- కుమార్తె జ్ఞాపకాలతో కన్నపేగు కలవరం
- రోదిస్తున్న తల్లి సుకన్య, మేనమామ ఆదిత్య
హైదరాబాద్ నేరేడ్మెట్ : పిల్లల అల్లరితో సందడిగా కనిపించే ఆ ఇల్లు మూగబోయింది. తమ గారాలపట్టి చిట్టచివరిగా పలికిన పలుకులు తలచుకొని ఆ తండ్రి గుండె బద్దలైంది. ‘నాన్నా..స్నాక్స్ సిద్ధం చేయి! బయట ఆడుకొని ఇప్పుడే వస్తాను’ అంటూ సైకిల్తో వెళ్లిన బిడ్డను మృత్యువు నాలా రూపంలో మింగేయడంతో విలవిల్లాడిపోయారు. ‘నువ్వు చెప్పినట్లే సిద్ధం చేశానమ్మా.. వీటిని ఎవరు తింటారమ్మా’ అంటూ విలపించారు. నేరేడ్మెట్ ఈస్ట్దీన్దయాళ్నగర్లో శుక్రవారం కనిపించిన విషాద వాతావరణం ఇది. గురువారం సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లిన సుమేధ(12) నాలాలో వరదనీటి ఉద్ధృతికి కొట్టుకుపోవడం, మరునాడు ఉదయం అక్కడికి 2 కి.మీ. దూరంలోని బండ చెరువు వద్ద మృతదేహం లభ్యం కావడం ఆవేదనకు గురిచేసింది.
వాట్సాప్ గ్రూపులో ఫొటోలు పంపి..
నేరేడ్మెట్ కాకతీయనగర్కాలనీలో పశ్చిమ్బంగకు చెందిన అభిజిత్ కపూరియా, సుకన్య కుటుంబం తొలుత ఉండేది. రెండు నెలల క్రితమే ఈస్ట్దీన్దయాళ్నగర్లోని ఇంట్లో అద్దెకు చేరారు. వారి కుమార్తె సుమేధ గురువారం సాయంత్రం రోజూ తనతో పాటు ఆడుకునే మరో బాలికను రమ్మని కోరినా రానని చెప్పడంతో ఒంటరిగానే ఆడుకుంది. రాత్రయినా ఆచూకీ లేక స్థానిక వాట్సాప్ గ్రూప్లో బాలిక ఫొటోలు పంపి తర్వాత పోలీసులకు ఫిర్యాదుచేశారు. శుక్రవారం చివరకు విషాద వార్త వినాల్సి వచ్చింది.
ఏనాడూ నా కుమార్తెను పల్లెత్తు మాట అనలేదు. ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినప్పుడు ఎంత నరకం అనుభవించిందో
– ఉస్మానియా ఆసుపత్రి వద్ద సుమేధ తండ్రి అభిజిత్
దృశ్యాలను పరిశీలిస్తే..
- సుమేధ సైకిల్ తొక్కుతూ పడిపోయిన నాలా
- 200 మీ. దూరంలో సైకిల్ దొరికిన ప్రాంతం
- ఈ నాలాలోనే బాలిక కొట్టుకుపోయింది.
- అన్వేషణకు వచ్చిన డీఆర్ఎఫ్, మున్సిపల్ బృందాలు
- బాలిక మృతదేహం కనిపించిన చెరువు
సంఘటన క్రమమిలా
* గురువారం సాయంత్రం 6:00: ఇంట్లో నుంచి సుమేధ సైకిల్తో బయటకు వెళ్లింది
* రాత్రి 7:00: సుమేధ కనిపించకపోవడంతో కాలనీ వాట్సాప్ గ్రూప్లో సందేశాలు, ఫొటోలు పంపారు
* 9:00: పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ సిబ్బంది వచ్చి నాలాను పరిశీలించారు
* శుక్రవారం ఉదయం 8:00: డీఆర్ఎఫ్, మున్సిపల్ బృందాలు వచ్చి అన్వేషించాయి.
* 9:00: నాలాలో సైకిల్ను గుర్తించి బయటకు తీశారు
* 11:30: బండ చెరువులో సుమేధ మృతదేహం గుర్తించారు.
Courtesy Eenadu