– సామాజిక మాధ్యమాల్లో చేదు అనుభవం
– రెండున్నర గంటల ప్రసంగానికి నెటిజన్ల నుంచి ప్రతికూల స్పందన
– ఇటీవల మోడీ రెండు కార్యక్రమాలకూ ఇదే స్పందన
– బీహార్లో ఎన్డీయే పాలనలపై ప్రజల అసంతృప్తి?
పాట్నా : బీహార్లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీలు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది నవంబర్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ నితీశ్ నేతృత్వంలోని జేడీ(యూ), బీజేపీలు కలిసి ఎన్డీయే ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయి. నితీశ్ సీఎంగా ఉన్న ఎన్డీయే సర్కారు.. మరికొద్ది నెలల్లో అధికార కాలాన్ని పూర్తి చేసుకోనున్నది. అయితే, రాష్ట్ర ప్రజల్లో ఎన్డీయే పాలన పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నట్టుగా ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
లైక్లు 9వేలు.. డిస్లైక్లు 27వేలకు పైగానే..!
రెండు రోజుల క్రితం సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా పలు సామాజిక మాధ్యమాలు వేదికగా ‘నిశ్చరు సంవాద్’ పేరిట వర్చువల్ ఎలక్షన్ ర్యాలీని చేపట్టారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో మొదటిది. ఈ ర్యాలీలో ఆయన దాదాపు రెండున్నర గంటల పాటు ప్రసంగించారు. అయితే, ఆయన ప్రసంగానికి నెటిజన్లు ఇంకో విధంగా స్పందించారు. సోషల్ మీడియాలో వినియోగదారులు డిస్లైక్ల వర్షం కురిపించారు. కామెంట్ బాక్సుల్లో నితీశ్ పాలన, ఎన్డీయే సర్కారు పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు. ఆయన ప్రసంగానికి మొత్తం 9,931 లైక్లు వచ్చాయి. డిస్లైక్లు మాత్రం దాదాపుగా అంతకు మూడురెట్లు.. అంటే 27,342 రావడం గమనార్హం. అయితే, ఊహించని ఈ పరిణామం జేడీ(యూ), బీజేపీ కార్యకర్తలకు మింగుడుపడటం లేదు. ప్రజల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ రెండు పార్టీలు నైతిక స్థైర్యాన్ని కోల్పోయినట్టుగా కనిపిస్తున్నాయి.
ఇటీవల మోడీకి ఇదే అనుభవం
అంతేకాదు, ఇటీవల ప్రధాని మోడీ మన్కీ బాత్తో పాటు గవర్నర్లతో సమావేశానికి సంబంధించిన రెండు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు ప్రధాని మోడీ, బీజేపీ అధికారిక ఖాతాల నుంచి ప్రసారమయ్యాయి.
అయితే ఈ రెండు ఖాతాలతో పాటు ఇతర ప్లాట్ఫాంల ద్వారా ప్రసారమైన పై రెండు మోడీ అధికారిక కార్యమ్రాలకు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఝలక్ ఇచ్చారు. తమ డిస్లైక్లతో విశ్వరూపం చూపించారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం.. సామాజిక మాధ్యమం ఏదైనా మోడీకి తిరుగులేదని ఇన్ని రోజులు వాదిస్తూ వస్తున్న బీజేపీ నాయకులకు.. నెటిజన్లు ‘డిస్లైక్’ లతో వాస్తవాలను కండ్ల ముందుంచారు.
‘బీహార్లో ఎన్డీయేకు కష్టమే‘
ఇలా ప్రధాని మోడీ, బీహార్ సీఎం నితీశ్లకు సామాజికమాధ్యమాల్లో ప్రతికూల స్పందనలు రావడం బీహార్లో రాజకీయ ముఖచిత్రం మారొచ్చనేదానికి సంకేతమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కరోనా లాక్డౌన్, వలసకార్మికుల కష్టాలు, నిరుద్యోగ సమస్య, జీడీపీ పతనం వంటివి పనిచేయవచ్చని చెప్తున్నారు. 2005లో బీహార్ సీఎంగా ఎన్నికైన నితీశ్ కుమార్.. దాదాపు 15 ఏండ్లుగా(కొన్ని పరిస్థితులను మినహాయించి) రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. బీజేపీతో గట్టి సంబంధాన్ని కలిగి ఉండి.. మధ్యలో పొరపచ్చాలు రావడంతో లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీతో చేతులు కలిపి కిందటి ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు.
అయితే, ఆర్జేడీతో తెగదెంపులు చేసుకొని మళ్లీ ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే, బీజేపీతో పొత్తుతో పాటు ఆయన అస్థిర నిర్ణయాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు మరిన్ని కష్టాలను తెప్పిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 243 ఎమ్మెల్యేస్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రస్తుతం ఆర్జేడీకి అత్యధికంగా 80 సీట్లు ఉన్నాయి. ఇక జేడీయూకి 71, బీజేపీకి 53 సీట్ల బలమున్నది.
Courtesy: NT