– విశ్వప్రసాద్
ముస్లింలు, దళితులు, ఆదివాసీలు దేశ జనాభాలో 39 శాతం మాత్రమే ఉన్నప్పటికీ… దేశంలోని జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీల్లో వీరు 51 శాతానికి పైగా ఉన్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదిక జైళ్లలో ఖైదీల గణాంకాలను బట్టబయలు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు, దళితులు, ఆదివాసీలు సంఖ్య దేశ జనాభాలో 39.4 శాతం. ఈ మూడు సామాజిక వర్గాలు దేశంలో ఆర్థికంగా, సామాజికంగా అత్యంత వెనకబడిన వర్గాలు. వీరిలో అక్షరాస్యత శాతం కూడా తక్కువే. ఇక పాఠశాల, ఉన్నత విద్య స్థాయి చాలా పరిమితంగా ఉంటుంది. అయితే వీరిలో పేదరికం, నిరుద్యోగం శాతం మాత్రం అత్యధికం. సమాజంలో ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే భూమికలిగి ఉన్నవారి సంఖ్య వీరిలో చాలా స్వల్పం. ఇవి కాకుండా వీరిపై ఉన్నత వర్గాలుగా పిలవబడేవారి సామాజిక అణిచివేత, హింస, వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. దళితులు, ఆదివాసీలు శతాబ్దాల వారసత్వంగా సామాజిక అణిచివేతకు గురవుతుంటే, ముస్లింలపై ఇటీవల కాలంలో సంఘపరివార్ అనుబంధ శక్తులు దాడులు, అణిచివేతకు తెరతీశాయి. వీరిపై కేంద్రం, వివిధ రాష్ట్రాల్లో బిజెపి నేతృత్వం లోని ప్రభుత్వాలు, వివిధ సంస్థలు కలిసి దుర్మార్గం, ద్వేషపూరిత హింసలో కొత్త చరిత్రకు తెరతీశాయి. దేశంలోని జైళ్ల పరిస్థితి అమెరికా లోని జైళ్ల పరిస్థితి గుర్తు చేస్తుంది. అమెరికా ప్రభుత్వ వివరాల ప్రకారమే జనాభాలో నల్లజాతీయులు (ఆఫ్రికన్-అమెరికన్) కేవలం 13 శాతం కాగా, అక్కడి జైళ్లలో మాత్రం వీరి సంఖ్య 40 శాతానికి పైగా ఉంది.
ఇక భారత్లో నిందితులు, విచారణలో ఉన్న వారితో సహా మొత్తం ఖైదీల్లో ముస్లింల సంఖ్య 18.1 శాతం. అయితే 2011 లెక్కల ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు 14.2 శాతం మాత్రమే ఉన్నారు. అలాగే జనాభాలో 16.6 శాతం ఉన్న దళిత (ఎస్సి లు) ఖైదీల విషయంలో మాత్రం 21.2 శాతం. ఆదివాసీల విషయం లోనూ ఈ వ్యత్యాసం ఇదే విధంగా ఉంది. జనాభాలో 8.6 శాతం మాత్రమే ఉన్న ఆదివాసీలు, జైళ్లలో మాత్రం 11.5 శాతంగా ఉన్నారు. దాదాపు ప్రతీ రాష్ట్రం లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉన్నా.. ఉత్తరప్రదేశ్, గుజరాత్, అసోంల్లో మాత్రం చాలా తీవ్రంగా ఉంది. గుజరాత్లో ముస్లింల జనాభా కేవలం 10 శాతం…అయితే ఇక్కడ జైళ్లల్లో మాత్రం వీరి సంఖ్య 27 శాతం. దేశంలోని ఇది దారుణం. ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఉత్తరప్రదేశ్ జనాభాలో 20 శాతం ఉన్న ముస్లింలు, ఖైదీల్లో 27 శాతం ఉన్నారు. దేశంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అస్సాంలో ముస్లింల సంఖ్య 34 శాతమైతే, జైళ్లలో ఉన్న వారిలో వీరి సంఖ్య 45 శాతం (జమ్ము కాశ్మీర్, లక్షద్వీప్ల్లో ముస్లింలు సంఖ్య ఎక్కువగా ఉన్నా అవి కేంద్ర పాలిత ప్రాంతాలు). పైన పేర్కొన్న మూడు రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. గుజరాత్లో 25 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. అలాగే ముస్లింలు గురించి గొప్పగా చెప్పుకునే మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ముస్లింల సంఖ్య జనాభాలో 27 శాతం కాగా, ఖైదీల్లో మాత్రం వీరి సంఖ్య 37 శాతానికి పైనే. ముస్లింలపై పైపై మాటలకే మమతా ప్రభుత్వం పరిమితం అవుతుందని ఇది నిరూపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ముస్లింలు, దళితులు, ఆదివాసీల్లో ఎక్కువ మంది ప్రజాస్వామ్య డిమాండ్లతో నిరసనలు చేసినందుకే నిర్భంధించబడి ఉన్నారు. అటవీ భూమి స్వాధీనం చేసుకోవడం, వనరుల దోపిడీ, కుల, మత దురాగతాలు..వ్యతిరేకించడం వంటి ఆందోళనల్లో వీరు కేసులు ఎదుర్కొంటున్నారు.
పేదరికం కారణంగా వీరంతా పోలీసు దర్యాప్తు నుంచి కోర్టుల్లో విచారణ వరకూ సరైన న్యాయ సలహాలను పొందలేకపోతున్నారు. వీరు తమ వెనకబాటుతనంతో పోలీసులు, కోర్టుల నుంచి డాక్యుమెంట్ కాపీలు పొందలేకపోతున్నారు. సరైన సమాచారం లేకపోవడంతో తద్వారా చట్టపరమైన ప్రాథమిక హక్కులను కూడా ఉపయోగించుకోలేక పోతున్నారు. పేదలు కావడంతో బెయిల్, పెరోల్, ఉన్నత కోర్టులకు పిటిషన్ వేయడం వంటి వాటికి నిపుణులైన న్యాయవాదుల సేవలను పొందలేకపోతున్నారు. అలాగే పేదరికమే వీరికి ప్రధానమైన అడ్డంకి కాదు. ముస్లింలు, దళితులు, ఆదివాసీలుపై పోలీసులు, కోర్టుల వివక్ష, ఉన్నత కులాలపై ప్రదర్శించే పక్షపాతం కూడా ఒక కారణం.
2019 జాతీయ క్రైమ్ బ్యూరో రికార్డులు ప్రకారమే భారత జైళ్లలో 30 శాతం మంది మాత్రమే దోషులుగా నిర్థారించిబడిన ఖైదీలు. 69 శాతం మంది నిందితులు, విచారణలో ఉన్నావారు. మిగిలిన 1 శాతం నిర్బంధించిన వారు లేదా ఇతర ఖైదీలు. విచారణలో ఉన్న వారిలో పైమూడు వర్గాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. ఎందుకంటే సరైన వనరులు లేక వీరంతా బెయిల్ పొందలేకపోతున్నారు. ముఖ్యంగా పైన చెప్పుకున్నట్లు పేదరికమే ప్రధాన కారణంగానే వీరు జైళ్లలో మగ్గిపోతున్నారు. ఖైదీల్లో ముస్లింలు, దళితులు, ఆదివాసీల సంఖ్యను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. అలాగే ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చట్టపరమైన, జైలు సంస్కరణ కమిషన్లు కూడా ఈ విషయాన్ని పక్కన పెట్టాయి. ఈ పరిస్థితిని మార్చడానికి తమ హక్కులు, రక్షణ కోసం ముస్లింలు, దళితులు, ఆదివాసీలు మరింత పోరాటం చేయాలి. ముఖ్యంగా తిరోగమన, అస్పష్టమైన ప్రభుత్వం ఉన్న ప్రస్తుత సమయంలో వీరంతా తమ పోరాటాన్ని మరింత విస్తృతం చేయాలి. అప్పుడే ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది.