ఆడుకుని వస్తానని తండ్రికి చెప్పి వెళ్లిన కుమార్తె విషాదాంతం
సైకిల్ తొక్కుతూ మురుగుకాల్వలో పడ్డ చిన్నారి
వరద నీటి ఉద్ధృతికి రెండు కిలోమీటర్ల వరకు కొట్టుకుపోయి చెరువులో దొరికిన మృతదేహం
హైదరాబాద్లో దారుణం
హైదరాబాద్ – నేరేడ్మెట్ : స్నేహితులతో ఆడుకుని ఇప్పుడే వస్తానంటూ సైకిల్పై సంతోషంగా వెళ్లిన చిన్నారి నిర్జీవంగా ఇల్లు చేరింది. అప్పటి వరకూ సందడి చేసిన బిడ్డ అకాల మరణం ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్లోని నేరేడ్మెట్లో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ బయటకు వెళ్లిన బాలిక సుమేధ కపూరియా(12)ను ఓపెన్ నాలా బలితీసుకుంది. వరదనీటి ఉద్ధృతికి పొంగిపొర్లుతున్న నాలాలో కొట్టుకుపోయి దాదాపు రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో విగతజీవిగా కనిపించింది.
అవే ఆఖరిమాటలు
పశ్చిమబెంగాల్కు చెందిన అభిజిత్ కపూరియా, సుకన్య దంపతులు 2007లో ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వచ్చి నేరేడ్మెట్లోని ఈస్ట్ దీన్దయాళ్నగర్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె సుమేధ ఐదోతరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం వర్షం తగ్గాక కొద్దిసేపు స్నేహితులతో ఆడుకుని వస్తానంటూ తండ్రికి చెప్పిన సుమేధ.. సైకిల్ తీసుకుని బయటకు వచ్చింది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రహదారికి సమాంతరంగా వరదనీటిలో నాలా కూడా మూసుకుపోయింది. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటంతో నాలాను గుర్తించలేక సైకిల్తోసహా బాలిక నాలాలో పడిపోయింది. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. కుమార్తె ఎంతకీ ఇల్లు చేరకపోవటంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో రాత్రి 9 గంటలకు నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కాలనీ వీధులను పరిశీలించారు. గురువారం రాత్రి ఓపెన్ నాలాలో కొద్ది దూరం వెతికినా బాలిక ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరోసారి బాలిక కోసం నాలాలో గాలింపు చేపట్టారు. బాలిక పడిపోయిన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో స్లాబ్ మూతను తొలగించి సైకిల్ను గుర్తించారు. రెండు కిలోమీటర్ల దూరంలో నాలా నీరు కలిసే బండచెరువులో బురదలో కూరుకుపోయి నిర్జీవంగా పడివున్న చిన్నారిని గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఏ తల్లికీ ఈ కష్టం ఉండొద్దు
కుమార్తె క్షేమంగా వస్తుందనుకున్న తల్లిదండ్రులు బిడ్డను ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయారు. శుక్రవారం ఉదయం చేసిన ప్రయత్నమే ముందుగా చేసి ఉంటే కడుపుకోత ఉండేది కాదంటూ కన్నీరుపెట్టుకున్నారు. నాలాలో ఇనుపజాలీ ఏర్పాటు చేసినా.. దాన్ని పట్టుకుని బిడ్డ బతికేదంటూ వాపోయారు. మరో అమ్మకు ఈ కష్టం రాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని తాము అధికారులను కోరుతున్నట్లు చెప్పారు.
అధికారుల తప్పిదమే..
సుమేధను బలిగొన్న నాలా విషయంలో అధికారుల తప్పిదమే ప్రధానంగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. 20 అడుగుల వెడల్పున్న కాలనీ వీధుల్లో 4 అడుగుల నాలా ప్రమాదకరంగా ప్రవహిస్తుంటుంది. సుమారు 30 మీటర్ల వరకు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు.
స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాలనీలో పర్యటించి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. తమ సమస్యను పట్టించుకోవడంలేదని అక్కడి మహిళలు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వర్షాకాలంలోపు నాలా సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Courtesy Eenadu