలే కారణం!
- వచ్చే నెలలో అందజేసే అవకాశం!!
గోదావరిఖని: ‘‘పైసల్లేవు.. ఇప్పట్లో బోనస్ ఇవ్వలేం.. వచ్చేనెల అక్టోబరు జీతాలు ఇచ్చాక చూద్దాం.. ఇప్పుడైతే ఏమీ చేయలేం..’’ అంటూ బొగ్గు గని కార్మికులకు సింగరేణి కాలరీస్ యాజమాన్యం షాకిచ్చింది. బొగ్గు సంస్థల్లో ఏటా ప్రాఫిట్ లింక్డ్ రివార్డ్ (పీఎల్ఆర్) బోనస్ ఇవ్వడం ఆనవాయితీ. దేశంలోని ఇతర బొగ్గు సంస్థల్లో ఈ బోన్సను దసరాకు ముందు ఇస్తుండగా.. సింగరేణిలో మూడు దశాబ్దాలుగా దీపావళికి వారం ముందు అందజేస్తున్నారు. గత సంవత్సరం ప్రతి కార్మికుడికి రూ.60,500 చొప్పున బోనస్ చెల్లించారు. ఈ సారి జాతీయ సంఘాల చొరవతో దాన్ని రూ.64,700కి పెంచారు. పీఎల్ఆర్ బోనస్ కింద 48 వేల మందికి రూ.280 కోట్లు చెల్లించాల్సిఉంది. ఐదు రోజుల్లో దీపావళి పండుగ ఉన్నా.. బోనస్ పై సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు యాజమాన్యాన్ని సంప్రదించారు.
అధికారులు మాత్రం.. ఇప్పట్లో బోనస్ సాధ్యం కాదని తెగేసి చెప్పారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడూ బోన్సను ఆపలేదని, నిర్ణీత సమయంలోగా రెండు విడతల్లో అందజేసిన దాఖలాలున్నాయని పేర్కొన్నారు. నిరుడు రూ.1,766 కోట్ల లాభాలను ప్రకటించి.. రూ. 494 కోట్లను కార్మికులకు పంపిణీ చేసిన సంస్థ బోనస్ చెల్లించలేని స్థితిలో ఉండటం దారుణమంటున్నారు. కాగా.. విద్యుత్తు సంస్థలు సింగరేణికి రూ.7 వేల కోట్ల మేరకు బకాయి పడ్డాయి. దీని వల్ల సింగరేణి యాజమాన్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
దసరాకు ఆర్టీసీ.. దీపావళికి సింగరేణి?
సింగరేణి కార్మికులు దీపావళి జరుపుకోవాలంటే పీఎల్ఆర్ బోనస్ ముఖ్యం. ఈ సారి బోనస్ లేకపోవడంతో పండుగ జరుపుకొనే పరిస్థితుల్లేవని అంటున్నారు. సరిగ్గా దసరాకు ఆర్టీసీ కార్మికులకూ జీతాలు రాక పండుగ జరుపుకోలేదు. రెండు సంస్థల్లోనూ కార్మికుల సంఖ్య 48 వేలుగా ఉండటం కాకతాళీయం.
Courtesy Andhra Jyothy