– గోదావరి ఇసుకను మింగుతున్న సర్కార్
– యజమానులే కూలీలుగా మారిన వైనం
– ఆదివాసీలకు దక్కని ఇసుక రీచ్లు
– రైజింగ్ కాంట్రాక్టర్ల పేరుతో వింత భాష్యం
– ఖనిజాభివృద్ధి సంస్థ పేరుతో వ్యాపారం
– వందల కోట్లు దండుకుంటున్న ప్రభుత్వం
– పీసా చట్టానికి తూట్లు
కోడిపిల్లను గద్ద ఎత్తుకు పోయినట్టు ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక రీచ్లను ప్రభుత్వం మింగుతున్నది. షెడ్యూల్డు ప్రాంతానికి పంచాయితీరాజ్ విస్తరణ (పీసా) చట్ట ప్రకారం ఇసుక సహా ఏజెన్సీ ప్రాంతంలోని చిన్న తరహా ఖనిజాలన్నీ ఆదివాసీలకే దక్కాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వారి హక్కులను కాలరాస్తున్నది. ఆదివాసీ మహిళా సహకార సంఘాలకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు కల్పించకుండా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు ఇసుక తవ్వకాలను అప్పగించటం ద్వారా రూ. వందల కోట్లు ఖజానాలో వేసుకుంటున్నది. ఈ అక్రమానికి గోదావరి నది సాక్ష్యంగా నిలిచింది. తమకు దక్కాల్సిన ఇసుక రీచ్లలో తామే కూలీలుగా మారిన ఆదివాసీల దైన్య స్థితిపై నవతెలంగాణ ప్రత్యేక కథనం..
కొండూరి రమేష్బాబు
గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసింది. ఇక్కడ దొరికే కోట్లాది రూపాయల విలువైన ఇసుకను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నది. ఆదివాసీలకు దక్కాల్సిన విలువైన సంపదను వారికి దక్కకుండా చేసింది. మహిళా సహకార సంఘాలను నామమాత్రంగా మార్చి ఇసుక తవ్వకాలను హైజాక్ చేసింది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు ప్రాంతంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు, లోడింగ్ చట్ట ప్రకారం ఆదివాసీలకు దక్కాల్సి ఉన్నది. ‘పీసా’ చట్టం అమలు కోసం జీవో నంబర్ 66 ద్వారా పంచాయితీరాజ్ శాఖ జారీ చేసిన మార్గదర్శక సూత్రాల్లో కూడా ఏజెన్సీలోని ఇసుక రీచ్ల లైసెన్స్లను స్థానిక ఆదివాసీలకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రకటించిన ఇసుక పాలసీ జీవోల్లో కూడా గిరిజన ప్రాంతంలో ఇసుక తవ్వకాలను ‘పీసా’ చట్టం ప్రకారమే జరిపించాలని స్పష్టం చేసింది. ఆచరణలో మాత్రం ప్రభుత్వం విఫలమైంది. ఇసుకపై వచ్చే ఆదాయం ఆదివాసీలకు దక్కకుండా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు వీటి నిర్వహణ బాధ్యతను అప్పగించింది. ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన ‘సమత’ తీర్పులో కూడా ప్రభుత్వం కానీ ఖనిజాభివృద్ధి సంస్థ కానీ గిరిజనేతరుడితో సమానమని స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా రాష్ట్రంలో 2015 నుంచి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకే ఏజెన్సీ ప్రాంత ఇసుక రీచ్ల లైసెన్స్లను ప్రభుత్వం జారీ చేస్తూ వచ్చింది. ఇసుక తవ్వకాల కోసం ఏర్పాటు చేసిన ఆదివాసీ మహిళా సహకార సంఘాలకు టీఎస్ఎండీసీ రైజింగ్ కాంట్రాక్టర్లుగా మార్చి వేసింది. నదిలోని ఇసుకను ట్రాక్టర్లలో నింపి ఒడ్డుపై పోయటం, అక్కడ లారీలను లోడ్ చేయటం వంటి పనులను మాత్రమే ఈ సంఘాలకు అప్పగించింది.
నామమాత్రపు చెల్లింపులతో ఘరానా మోసం…
వినియోగదారులకు ఆన్లైన్లో ఇసుకను అమ్ముతున్న ప్రభుత్వం ప్రతి క్యూబిక్ మీటర్కు రూ. 600 వసూలు చేస్తున్నది. దీనిలో సీనరేజ్ రూ. 60 గనుల శాఖకు పోగా మిగిలిన రూ. 520 లో రూ. 300 కూడా ప్రభుత్వ ఖజానాకే వెళ్తున్నది. మహిళా సహకార సంఘానికి కేవలం రూ. 220 మాత్రమే చెల్లిస్తున్నది. వీటిలో కూలీలకు వేతనం, ట్రాక్టర్లు, ప్రొక్లైనర్లకు రూ. 180 పోగా సహకార సంఘానికి ప్రతి క్యూబిక్ మీటర్కు కేవలం రూ. 40 మాత్రమే దక్కుతున్నది. ఈ కొద్దిపాటి మొత్తంలో మూడు రూపాయలు సహకార సంఘం నిర్వహణకు పోగా రూ. 37 మాత్రమే గ్రామంలోని ఆదివాసీ కుటుంబాలకు బోనస్ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తున్నది. సీనరేజ్ పోనూ రూ. 520 సహకార సంఘాలకు దక్కాల్సి ఉంది. ఆదివాసీ సహకార సంఘాలకే పూర్తిగా హక్కులు కల్పిస్తే వారికి స్వయం ఉపాధి కలిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏజెన్సీ ఇసుక తవ్వకాలను కూడా వ్యాపారంగా మార్చటంతో ఆదివాసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధరలు, వేతనాలు, ఇతర ఖర్చులు పెరిగినా సహకార సంఘాలకు చెల్లించే మొత్తాన్ని పెంచక పోవటంతో ఆందోళన బాట పట్టాలని ఆదివాసీలు నిర్ణయించారు. అవసరమైతే న్యాయ పోరాటం చేయటానికి సహకార సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.
ప్రభుత్వానికి రూ. 380 కోట్లు….
ఏజెన్సీ ప్రాంతంలో గోదావరిలో గత నాలుగేండ్ల కాలంలో ఒక కోటి క్యూబిక్ మీరట్ల ఇసుకను అమ్మగా ప్రభుత్వానికి రూ. 380 కోట్లు రాగా 10 వేల ఆదివాసీ కుటుంబాలకు కేవలం రూ. 37 కోట్లు మాత్రమే బోనస్ రూపంలో వచ్చింది. చట్ట ప్రకారం మొత్తం ఆదాయం వారికే దక్కాల్సి ఉన్నది.
కొత్త ఇసుక రీచ్లతో మళ్లీ ముందుకు….
గోదావరికి వరదలు తగ్గిన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో 1.20 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు టీఎస్ఎండీసీ రంగం సిద్ధం చేస్తున్నది. వీటికి అవసరమైన పర్యావరణ అనుమతుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణం పూర్తి కావటంతో ఆ ప్రదేశంలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని నిర్ణయించిన నేపధ్యంలో ఏజెన్సీ ప్రాంత ఇసుక రీచ్లపై వచ్చే ఆదాయం కోసం ప్రభుత్వం పరితపిస్తున్నది.
Courtesy Navatelangana