– కె. నాగలక్ష్మి
తెలంగాణలోని నారాయణపేటజిల్లా ఉత్కూరు మండలంలో గతనెల 25న 16ఏండ్ల మైనర్ బాలిక తనపై జరిగిన దుర్మార్గాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పదవతరగతి చదువుతున్న ఆ బాలిక తమ ఇంటిలో మరుగుదొడ్డి సౌకర్యం లేక బహిర్భూమికి వెళ్ళగా 25ఏండ్ల కామాంధుడు ఆమెను వెంబడించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక ఆ అవమానం తట్టుకోలేక ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది. దేశం స్వాతంత్య్రం సాధించి 73ఏండ్లు పూర్తిచేసుకొని 74వ వసంతంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా బహిర్భూమి అత్యాచారాలకు బాలికలు, మహిళలు బలవుతున్నారంటే, మన ఆడపిల్లల ఆత్మగౌరవం ఇంతటి ప్రమాదంలో ఉందంటే.. ప్రభుత్వాలు ఇచ్చే స్వచ్ఛభారత్, బేటీ బచావో నినాదాల అమలు ఏ విధంగా ఉందో తెలుస్తోంది. పదవ తరగతి చదువుతున్న ఆ బాలిక చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎన్నో కలలు కన్నది. పొరుగూరిలో హాస్టల్లో ఉంటూ పట్టుదలగా చదువుకుంటోంది. కరోనా నేపథ్యంలో సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. బాలికకు ఒక తమ్ముడు ఒక అన్న ఉన్నారు. తల్లిదండ్రులు పొలం పనులు చేస్తుంటారు. చదువు తప్ప వేరే ధ్యాస లేని ఆ బాలికపై అదే గ్రామానికి చెందిన బాలరాజు కన్నుపడింది. బాలిక ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని కాపుకాసిన ఆ దుర్మార్గుడు బాలిక బహిర్భూమికి వెళ్లడం గమనించి ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చిన ఆ బాలిక తనపై జరిగిన అవమానానికి కృంగిపోయింది. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో… ఇంట్లో ఉన్న పురుగులమందు తాగింది. తరువాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు బాలిక పరిస్థితి చూసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఆమె దారిలోనే మరణించింది.
స్వచ్ఛభారత్ పథకం కింద ఇంటింటికీ మరుగుదొడ్లు కట్టిస్తున్నామని ప్రభుత్వాలు అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇప్పటికీ అనేక గ్రామాల్లో, పట్టణాల్లో మరుగుదొడ్లు లేక పేదలు ముఖ్యంగా స్త్రీలు అనేక రకాల అవమానాలకూ, ఇబ్బందులకూ, దాడులకూ గురవుతూనే ఉన్నారు. బహిష్టు సమయాల్లోనూ, గర్భవతులుగా ఉన్న స్త్రీలు మరిన్ని ఇక్కట్లు పాలవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఆ బాలిక కుటుంబం, ఆ గ్రామంలోని అనేక కుటుంబాలు తమకు స్వచ్ఛభారత్ పథకం కింద మరుగుదొడ్లు కట్టించాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నా అధికారుల అలసత్వంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ఘటన జరిగిన రోజు కూడా ఆ గ్రామానికి వచ్చిన గ్రామ కార్యదర్శికి ఆ బాలిక తమకు మరుగుదొడ్డి కట్టించాలని గుర్తుచేసి లిస్టులో తమపేరును వెరిఫై చేయిం చింది. అదే రోజు ఈ దుర్మార్గానికి బలైపోయింది.
ఈ ఘటనలో జరిగిన ఇంకొక దారుణ మేమిటంటే.. ఈ సంఘటన ఆనోటా ఈనోటా తెలిసి గొడవ జరుగుతుండటంతో ఆ దుర్మార్గుడి తండ్రి కొంత మంది పంచాయతీ పెద్దలతో వచ్చి పంచాయతీ నిర్వహించి ఆ బాలిక మాన ప్రాణాలకు వెలకట్టి 5లక్షలు ఇస్తామని చెప్పి రూ.50,000 వారి చేతిలో పెట్టి కేసుపెట్టవద్దని వత్తిడి తెచ్చారు. ఆ బాలిక రజక సామాజిక వర్గానికి చెందిన బాలిక కావటంతో సమాజంలో ఉన్న చులకన భావంతో ఇంత ధైర్యంగా పంచాయతీ పెట్టి వారి నోరుమూయించాలని చూశారు. వెంటనే ఆ గ్రామంలోని కొంతమంది యువకులు, రజకవృత్తి దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, కార్యకర్తలు జోక్యం చేసుకొని ఘటనను పోలీసుల దృష్టికి తెచ్చి నేరస్థుడిపై కేసు పెట్టించారు. గతంలో కూడా ఆ గ్రామంలో ఇటువంటి పంచాయతీలు పెట్టి దోషులను తప్పించిన సందర్భాలున్నాయి. ఈ ఘటనకు సంబంధించి రెండు వ్యవస్థాపరమైన వైఫల్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి దేశం అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వాలు ఒకవైపు హౌరెత్తిస్తున్నా నేటికీ మరుగుదొడ్లు లేక బహిరంగ మల విసర్జన చేస్తున్న దేశాలలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండటం. రెండవది మన దేశంలో అణగారిన వర్గాల మానప్రాణాలకు పంచాయతీలు నిర్వహించి వెలకట్టి దోషులను శిక్షల నుంచి తప్పిస్తున్న పెత్తందారీ వర్గాల ఆధిపత్యం.
పాశ్చాత్య దేశాలలో టారులెట్ సౌకర్యం ఒక కనీస అవసరంగా ఉండగా, మనదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో మరుగుదొడ్డి కలిగి ఉండటం ఒక విలాసంగా భావించబడుతోంది. దేశంలో ఇప్పటికీ 62.6 కోట్ల మంది ఇండ్లలో టారులెట్ సౌకర్యాలు లేక బహిరంగ ప్రదేశాలకు వెళుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. మన కంటే ఎంతో వెనుకబడిన నైజీరియాలో టాయిలెట్ సౌకర్యం లేనివారు 3.4 కోట్ల మంది, సూడాన్లో 1.9 కోట్ల మంది, పాకిస్థాన్లో 4 కోట్ల్ల మంది మాత్రమే ఉన్నారంటే మనదేశ అభివృద్ధి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుస్తోంది. ఈ పరిస్థితితో అంటువ్యాధులు ప్రబలడమేకాక ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవానికి భంగకరం కావడంతో పాటు చీకటిలో, నిర్జీవ ప్రదేశాల్లో వారు లైంగిక దాడులకు గురవుతున్న సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వెలుగులోకి రాని సంఘటనలు కోకొల్లలు. గతంలో జార్ఖండ్లో ఒక 17ఏండ్ల బాలిక తన పేద తల్లిదండ్రులకు ఎంత మొరపెట్టుకున్నా ఇంటిలో టారులెట్ నిర్మించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోగా, ఉత్తరప్రదేశ్లో ఇద్దరు టీనేజి బాలికలు బహిర్భూమికి వెళ్లగా అక్కడ సామూహిక అత్యాచారానికి గురై హత్య చేయబడి చెట్టుకు వేలాడదీయబడ్డారు.
నల్లగొండలోని గుండాల గ్రామంలో ఓ బాలిక తన పేద తల్లిదండ్రులు ఇంట్లో టారులెట్ సౌకర్యం కల్పించలేరని భావించి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విధమైన ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ లక్షన్నర దరఖాస్తులు ఇండ్లలో టారులెట్ల నిర్మాణం కోసం పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ 15.2శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేక ఆడపిల్లల డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. అంతేకాక, అనేక షాపులలోనూ, పని ప్రదేశాలలోనూ, బహిరంగ ప్రదేశాలలోనూ టారులెట్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
మహిళా సంఘాలు గత అనేక దశాబ్దాలుగా మహిళలకు మరుగుదొడ్డి సౌకర్యాలు కల్పించాలని పోరాడుతూనే ఉన్నాయి. 1978లోనూ 1983లోనూ రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన మల్లుస్వరాజ్యం అసెంబ్లీలో ఈ విషయం పదే పదే ప్రస్తావించేవారు. మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తోటి ఎమ్మెల్యేలు ఆమెను మరుగుదొడ్ల స్వరాజ్యం అని హేళన కూడా చేసేవారు. దీన్ని సవాలుగా తీసుకున్న మల్లు స్వరాజ్యం మరుగుదొడ్డి చాలా ముఖ్యమైన సమస్యేననీ, ఇది ఆడవారి ఆత్మగౌరవానికి, వారి రక్షణకు, భద్రతకు సంబంధించినదికనుక దీనిపై పోరాటం చేస్తూనే ఉంటామని ఆమె సమాధానం చెప్పారు. ఆ తరువాత ఎన్టి రామారావు అధికారంలోకి వచ్చిన తరువాత 1984లో మోటూరు ఉదయం, మానికొండ సూర్యావతి, మల్లుస్వరాజ్యం, పుణ్యవతి, అమ్మాజీ తదితరుల నాయకత్వంలో 5000 మందితో ఒక పెద్ద ప్రదర్శన నిర్వహించి లక్షలాది సంతకాలు సేకరించి ఎన్టి రామారావును కలువగా ఆయన ఒక ప్రత్యేక కమిటీ వేసి ప్రతి గ్రామానికి 40 మరుగుదొడ్లు కట్టిస్తామని, తెలుగు మహిళా బహిర్బూమి పథకం పేరుతో కొంత ప్రయత్నం చేశారు. కానీ నేటికీ మన ఆడపిల్లలు ఆత్మాభిమానం చంపుకొని బహిరంగ ప్రదేశాలకు వెళ్ళాల్సి రావడం, ఇటువంటి అకృత్యాలకు బలికావడం జరుగు తుంటే ప్రభుత్వాలలో ఇప్పటికైనా చలనం వస్తుందా? ఈ సమస్యను తక్షణం పరిష్కరి స్తారా? ఇటువంటి దాష్టీకాలకు బలికాకుండా మన ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని కాపాడు కోవటానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? అనేది మనముందున్న ప్రశ్న.