రెండేళ్లుగా అన్నదాతలకు రైతు బంధు పథకాన్ని అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇతర రైతు సంక్షేమ పథకాలకు క్రమంగా చరమగీతం పాడుతోంది. ఏడాదికి రూ.12 వేల కోట్లు రైతుబంధుకు కేటాయిస్తూ దానినే ముఖ్యమంత్రి సర్వరోగ నివారిణిగా భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గడువు ప్రకారం రుణం చెల్లించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పావలా వడ్డీ/వడ్డీలేని రుణం వంటి రాయితీలను పూర్తిగా అటకెక్కించారు.
- ఐదేళ్లుగా బ్యాంకులకు చెల్లింపులు నిలిపివేత
- కేంద్రం ఇచ్చినా సహకరించని రాష్ట్ర సర్కార్
- సకాలంలో చెల్లించే అన్నదాతలకూ ఝలక్
- కేంద్రం పావలా వడ్డీ పక్కాగా జమ
- ఇక కిసాన్ కార్డుంటేనే బంగారంపై రుణం
- వడ్డీ రాయితీ కావాలన్నా కిసాన్ కార్డు తప్పనిసరి
- బ్యాంకులకు రూ. 805 కోట్ల బకాయిలు
హైదరాబాద్, అక్టోబరు 3: సాధారణంగా కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల్లోపు వ్యవసాయ రుణాలకు రెండు శాతం వడ్డీ రాయితీ ఇస్తోంది. దాంతో ఏడు శాతానికే వ్యవసాయ రుణం లభిస్తుంది. ఆ రుణం గడువులోగా చెల్లిస్తే మరో మూడు శాతం వడ్డీని రైతులకు వెనక్కి ఇస్తారు. అంటే, నాలుగు శాతం వడ్డీకే రుణం లభిస్తుందన్న మాట. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం లక్ష రుపాయల రుణం వరకు ఒక శాతం భారం భరించి, మూడు శాతానికే రైతులకు రుణం లభించేట్లు చేసింది. దీన్నే పావలా వడ్డీ రుణం అనేవారు. కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో లక్ష రూపాయల్లోపు రుణానికి ఆ పావలా వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గడువు ప్రకారం రుణం చెల్లించిన రైతులకు వడ్డీ సొమ్మును తిరిగి ఇచ్చేవారు. 2014 ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన నేపథ్యంలో స్తోమత ఉన్న రైతులు కూడా బ్యాంకు అప్పులు చెల్లించాలా? వద్దా? అనే ద్వైదీభావంలో పడిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని 4 దఫాలుగా నాలుగేళ్లపాటు అమలు చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం పావలా వడ్డీ/వడ్డీలేని రుణ పథకం మొత్తం అస్తవ్యస్థమై పోయింది. ఏ రైతూ గడువులోగా చెల్లించక పోవడంతో ఎవరికీ పావలా వడ్డీ/వడ్డీ లేని రుణం వర్తించని పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీ ద్వారా రైతు పొందిన లబ్ధిలో 40-45ు వరకు గడువు దాటినందుకు అధిక వడ్డీల రూపంలో రైతు చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి డబ్బులు కేటాయించడమే మానేసింది. మొత్తం మీద ఐదేళ్లుగా ఈ పథకం అటకెక్కింది. కేంద్రం మాత్రం తన వంతు వాటాగా గడువులోగా చెల్లించిన రైతులకు ఆర్బీఐ ద్వారా 3ు వడ్డీ రాయితీ కింద బ్యాంకులకు నగదు జమచేస్తూ వస్తోంది. పావలా వడ్డీ/వడ్డీలేని రుణం పథకం కింద 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి బకాయిలే రాష్ట్ర ప్రభుత్వం రూ.804.88కోట్లు చెల్లించాల్సి ఉంది. మే 31న రూ.256కోట్ల విడుదలకు జీవో వచ్చింది కానీ, ఆర్థిక శాఖ నయాపైసా విడుదల చేయలేదు.
రైతుబంధే సర్వరోగ నివారిణా? రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సర్వరోగ నివారిణిలా భావిస్తోంది. 2018 లో ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.8 వేలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది నుంచి రూ.10 వేలకు పెంచింది. ప్రతి సీజన్కు ఎకరానికి రూ.5 వేల చొప్పున డబ్బు ఇచ్చినపుడు ఇతర పథకాలు అవసరం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ క్రమంలోనే వడ్డీలేని రుణం పథకాన్ని నిలిపివేశారు. ‘రుణమాఫీ’ పథకాన్ని కూడా పక్కాగా అమలు చేయటంలేదు.
కిసాన్ క్రెడిట్ కార్డులు ఉంటేనే వడ్డీరాయితీ మరోవైపు బ్యాంకర్లు వడ్డీ రాయితీకి, కిసాన్ క్రెడిట్ కార్డులకు లింకు పెడుతూ ప్రతిపాదనలు తయారు చేశాయి. కేవలం కేసీసీ ఉన్న రైతులకే వడ్డీ రాయితీని అమలు చేయాలని బ్యాంకులు ప్రభుత్వానికి సూచించాయి. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఎజెండాలో దీనిని పొందుపరిచారు. 3ు వడ్డీ రాయితీని రైతులకు ఇస్తున్న కేంద్రం… బంగారు రుణాల పేరిట అనర్హులు వడ్డీ రాయితీ పొందుతున్నారని భావిస్తోంది. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడులో ఈ వ్యవహారం జరుగుతోందని కేంద్రం గుర్తించింది. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. అయితే, రాష్ట్రంలో 35ు మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు లేవు. వారందరికీ వడ్డీ రాయితీ ప్రయోజనాలు, బంగారం రుణం ప్రయోజనాలు అందవు.