- 11వ రోజు పోరు…
- ఫలించిన ఉద్యోగులు, కార్మికుల ఒత్తిడి
- ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో సంపూర్ణ మద్దతు
- అత్యవసర సమావేశంలో నిర్ణయం
- ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు
- కార్మికులకు మద్దతిస్తామని స్పష్టీకరణ
- నేడు టీజీవో, ఉద్యోగ జేఏసీ భేటీలు
- ఆ తర్వాత అధికారిక ప్రకటన
- ఆ వెంటనే సీఎస్ వద్దకు.. వినతి పత్రం
- మా డిమాండ్లూ ఉన్నాయి.. ఎన్నికల తర్వాత చెప్తాం: రవీందర్ రెడ్డి
హైదరాబాద్: ఆర్టీసీకి సబ్బండ వర్గాల మద్దతు పెరుగుతుండడం.. కార్మికుల బలవన్మరణాలు టీఎన్జీవో, టీజీవో నాయకుల్లో కదలిక తీసుకొచ్చాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిందేనని క్షేత్రస్థాయిలోని ఉద్యోగులంతా ముక్తకంఠంతో ఒత్తిడి చేయడంతో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) స్పందించింది. 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో కూడిన కార్యవర్గం మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. కార్యవర్గ సమావేశంలో మెజారిటీ కార్యవర్గ సభ్యులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. దాంతో, అప్పటికప్పుడే ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులను పిలిపించుకొని టీఎన్జీవోలు చర్చలు జరిపారు. ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటించనున్నట్లు సూత్రప్రాయంగా స్పష్టం చేశారు. ఇక, టీజీవోల కార్యవర్గం కూడా బుధవారం సమావేశం కానుంది.
ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు 126 సంఘాలతో కూడిన తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఈ అంశంపై సమావేశమై చర్చించనుంది. అనంతరం, ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ జేఏసీ అధికారికంగా మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. సాయంత్రానికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి ఉద్యోగ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. మరోవైపు, ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మధ్యవర్తిగా టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఉండాలని టీఎన్జీవోలు తీర్మానం చేశారు. సమ్మె విరమణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి రాజేందర్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని, అవసరమైతే సీఎం కాళ్లు మొక్కైనా 48 వేల మంది ఆర్టీసీ కార్మికులకు నష్టం కలిగించకుండా సమస్యను పరిష్కరించాలని కోరనున్నట్లు వెల్లడించారు. ఇందుకు రవీందర్ రెడ్డిని దూతగా పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఉద్యోగుల ఒత్తిడితో ఆర్టీసీ జేఏసీతో చర్చలు: రవీందర్రెడ్డి
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సకల ఉద్యోగుల సమ్మె అనివార్యంగా కనిపిస్తోందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కారం రవీందర్ రెడ్డి అన్నారు. కార్మికుల వేతనాలు పెరగడంతోపాటు ఆర్టీసీ ఆస్తులనూ పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మెగా కాకుండా సకల ఉద్యోగుల సమ్మెగా మారే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులు కోరితే ఏం చేయడానికైనా సిద్ధంగా
ఉన్నామన్నారు. సమావేశాల తర్వాత నాంపల్లి టీఎన్జీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘కిందిస్థాయి ఉద్యోగుల నుంచి వచ్చిన ఒత్తిడితో ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలిచాం. శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ కలచి వేసింది. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దు. ధైర్యంగా నిలబడాలి. మీ వెనక ఉద్యోగులంతా ఉన్నారు’’ అని భరోసా ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతం కావాలని కోరుకుంటున్నామన్నారు. ‘‘ఆర్టీసీ కార్మికులకు వచ్చే జీతాలు చాలా తక్కువ. ఫిట్మెంట్ మాకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు సంతోషించాం. వారిని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలనే డిమాండ్ ముందు నుంచే ఉంది. నాలుగేళ్లకు ఒకసారి ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఉంటుంది. ఆర్టీసీ కార్మికులకు వస్తే మాకూ వస్తుందని భావించాం. 16 శాతం ఐఆర్ ఇచ్చినప్పుడు సంతోషించాం. ఏ కార్మికుడికీ నష్టం జరగకూడదు. మాతోపాటు ఆర్టీసీ కార్మికులు ఉద్యమంలో నడిచారు. తెలంగాణలో ఏ కార్యక్రమానికైనా ఆర్టీసీ ఉద్యోగులే ముందున్నారు. తోటి ఉద్యోగులకు న్యాయం జరగాల్సి ఉంది. ఆర్టీసీ సమ్మెకు, కార్మికులకు సబ్బండ వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. వారి సమస్యలు పరిష్కారమైతే.. సబ్బండ ఉద్యోగుల సమస్యలూ పరిష్కారమవుతాయి. ప్రభుత్వం స్పందించ కపోతే ఆర్టీసీ కార్మికుడిని కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని వివరించారు.
మా డిమాండ్లూ ఉన్నాయి
ఎన్నికలు వస్తున్నాయి తప్ప ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరకలేదని రవీందర్ రెడ్డి అన్నారు. ‘‘ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం సీఎంకు వద్దకు వెళ్లాం. వదంతులు, అపోహలు రావడంతో మనస్తాపానికి గురయ్యాం. టీఎన్జీవోలు, జేఏసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే ముందుకెళుతున్నాం. కొందరు వక్రీకరిస్తే బాధపడ్డాం. మాకు మద్దతు ఇవ్వాలని ప్రతి కార్మికుడు మెసేజ్లు పెడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆవేదనను అర్థం చేసుకున్నాం. సమ్మెకు మద్దతుగా నిలవడానికి కార్యవర్గ సమావేశం నిర్వహించాం. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం బుధవారం జరగనుంది. అందులో నిర్ణయం ప్రకటిస్తాం. ఆర్టీసీ కార్మికుల వెంట ఉంటాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, చర్చలకు ఆహ్వానించాలి’’ అని డిమాండ్ చేశారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ‘‘మా డిమాండ్లు కూడా ఉన్నాయి. ఉప ఎన్నికల తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆ తర్వాతే మా నిర్ణయం ఉంటుంది. ఆర్టీసీ కార్మికులకు ఎండీ అధిష్ఠానం. మాకు సీఎస్ బాస్. సీఎస్ స్థాయిలో తేలనప్పుడే సీఎం వద్దకు వెళతాం’’ అని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు కోరితే మధ్యవర్తిగా ఉండటానికి సిద్ధమేనని ప్రకటించారు.
courtesy Andhra Jyothy