దిల్సుఖ్నగర్/సరూర్నగర్ : భారీ వర్షానికి రోడ్డుపైకి వచ్చిన వరదనీటిలో కొట్టుకుపోయి గల్లంతైన నవీన్బాబు మృతదేహం సరూర్నగర్ చెరువులో 20 గంటల తరువాత లభించింది. ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు 16 గంటలపాటు గాలింపు చేపట్టి అతికష్టమ్మీద మృతదేహాన్ని వెలికితీశాయి. అల్మా్సగూడ బాలాజీ కాలనీకి చెందిన ఎలక్ర్టీషియన్ నవీన్బాబు(43) ఆదివారం సాయంత్రం తపోవన్ కాలనీ నుంచి గ్రీన్పార్క్ కాలనీ మీదుగా వెళ్లే ప్రయత్నంలో స్కూటీని వెనక నుంచి నెడుతూ రోడ్డు పక్కన గుంతలో నిలిచిన నీటిలో పడిపోయి.. చెరువులోకి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీనిని గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకు డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. అర్ధరాత్రి 3 గంటలకు గాలింపు నిలిపి వేసి, తిరిగి సోమవారం ఉదయం ప్రారంభించారు. 20 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందం, 20 మంది సభ్యుల డీఆర్ఎఫ్ బృందాలు గ్రూపులుగా విడిపోయి 3 బోట్ల ద్వారా గాలించారు. చివరికి మద్యాహ్నం 3.35 గంటలకు నవీన్ గల్లంతయిన ప్రదేశం నుంచి 30 మీటర్ల దూరంలో మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. సరూర్నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. 15 ఏళ్ల క్రితం వివాహమైన నవీన్బాబుకు భార్య శాలిని, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సరూర్నగర్ చెరువు కట్ట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్లే నిండు ప్రాణం బలైందని స్థానికులు ఆరోపించారు. కాగా, జీహెచ్ఎంసీ, ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగానే నవీన్బాబు చెరువులో కొట్టుకుపోయి మృతి చెందాడని కాంగ్రెస్ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, పటేల్ రమే్షరెడ్డి, దర్పల్లి రాజశేఖర్రెడ్డి తదితరులు ఆరోపించారు.
నవీన్ కుటుంబాన్ని ఆదుకుంటాం: సబిత
నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి నవీన్ కుటుంబసభ్యులను ఆమె పరామర్శించి ఓదార్చారు. తక్షణ సాయంగా రూ.50 వేలు అందజేయడంతోపాటు మరో రూ.6 లక్షలు ఎక్స్గ్రేషియాగా చెల్లిస్తామని ప్రకటించారు. నవీన్ భార్య శాలినికి మునిసిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం కల్పిస్తామని, వారి ఇద్దరు కూతుళ్ల చదువు బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటామన్నారు.
Courtesy Andhrajyothi