– సామాన్యుడి చేతిలో చిల్లిగవ్వలేదు..
– ఏకపక్షంగా విధించిన కఠిన లాక్డౌన్ ఈ ఫలితాలకు కారణం : ఆర్థిక విశ్లేషకులు
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం పతాక స్థాయికి చేరుకుందన్న విషయం తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు ఏకంగా ‘మైనస్24శాతం’ క్షీణించటమంటే మా మూలు విషయంకాదు. కీలక రంగాల్లోని వివిధవిభా గాలన్నీ తిరోగమనంలో ఉన్నాయి. ద్రవ్యలోటు అంచనాలు దాటి అనూహ్యంగా పెరిగిపోయింది. తయారీరంగం 39శాతం, నిర్మాణరంగం 50శాతం, వాణిజ్యం, ఆతిథ్యం, సమాచార రంగాలు 47శాతం, మైనింగ్, క్వారీల తవ్వకం23శాతం క్షీణించాయి. ఈ సంక్షోభ సమయాన దేశ ప్రజలకు తిండిపెట్టడమే కాదు, కోట్లాదిమందికి వ్యవసాయమే ఆధారమైంది. ఇంత తీవ్రమైన సంక్షోభంలోనూ 3.4శాతం వృద్ధి నమోదైంది. మార్చి 25న దేశవ్యాప్తంగా కఠినమైన లాక్డౌన్ విధించారు. దాంతో దేశ ప్రజలంతా తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. ఏప్రిల్, మే చివరి వరకూ ఇది కొనసాగింది. రోజు రోజుకీ పరిస్థితులు దిగజారటంతో, ఏమవుతుందోననే భయాందోళన అందరిలో నెలకొంది. దాంతో ఉత్పత్తి రంగమంతా దెబ్బతిన్నది. జూన్లో అన్లాక్ మొద లైనా మునపటి భావనలు, పరిస్థితులు మారలేదు. అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కనీసం కరోనా వైరస్ విస్తరించకుండా విజయం సాధించామా ? అంటే..అదీ లేదు. కరోనా కేసుల సంఖ్య 36లక్షల దాటింది.
తమను తాము రక్షించుకున్న ఇతర దేశాలు !
భారత ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంతగా పెద్ద ఊబిలో కూరుకుపోయిందని తేలిపోయింది. సోమవారం జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టంగా ఉంది. కఠినమైన అనాలోచిత లాక్డౌన్, ఆర్థికమాంద్యం ఈ పరిస్థితికి దారితీసిందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రాలను సంప్రదించకుండా, నిపుణుల సలహా తీసుకోకుండా మోడీ సర్కార్ ఏకపక్షంగా ప్రకటించిన లాక్డౌన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ దెబ్బకు ‘ఏప్రిల్, మే, జూన్’లలో ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైంది. చైనా, రష్యా, ఆస్ట్రేలియాలు కూడా వైరస్బారిన పడి విలవిల్లాడాయి. లాక్డౌన్లు విధించాయి. కానీ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంతగా దెబ్బతినలేదన్న విషయం గుర్తించాలి. అలాగే కరోనా వైరస్ విస్తరణను కూడా దాదాపు అరికట్టాయి. కొంతలో కొంత అక్కడి ప్రజానీకం కాస్త ఉపశమనం పొందారు. కానీ మనదగ్గర ఆ పరిస్థితి లేదు. వైరస్ భయాలు ఇప్పుడు మరింత పెరిగాయి. వైరస్ బారిన పడే రిస్క్ మరింత పెరిగింది.
వర్ధమాన దేశాలైన దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, రష్యా, చైనాలతో పోల్చుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువగా నష్టపోయింది. గత ఏడాది క్యూ-1తో పోల్చిచూస్తే వివిధ దేశాల జీడీపీలో మార్పులు ఇలా ఉన్నాయి..
దేశం జీడీపీ (2020-21)లో మార్పు(శాతాల్లో)
చైనా 3.2 శాతం వృద్ధి
రష్యా 1.8
ఆస్ట్రేలియా 1.4
బ్రెజిల్ మైనస్ 0.2క్షీణత
దక్షిణాఫ్రికా మైనస్ 0.3
అమెరికా మైనస్ 9.1
జపాన్ మైనస్ 10
జర్మనీ మైనస్ 11.3
ఈయూ మైనస్ 14.2
ఫ్రాన్స్ మైనస్ 19
బ్రిటన్ మైనస్ 21.7
ఇండియా మైనస్ 24
Courtesy Nava telangana