– లాక్డౌన్లో మారని ఎంఎస్ఎంఈల పరిస్థితి
– దాదాపు 30శాతం మంది నిరుద్యోగులుగా మారిన వైనం
– ఉన్న ఉద్యోగులకూ జీతాలు చెల్లించలేని దుస్థితి : ఎంఎస్ఎంఈ సంఘాల వెల్లడి
న్యూఢిల్లీ : మోడీ సర్కారు అనాలోచిత వైఖరి, ముందస్తు చూపు కొరవడటం కారణంగా దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్డౌన్ పరిస్థితుల కారణం ఎంఎస్ఎంఈలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడి పనిచేసేవారి ఆర్థికపరిస్థితులు, జీవితాలు, కుటుంబ పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. అయితే ఈసందర్భంగా కేంద్రం కొన్ని ఉద్దీపనలను ఆర్భాటంగా ప్రకటించింది. అయితే వాటితో ఎంఎస్ఎంఈలకు ఒనగూరిందేమీ లేదనీ, లాక్డౌన్తో దెబ్బతిన్న ఈరంగాన్ని ఆదుకోవడానికి ఏ మాత్రమూ దోహదం చేయలేదనీ ఎంఎస్ఎంఈ సంఘాలు తెలిపాయి.
దేశంలో ఆరు కోట్లకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. వీటిలో పని చేస్తున్న శ్రామికశక్తిలో దాదాపు 20 నుంచి 30 శాతం మందిగత నాలుగు నెలల్లో నిరుద్యోగులుగా మారారని వివరించాయి. 60శాతానికి పైగా ఎంఎస్ఎంఈ యూనిట్లలో వారి ప్రస్తుత ఉద్యోగులకు జీతాలుచెల్లించడానికి తగినన్ని నిధులు లేవని వివరించాయి. భారత దేశ జీడీపీలో ఎంఎస్ఎంఈ లది సింహభాగంగా ఉంటుంది. దాదాపు 30 శాతం వాటా ఇక్కడి నుంచే వస్తుంది. డిమాండ్ లేకపోవడం, లిక్విడిటీ క్రంచ్, ఆలస్యమైన నగదు ప్రవాహాలు, మానవవనరులు తగ్గిపోవడం.. ఇలా పలు కారణాలతో ఈ రంగం దెబ్బతిన్నదని సంఘాలు తెలిపాయి.
కాగా, ఇటు ఎంఎస్ఎంఈ రంగంలో ఉద్యోగాల సంఖ్యపై కేంద్రం వద్ద ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. కానీ, కనీసం20 కోట్ల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనోపాధిని పొందుతున్నారని ఎంఎస్ఎంఈ సంఘాలు చెప్తున్నాయి. దాదాపు 30 నుంచి 35శాతం మానవశక్తితో చాలా యూనిట్లు నడుస్తున్నాయని ఎస్ఎంఈ ఛాంబర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సలుంఖే అన్నారు. నగదు లేమి కారణంగా అన్ని కంపెనీలు ముడి పదార్థాల సరఫరాలో సమస్యలను ఎదుర్కొంటున్నాయని వివరించారు. ” ఎగుమతి ఆర్డర్లు మందగించాయి. దీంతో ప్రధానంగా ఎగుమతుల్లో పాల్గొన్న కంపెనీలలో తయారీ లేదు. ఈ ఎగుమతిదారులకు సరఫరా చేయడానికి ఉపయోగించే ఎంఎస్ఎంఈలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయి” అని సలుంఖే తెలిపారు.
కాగా, ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కూడా ఇవే కారణాలను తన సర్వేలో వివరించింది. దెబ్బతిన్న ఈ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం ‘ఆత్మనిర్భర్ భారత్ పథకం’ కింద అదనపు మూలధనాన్ని అందించే లక్ష్యంతో ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల రుణాలను అందించాలని నిర్ణయించిన విషయం విదితమే.
అయితే, ఇందులో కేంద్రం ప్రచారార్భాటం తప్ప తమకు పెద్దగా ఏమీ సహాయం చేయలేకపోయాయని సంఘాలు తెలిపాయి. ఈ పథకానికి పరిమిత ప్రయోజనాలు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్రెటరీ జనరల్ అనిల్ భరద్వాజ్ అన్నారు. రుణాలు తీసుకోని చాలా ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాన్ని మూసివేశాయని భరద్వాజ్ తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్లు, వివాహ సంబంధిత సంస్థలు చాలా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇటీవలి సర్వే గురించి ప్రస్తావిస్తూ.. దాదాపు 64శాతం ఎంఎస్ఎంఈలకు తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి నిధులు లేవని, 3 లక్షల కోట్ల ప్యాకేజీ కేవలం 19శాతం డిమాండ్ను నెరవేర్చినందున ఎంఎస్ఎంఈలకు పెద్ద సంఖ్యలో ఆర్థిక సహకారం అవసరమని ఆయన అన్నారు.
Courtesy Nava telangana