ప్రధాన మంత్రిగా ‘పట్టాభిషేకం: అనాహూత అతిథిగా నవాజ్ షరీఫ్ను అలరించడం, ఉరీలో ఉగ్రవాద దాడికి దీటైన జవాబుగా నియంత్రణరేఖ ఆవల సర్జికల్ దాడులు… ప్రధాని మోదీ ‘విస్మయాలు, వేడుకలు’ వ్యూహానికి దృష్టాంతాలు. మునుపటి నిర్ణయ వైఫల్యం కలిగించిన నిరుత్సాహాన్ని ప్రజల మనస్సుల నుంచి తొలగించేందుకు తరచు విస్మయకర నిర్ణయాలు తీసుకోవడం, ప్రత్యేక వేడుకలు నిర్వహించడం మోదీకి ఆనవాయితీ అయింది. డిమానిటైజేషన్, జీఎస్టీ మధ్య సంబంధాలలో ఇదే వ్యూహం ప్రతిఫలించింది. మరి ఆర్థిక మాంద్యం నివారణకు, కశ్మీర్లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు మోదీ వ్యూహం తోడ్పడుతుందా?
ఆయన ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటారు, అవి మనలను దిగ్భ్రాంతి పరుస్తాయి. ఒక పనిని ప్రారంభించడం ఆయనకు ఒక ఉత్సవ సందర్భం, ఆ వేడుకలు అతిగా వుంటాయి. అంతేకాదు, ఆయన పట్ల మనకు భక్తిపూర్వక భయాన్ని కలిగిస్తాయి. సంక్షేపించి చెప్పాలంటే ‘విస్మయాలు, వేడుకలు’ అనేవి భారతదేశాన్ని పాలించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆచరిస్తున్న వ్యూహ కీలక లక్షణాలు. పూర్వపు ప్రధానమంత్రులు తీసుకోవడానికి వెనుకాడిన లేదా తప్పించుకున్న విధాన నిర్ణయాలను మోదీ అతి సునాయాసంగా అమలుపరిచారు. మరే ప్రధానమంత్రి ఎదుర్కోవడానికి సాహసించని చిక్కులను మోదీ సమర్థంగా అధిగమించారు. ఉద్దేశపూర్వకంగా భయోత్పాతం సృష్టించడానికే ఆయన కొన్ని కీలక నియామకాలు జరిపారని చెప్పవచ్చు. మతోన్మాద ప్రేలాపనలకు పేరు పొందిన యోగి ఆదిత్యనాథ్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి మోదీ ఎంపిక చేసినప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన ముస్లిం ప్రముఖుడు ఒకరు నాతో ఇలా అన్నారు: ‘మమ్మల్ని నిర్ఘాంతపరిచేందుకే మోదీ ఈ ఎంపిక చేసినట్టుగా కన్పిస్తుంది’.
మోదీ నిర్ణయాలు ప్రజలను ఇంతగా ఎందుకు నివ్వెర పరుస్తున్నాయి? ఆయన వ్యవహారశైలి ఎందుకు అంతగా భయభీతి గొల్పుతోంది? ఎట్టకేలకు భారత్ను ప్రపంచ అగ్రగామి దేశంగా రూపొందించగలిగే శక్తిమంతమైన, నిర్ణయాత్మక నాయకుడు జాతి భాగ్య విధాతగా ఉన్నాడని తన గురించి ప్రజలలో నెలకొన్న భావాన్ని పరిపూర్ణంగా పెంపొందించుకోవడమే లక్ష్యంగా మోదీ నిర్ణయాలు రూపొందుతున్నాయి. వాటికి మరో లక్ష్యమూ ఉన్నది: దేశ రాజకీయాలు సదా తన చుట్టూనే పరిభ్రమించేలా చేయడమే మోదీ అభీష్టం. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తొలిసారి తన పదవీ బాధ్యతలను ఎంతో అట్టహాసంగా చేపట్టారు. 2014లో పదహారవ సార్వత్రక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రప్రథమంగా సంపూర్ణ మెజారిటీని సాధించుకున్నది. మోదీ సారథ్యంలో బీజేపీకి లభించిన ఈ విజయం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. తన అసాధారణ విజయాన్ని ఒక అద్భుత ఉత్సవంగా నిర్వహించుకునేందుకు మోదీకి పూర్తి హక్కు ఉన్నది. అయితే ప్రధానమంత్రిగా ఆయన పదవీ ప్రమాణ స్వీకారోత్సవం, ఒక గణతంత్ర రాజ్య ప్రభుత్వాధినేత అధికారాలను చేపట్టే రాజ్యాంగ ప్రక్రియగా కాకుండా ఒక విజేత పట్టాభిషేకంగా జరిగింది. ఒక మహా క్రియాశీల నాయకుడు పరిపాలించే ఒక ‘నూతన భారతదేశం’ ఆవిర్భావానికి చిహ్నంగా ఆ ఉత్సవం నిలిచింది. తన పదవీ ప్రమాణ వేడుకలకు ఇతర దక్షిణాసియా దేశాల ప్రభుత్వాధినేతలతో పాటు పాకిస్థాన్ ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించి దేశ ప్రజలనే కాదు, ఇరుగు పొరుగు దేశాల వారిని, విశాల ప్రపంచాన్ని నరేంద్రమోదీ అమితంగా విస్మయరిచారు.
ఆ మరుసటి సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక అనాహూత అతిథిగా లాహోర్లో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవరాలి వివాహానికి వెళ్ళారు. మోదీ ఉదార వర్తన భారతీయులను ఆశ్చర్యపరిచింది. పాకిస్థాన్ ప్రజలు చకితులయ్యారు. అలా మన దాయాది దేశాన్ని ఆకస్మికంగా సందర్శించేందుకు మోదీ ‘ఒక రాజనీతిజ్ఞునిలా నిర్ణయం తీసుకున్నారని’ కీర్తిశేషురాలు సుష్మా స్వరాజ్ (అప్పటి భారతీయ విదేశాంగ మంత్రి) వ్యాఖ్యానించారు. అవును, అందరూ తనను ఒక రాజనీతిజ్ఞునిగా చూడాలని నరేంద్ర మోదీ అభిలషిస్తున్నారు. ఇంతలో ఉరీలోని భారత సైనిక దళాల బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి దీటైన జవాబుగా కశ్మీర్లో నియంత్రణ రేఖ దాటి వెళ్ళి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని భారత సైన్యాన్ని ప్రధాని మోదీ ఆదేశించారు. ఆ ప్రతిదాడులను ‘సర్జికల్ స్ట్రైక్స్’గా ఆయన అభివర్ణించారు. నవాజ్ షరీఫ్తో నరేంద్ర మోదీ విఫల మైత్రీ స్మృతులు దేశ ప్రజల మనస్సుల నుంచి చెరిగిపోయేందుకు ఈ సర్జికల్ దాడులు ఎంతైనా తోడ్పడ్డాయి. దేశ పాలనలో ప్రధాని మోదీ ‘విస్మయాలు, వేడుకలు’ వ్యూహం తేటతెల్లమయ్యే దృష్టాంతాలలో ఇదొకటి.
మునుపటి నిర్ణయ వైఫల్యం లేదా పరిమిత విజయం కలిగించిన నిరుత్సాహాన్ని దేశ ప్రజల మనస్సుల నుంచి తొలగించేందుకే మోదీ తరచు విస్మయకర నిర్ణయాలు తీసుకోవడం, ప్రత్యేక వేడుకలు నిర్వహించడం చేస్తున్నారు. డిమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు), హడావుడిగా ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మధ్య సంబంధాలలో ఈ ‘విస్మయాల, వేడుకల’ వ్యూహం ఒకటి అనే విషయం మనకు విశదమవుతున్నది. 2016 నవంబర్ 8న దేశ ప్రజలకు ఒక పిడుగుపాటు లాంటి నిర్ణయాన్ని ప్రధాని మోదీ తీసుకున్నారు. ఆ రోజు రాత్రి ప్రసార సాధనాలలో దేశ ప్రజలనుద్దేశించి మోదీ ప్రత్యేకంగా మాట్లాడుతూ దిగ్భ్రాంతికర నోట్ల రద్దు నిర్ణయాన్ని వెల్లడించారు. అదే రోజు అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. ‘ఒక సుదృఢ, నిర్ణయాత్మక నిర్ణయం తీసుకోవల్సిన అవసరం గురించి గట్టిగా పట్టించుకోవల్సిన సమయం దేశ చరిత్రలో ఆసన్నమయిందని’ మోదీ ఆ ప్రత్యేక ప్రసంగంలో వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు అటువంటి నిర్ణయమేనని ఆయన అన్నారు.
పెద్ద నోట్ల రద్దుతో దాదాపు ఆరు నెలల పాటు నగదు కొరతతో ప్రజలు నానా బాధలు పడ్డారు. ఆ రద్దు, నోట్ బందీ మంచి చెడ్డలను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు; పోనీ తీసుకున్న నిర్ణయాన్ని పకడ్బందీ ప్రణాళికతో అమలుపరిచారా అంటే అదీ జరగలేదు. కొత్త కరెన్సీ నోట్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరిగింది. ప్రజలు పడిన తిప్పలు వర్ణనాతీతమైనవి. ఆర్థిక వ్యవస్థకు అపార నష్టం వాటిల్లింది. సరే, డిమానిటైజేషన్ జరిగిన ఏడు నెలల అనంతరం జీఎస్టీని హడావుడిగా అమలుపరచడం వెనుక వున్న లక్ష్యాలలో ఒకటి నోట్ బందీ బాధాకర అనుభవాలను ప్రజలు మరచిపోయేలా చేయడమే. ఆ నిర్ణయం పట్ల వారి ఆగ్రహావేశాలను తొలగించడమే. అందుకు జీఎస్టీ అమలులోకి రావడం ప్రజలపై గరిష్ఠ స్థాయిలో సానుకూల ప్రభావం చూపేలా జరగాలని మోదీ నిర్ణయించారు. ఇందుకు ఆయన 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి జవహర్ లాల్ నెహ్రూ వెలువరించిన చరిత్రాత్మక ‘భవితవ్యంతో భేటీ’ ప్రసంగ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. స్వాతంత్ర్య వేకువలోని ఆ ఉత్తేజకర క్షణాలను జీఎస్టీ ప్రారంభోత్సవంలో పునఃసృష్టించాలని మోదీ భావించారు. తత్కారణంగానే 2017 జూలై 1 అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాలులో జీఎస్టీ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఉభయ సభలలోని అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించారు. కాంగ్రెస్, మరి కొన్ని ప్రతిపక్షాలు ఆ వేడుకలను బహిష్కరించాయి.
రాహుల్ గాంధీ అయితే ఆ కార్యక్రమాన్ని ఒక ‘తమాషా’గా కొట్టివేశారు. జీఎస్టీని ‘గూడ్స్ అండ్ సింపుల్ ట్యాక్స్’ అని మోదీ అభివర్ణించారు. దురదృష్టవశాత్తు అది సులభమైన పన్ను కాదు, సరళమైన పన్ను అంతకంటే కాదు. వ్యాపారవర్గాలను అమితంగా తికమక పెట్టింది. అంతకుమించి అవస్థల పాలుచేసింది. వినియోగదారులపై ఆర్థిక భారాన్ని పెంచింది. జీఎస్టీ విషయంలో రాష్ట్రాల అసంతృప్తులను తొలగించేందుకు అనేక రాయితీలు ఇవ్వడానికి మోదీ అనుమతించారు. ఫలితంగా బహుళ స్థాయి పన్నుగా జీఎస్టీ రూపొంది, మరింత సంక్లిష్టమయింది. వ్యాపార సౌలభ్యాన్ని దెబ్బతీసింది. నోట్ల రద్దు సమస్యల చేదు స్మృతులను తొలగించగలదని మోదీ భావించిన కార్యక్రమం ప్రజలకు మరిన్ని అవస్థలకు కల్పించడానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి నోట్ల రద్దు, జీఎస్టీలే ఎంతైనా కారణమని పలువురు ఆర్థిక వేత్తలు ఆరోపిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పురోగతి తీవ్ర మందగమనంలో పడిపోవడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హడావుడిగా పలు ఉద్దీపన పథకాలు ప్రకటించారు. ఆర్థికమాంద్యాన్ని ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోగలదని భరోసా ఇస్తున్నారు. అయితే, వాస్తవ పరిస్థితులు అలా కన్పించడం లేదు. ఆమె ప్రకటించిన వివిధ ఉద్దీపన పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టాన్ని కల్గించే విధంగా వున్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పదిహేడవ లోక్సభ ఎన్నికలు సమీపించిన తరుణంలో కశ్మీర్ లోయలో సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులపై జరిగిన ఆత్మాహుతి దాడిలో పలువురు జవానులు మరణించారు. ఈ కిరాతకానికి ప్రతి చర్యగా పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్లో గల ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడులకు మోదీ ఆదేశించారు. ఆ వైమానిక దాడులు విజయవంతమవ్వడంతో ఎన్నికల వేళ ఓటర్లలో జాతీయవాద భావావేశాలను ప్రజ్వలింపచేసేందుకు మోదీకి అవకాశం లభించింది.
ఆయన సరిగ్గా ఇటువంటి అవకాశాన్నే ఆశిస్తున్నారు. ఐదేళ్ళ క్రితం అధికారానికి వచ్చినప్పుడు ‘అచ్చే దిన్’ తీసుకువస్తానని, విదేశాలలోని బ్యాంకులలో ఉన్న భారతీయుల నల్ల డబ్బును తీసుకువచ్చి ప్రతి భారతీయుని ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేస్తానని, యువజనులకు ఏడాదికి కోటి చొప్పున కొత్త ఉద్యోగాలు సృష్టిస్తానని, గంగానదిని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి, స్వచ్ఛ ప్రవాహినిగా రూపొందిస్తానని మొదలైన హామీలను మోదీ ఇచ్చారు. మరోసారి ఎన్నికలకు వెళుతున్న వేళ ఆ హామీలను ప్రజలు మరచిపోయేట్టు చేయవలసిన అవసరముందని మోదీ గుర్తించారు. బాలాకోట్ వైమానిక దాడులతో మోదీ కోరిక నెరవేరింది. ప్రధానమంత్రిగా తన రెండో పదవీ కాలాన్ని నరేంద్ర మోదీ తనదైన ప్రత్యేక సంచలనాత్మక శైలిలో ప్రారంభించారు. తొలి వంద రోజుల్లోనే ముందస్తుగా ఎటువంటి హెచ్చరిక చేయకుండానే అత్యంత విస్మయకరరీతిలో అధికరణ 370 రద్దు చేశారు. జమ్మూ కశ్మీర్కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి రద్దయిపోయింది. ఆ వెన్వెంటనే కశ్మీర్ లోయలో తీవ్ర అణచివేత చర్యలు ప్రారంభమయ్యాయి. తాను శక్తిమంతమైన, నిర్ణయాత్మక నాయకుడినని దేశప్రజలకు మరొకసారి నిరూపించుకునేందుకే కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా మోదీ వ్యవహరించారు.
జాతీయవాదిగా తన ప్రతిష్ఠను పెంపొందించుకున్నారు. ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలో పడవేశారు. అధికరణ 370 రద్దుపై కశ్మీర్ వెలుపల దేశమంతటా ప్రజల మద్దతు లభిస్తుండడంతో ప్రతిపక్షాలు మోదీ చర్యలను వ్యతిరేకించలేకపోతున్నాయి. అయితే కశ్మీర్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో అంతులేని సమస్యలు ఎదురవుతున్నాయి. తన నిర్ణయ పర్యవసానంగా ఎదురయ్యే విపత్కర పరిస్థితుల నుంచి బయటడేందుకు మోదీ వద్ద ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేదని స్పష్టమయింది. పర్యవసానాలు ఎలా ఉంటాయనే శ్రద్ధ లేకుండా విస్మయకర నిర్ణయాలు తీసుకోవడమే మోదీకి పరిపాటి. తమ రాష్ట్రాన్ని రద్దుచేయడమే గాకుండా దాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం పట్ల కశ్మీరీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. వారి ఆగ్రహం ఏ క్షణంలోనైనా అగ్నిపర్వతంలా బద్దలయ్యే అవకాశం ఎంతైనా వున్నది. సుదీర్ఘకాలంపాటు కశ్మీర్ లోయ సైనిక నిఘాలో ఉండడం అనివార్యంగా కన్పిస్తోంది. ఇది భారత్కు సిగ్గు చేటే కాదు, అవమానకరం కూడా. కశ్మీర్లోని పరిస్థితులకు బాధ్యత పూర్తిగా పాకిస్థాన్దేనన్న వాదనను ప్రపంచం అంగీకరించబోదు.
Courtesy Andhrajyothyi..