- ప్రగతికి బాటలు వేసే చరిత్రాత్మక రెవెన్యూ బిల్లు
- దీంతో రెవెన్యూ పనితీరులో విప్లవాత్మక మార్పులు
- అవినీతి అధికారులు, భూబకాసురుల నుంచి రక్షణ
- అసెంబ్లీలో ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్
- పాస్పుస్తకాల బిల్లు-2020’ ప్రవేశపెట్టిన కేసీఆర్
- తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉన్నానో
- ఈ బిల్లు పెట్టినందుకు అంత సంతోషంగా ఉన్నా
- ఈ బిల్లు ప్రవేశపెట్టడం నా పూర్వజన్మ సుకృతం
- ప్రతి అంగుళం భూమి సర్వేతో వివాదాలకు అడ్డుకట్ట
- రెవెన్యూ కోర్టుల వ్యవస్థ వికారం.. అందుకే రద్దు
- మా దగ్గరున్న డేటాబేస్ ప్రకారం ఆదాయ ధ్రువీకరణ
- ఇకపై స్థానిక సంస్థల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు
చరితాత్మ్రకమైన, అద్భుతమైన, ప్రగతికి బాటలు వేసే బిల్లు ఇది. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి, రైతులు, నిరుపేదలు, నోరులేనివారికి అండగా ఉండే అవినీతిరహిత, సరళీకృత చట్టాన్ని సభలో ప్రతిపాదిస్తున్నందుకు.. తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉన్నానో ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నా. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ వర్తించే బిల్లు ప్రవేశపెట్టడం నా పూర్వజన్మ సుకృతం.
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టం పేదలకు బ్రహ్మాస్త్రం అని.. మాఫియా ముఠాల నుంచి, భూబకాసురుల నుంచి, అవినీతి అధికారుల నుంచి వారికి పూర్తిరక్షణ కల్పిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. డిజిటల్ సర్వే, ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ధరణి పోర్టల్తో రెవెన్యూ వ్యవస్థ పనితీరులో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని చెప్పారు. వీఆర్ఏలు, వీఆర్వోలకు ఉద్యోగ భద్రత, ఆప్షన్ల అవకాశం ఉంటాయని, సర్దుబాటుకు అనుగుణంగా వారు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూముల ధరలు పెరిగినందున, భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం, పేదల భూములను లాక్కునే ముప్పు ఉన్నాయని.. అందుకే, ఆర్థికంగా భారమైనా, రిజిస్ట్రేషన్ ఆదాయం రోజూ పది కోట్లు నష్టపోతున్నా కొత్త చట్టాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ లోగా ఎవ్వరికీ ఏకాన పైసా ఇవ్వవద్దని రాష్ట్ర ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. అలాగే.. జీవితకాలం వర్తించేలా కుల ధ్రువీకరణ పత్రాలను ఇక నుంచి గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలే జారీచేస్తాయని సీఎం వెల్లడించారు. ఇకపై రెవెన్యూ శాఖ కులధ్రువీకరణ పత్రాలు జారీచేయబోదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆస్తులు, ఆదాయానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాబేస్ ఆధారంగానే ఆదాయ ధ్రువీరణ పత్రాలు జారీచేస్తామన్నారు. తానైతేనే రెవెన్యూ శాఖను బాగా పర్యవేక్షిస్తానని, అందుకే తనకు కార్య భారమైనా, కొత్త చట్టం కోసం ఈ శాఖను తనవద్దే ఉంచుకున్నానని చెప్పారు. బుధవారం, శాసనసభలో కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం బిల్లు లక్ష్యాలను వివరించారు.
ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఈ రోజు మన రాష్ట్రంలో భూములకు సంబంధించి అనేక సమస్యలు. గిరిజనుల పోడు భూములు-వారిపై అటవీశాఖ అధికారుల దాడులు.. ‘మమ్మల్ని కొట్టిచంపుతున్నర’ని గిరిజనుల ఆవేదన.. హద్దులు సరిగ లేకపోవడం, గట్ల పంచాయతీ, హత్యలు చేసుకోవడం.. ఇలా చాలా దూరం పోయింది. భూ సంస్కరణలు ఒక పద్ధతి ప్రకారం చేపట్టాలని ప్రయత్నాలు చాలా జరిగాయి. 1940ల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో భూపోరాటాలు జరిగాయి. 1971లో పీవీ భూ సంస్కరణలు, 1985లో ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, 2002లో చంద్రబాబు రెవెన్యూ-పంచాయతీరాజ్ ఒకటే చేయడం, ఆ తర్వాత 2007లో వైఎస్ హయాంలో రెవెన్యూ, పంచాయతీని విడగొట్టి వీఆర్ఏ వ్యవస్థను ప్రవేశపెట్టడం వంటి పరిణామాలూ జరిగాయి. ఎందుకోగానీ, రెవెన్యూశాఖలో ఐటీని గత పాలకులు ప్రవేశపెట్టలేదు. దీనివల్ల సమస్యలు జఠిలమయ్యాయి. రైతులు, రెవెన్యూ మధ్య శత్రుపూరిత వాతావరణం ఏర్పడింది. ఒక ఎమ్మార్వోపై పెట్రోలుపోసి తగులబెట్టి, ఆయన తగులబెట్టుకోవడం మనం కళ్లారా చూసినం. గత ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినా పరిష్కారం చూపలేదు. ఈ నేపథ్యంలో అవినీతి రహిత రెవెన్యూ పాలన కోసం 3 సంవత్సరాలుగా తీవ్ర కసరత్తు చేస్తున్నాం. భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాం. కొత్త చట్టంతో ప్రజలకు మంచి జరుగుతుంది తప్ప, ఉద్యోగుల ఉద్యోగులకు ఢోకా లేదని హామీ ఇస్తున్న. పైగా తరతరాలుగా పనిచేస్తున్న వీఆర్ఏలను స్కేల్ ఎంప్లాయిస్గా గుర్తిస్తం. వీఆర్ఏలు.. 20,292 మంది ఉన్నరు. వారికి ఆప్షన్లు ఇచ్చి స్థాయికి తగ్గట్టుగా వేరువేరు శాఖల్లో మూడు, నాలుగు నెలల్లో సర్దుబాటు చేస్తం. వీఆర్వో వ్యవస్థను గతంలో కూడా రద్దు చేశారు. ఇప్పుడు అనివార్యంగా చేస్తున్నం. మా ప్రత్యామ్నాయం.. ఐటీ. వీఆర్ఏల్లో దళితులు, బీసీలు ఉన్నరు. ఏటా 260 కోట్లు భారం పడుతున్నా స్కేల్ పోస్టులు ఇస్తం. ఇక, వీఆర్వోలు 5,485 మంది ఉన్నరు. వీరికి కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. వీరికి కూడా ఆప్షన్లు ఇస్తరు. రెండు, మూడు నెలల్లో వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తరు. ఇక తహశీల్దార్లు, ఆర్డీవోలు ఉంటరు. కానీ, విచక్షణాధికారాలు ఉండవు.
ఎందుకు పెట్టిన్రో?
తహసీల్దారే ఆర్డర్ పాస్ చేస్తడు.. ఆయన వద్దే కోర్టు ఉంటుంది. ఆర్డీవో, జేసీల వద్దా ఇదే పరిస్థితి. అసలు ఇది ఎందుకు పెట్టిన్రో తెలియదు. ఒక్క రెవెన్యూ శాఖలోనే మూడు కోర్టులు ఉన్నయి. ఈ వ్యవస్థే వికారంగా ఉంది. భూ వివాదాల పరిష్కారం కోసం సివిల్, సబార్డినేట్, సెషన్స్ కోర్టు, హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టు ఉంది. అందువల్ల, రెవెన్యూ కోర్టులు రద్దుచేయాలని నిర్ణయం తీసుకున్నం. కొంతమంది సమైక్యవాదులు శాపనార్థాలు పెట్టినా, తెలంగాణ వచ్చినంక భూముల ధరలు విపరీతంగా పెరిగినయి. ఎక్కడకు పోయినా ఎకరం కనీసం 10 లక్షలుంది. భవిష్యత్తులో మరింత పెరుగుతయి. శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. ఆ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేందుకే రెవెన్యూ కోర్టుల రద్దు నిర్ణయం. రెవెన్యూ శాఖ తన బాధ్యత నిర్వర్తిస్తది. ఏదైనా వివాదం ఉంటే, సివిల్ కోర్టు లు చూసుకుంటయి. ప్రస్తుతం భూ ఆక్రమణలు, పీవోటి, భూదాన్.. వంటి వివాదాలకు సంబంధించి ఎం ఆర్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ల కోర్టుల వద్ద 16,137 కేసులు ఉన్నయి. వీటి పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ ట్రైబ్యునళ్లు ఏర్పాటుచేస్తాం. నిర్దిష్ట కాలపరిమితిలోగా ఈ కేసులను ట్రైబ్యునళ్లు పరిష్కరిస్తాయి. హైకోర్టు సూచనల మేరకు ఎంత కాలం అన్నది నిర్ధారిస్తం. ఆ తర్వాత తెలంగాణాలో భూవివాదాలే ఉండవు.
రిజిస్ట్రేషన్.. మ్యుటేషన్ ఒకేచోట..
1908 రిజిస్ట్రేషన్ యాక్టు సెక్షన్ 7 కింద రాష్ట్రాలకు విశేషాధికారం ఉంది. జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లుగా ఎవరినైనా(అధికారులు, అనధికారులు) నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దీనిని సద్వినియోగం చేసుకుంటున్నం. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత, ఏవి రిజిస్ట్రేషన్ జరగాలో అవే జరుగుతయి. రిజిస్ట్రేషన్లు రెండు భాగాలుగా జరుగుతయి. తహసీల్లార్లు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా కూడా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని 590 మండలాల్లో ఎంఆర్వోలు కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయ భూములను మాత్రమే రిజిస్టర్ చేస్తరు. వ్యవసాయేతర భూములను ప్రస్తుతం పనిచేస్తున్న 141 మంది సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తరు. గ్రామకంఠాల్లోని ఆస్తులు, మున్సిపాలిటీల్లోని ప్లాట్లు, ఫ్లాట్స్ వంటి ఆస్తులు, కంపెనీలు, పరిశ్రమల వద్ద ఉండే భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తరు. వీటికి సంబంధించిన మార్పులు, చేర్పులు సబ్ రిజిస్ట్రార్లే చేస్తరు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కమ్ ఎంఆర్వో, క్రయవిక్రయదారులకు టైం స్లాట్ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత భూమి విక్రయించిన రైతు పాసుబుక్కులో నుంచి సంబంధిత వివరాలు వెంటనే తొలగిపోతయి. ఆ వివరాలు, భూమి కొన్నవారి పాసుబుక్కులో చేరుతయి. అంతేకాదు.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్తో పాటు ఐటీ టేబుల్కి డాక్యుమెంటు ఇస్తరు. ఇందుకు అనుగుణంగా అప్లోడ్ అక్కడికక్కడే చేస్తరు. వాటి కాపీని కూడా డౌన్లోడ్ చేసి క్రయవిక్రయదారులకు క్షణాల్లో ఇస్తరు. ఇక.. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద బాధ.. వారసత్వ భూ కేటాయింపు. దీన్నే ఫౌతీ అని కూడ అంటరు. ఆస్తి కోసం, వారసత్వ రికార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే.. గత ప్రభుత్వాలు అధికారుల చేత విచారణ చేయించేవి. ఇప్పుడు ఆ విచారణలు ఉండవు. కొత్త చట్టం ఉమ్మడి కుటుంబానికే అధికారం ఇస్తుంది. వారందరు కూడా సంతకాలు చేసి ఇస్తే వారసత్వ రికార్డులు అందజేస్తారు.
రెరడు భాగాలుగా ధరణి పోర్టల్
ధరణి పోర్టల్ వ్యవసాయ, వ్యవసాయేతర అనే రెండు భాగాలుగా ఉంటుంది. ఇది పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాపీ తీసుకోవచ్చు. భూ రికార్డుల పరిరక్షణకు ఇది ఆయువు పట్టు. అందుకే సచివాలయం, కలెక్టరేట్లతో పాటు డిజాస్టర్ మేనేజ్మెం ట్ మెకానిజం వంటి సురక్షిత కేంద్రాల్లో రికార్డులు పెడతరు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఏ అధికారికీ విచక్షణాధికారం ఉండదు. భూమి, ఈసీ వివరాలు పోర్టల్లో అందుబాటులో ఉంటయి. మరో జోక్ కూడా ఉన్నది.. ఇది వాస్తవంగా జరుగుతోంది కూడా! కొంతమంది.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఢిల్లీ సెంట్రల్ రైల్వేస్టేషన్, చార్మినార్ వంటి సుప్రసిద్ధ ప్రాంతాలనూ రిజిస్టర్ చేశారు. ఇలాంటి వాటిని కొత్త సాఫ్ట్వేర్ తిప్పికొడుతుంది. ఆటోలాక్ అవుతుంది. అలాంటివి రిజిస్టర్ కావు.
రాష్ట్ర ప్రజలకు శుభవార్త…
రాష్ట్ర ప్రజలకు శుభవార్త. భూ వివాదాల పీడను శాశ్వతంగా విరగడ చేసేందుకు ప్రతీ ఇంచు సర్వే చేస్తం. ఎవరూ భూములు ఆక్రమించుకునే పరిస్థితి ఉండదు. ఇందుకోసం ఎంత ఖర్చయినా భరించాలని నిర్ణయం తీసుకున్నం. నిజాం సర్కారు తర్వాత మళ్లీ ఇప్పుడే సర్వే చేస్తున్నం. అక్రమార్కులు అమాయకుల హక్కులను హరించకుండా ఉండేందుకు ప్రతీ సర్వే నెంబరుకూ అక్షాంశ, రేఖాంశాలతో కూడిన హద్దులు నిర్ధారణ చేయిస్తం. ఇందువల్ల, గట్ల పంచాయతీ, గెట్ల పంచాయతీ ఉండదు. ఈసీల కోసం, బ్యాంకుల్లో పాసుపుస్తకాల కోసం తిరిగే బాధలు పోతయి.
Courtesy Andhrajyothi