- ఫోన్లో సీఎం కేసీఆర్ ఆరా
- త్వరగా కోలుకోవాలి బావా: కేటీఆర్, కవిత ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు కరోనా సోకింది. ఆయన ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనా లక్షణాలుండడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు మంత్రి తన ట్వీట్లో తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు చెప్పారు. కొన్ని రోజులుగా తనను కలిసిన (కాంటాక్ట్) ప్రతి ఒక్కరూ ఐసొలేట్ కావాలని, కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని అభ్యర్థించారు. హరీశ్రావుకు కరోనా వచ్చిందన్న సమాచారం తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఫోన్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
‘‘మా ప్రార్థనలన్నీ మీ కోసమే బావా’’
మంత్రి కేటీఆర్, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితలు ఆయనతో మాట్లాడారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్చేశారు. ఇతరుల కంటే త్వరగా కోలుకుంటారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ‘‘మా ప్రార్థనలన్నీ మీ కోసమే బావా’’ అని కవిత పేర్కొన్నారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, పలువురు మంత్రులు, నేతలు ఆయనను ఫోన్లో పరామర్శించారు. తన ఆరోగ్యం గురించి ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ మంత్రి హరీశ్రావు ట్విటర్లో పేర్కొన్నారు.
శాసనసభ పరీక్ష కేంద్రంలో 12 మందికి పాజిటివ్
శాసనసభా సమావేశాలను పురస్కరించుకొని శుక్రవారం నుంచి శాసనసభ ప్రాంగణంలో పరీక్షలు మొదలయ్యాయి. శుక్రవారం 370 పరీక్షలు చేయగా శాసనమండలి భద్రతలో ఉన్న ఒక పోలీసు (మార్షల్)కు కరోనా నిర్ధారణ అయింది. శనివారం 500 మందికి పరీక్ష చేయగా 11 మందిలో వైరస్ ఉంది. ఇందులో ఒక ఎమ్మెల్సీ అటెండర్, మరో శాసనసభ ఉద్యోగి, ఒక పాత్రికేయుడు, ఎనిమిది మంది పోలీసులు, హోంగార్డులున్నారు. శాసనసభ ప్రాంగణంలో పరీక్షలు చేయించుకున్న వారిలో మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతిరాథోడ్, విప్ గొంగిడిసునీత ఉన్నారు. మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్గౌడ్లు తమ తమ కార్యాలయాల్లో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వీరిందరికీ నెగెటివ్ వచ్చింది.
Courtesy Eenadu