– పట్నంలో మధ్య తరగతి ఉపాధి గల్లంతు
– ఇంటి కిరాయి, ఇతర ఖర్చులు చెల్లించలేక అవస్థలు
– దుకాణాలు, వర్తక, వాణిజ్య సంస్థల్లో సిబ్బంది తొలగింపు
– లాక్డౌన్ తర్వాత నెలవారీ జీతాలు అందుకోని వారు 1.89కోట్ల మంది : సీఎంఈఐ
హైదరాబాద్కు చెందిన జయ(44) ఒక బయోమెడికల్ కంపెనీలో మధ్యస్థాయి ఉద్యోగిని. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తారీఖ్కల్లా ఆమె ఖాతాలో రూ.12వేలు పడేవి. ఆమె భర్తది కూడా ప్రయివేటు ఉద్యోగమే. ఇద్దరికొచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబం సాఫీగా సాగిపోయేది. అయితే, మోడీ సర్కార్ విధించిన కఠినమైన లాక్డౌన్తో పరిస్థితి తారుమారైంది. జయ తన ఉద్యోగాన్ని కోల్పోయింది. ఐదు నెలలుగా ఇంటికే పరిమితమైంది. ఇంటి కిరాయి, పాల ఖర్చు, కిరాణా సామానుకు…ఆదాయం సరిపోవటం లేదు. ఇంత నష్టపోయాం… కష్టపడుతున్నాం…పోనీ వైరస్ భయాలు పోయాయా? పరిస్థితి కుదుట పడిందా? అంటే అదీ లేదు. ప్రభుత్వాలు…పేదలు, మధ్య తరగతిని ఆదుకునే ఏ ఒక్కపనైనా చేశాయా? అంటూ ఆమె ఆవేదన చెందుతోంది.
న్యూఢిల్లీ : ముంబయి, కోల్కతా, పూణె, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగుళూర్..హైదరాబాద్ నగరాల్లో జయలాంటి సాధారణ ప్రయివేటు ఉద్యోగుల ఆవేదన అంతా ఇంతా కాదు. వేరే పనులు వెదుక్కుందామన్నా పరిస్థితులు చక్కబడలేదు. ఎక్కడా..ఏ సంస్థా కూడా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు చేయటం లేదు. కొద్దిపాటి సిబ్బందితో ఆఫీసులు నడిపిస్తున్నారు. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి..రోడ్డున పడితే, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టయినా లేదు. ఇప్పుడప్పుడే ఎన్నికలు లేకపోవటంతో ప్రజల కష్టాలు కనపడటం లేదని, కనీసం వైరస్ విస్తరణ అడ్డుకున్నా ఉపాధిరంగం కోలుకునేదని ఆర్థిక నిపుణులు భావిస్తు న్నారు. ముఖ్యంగా పట్టణాల్లో ప్రయివేటు ఉద్యోగం చేసుకొని బతికే మధ్య తరగతి నానా కష్టాలు పడుతున్నది. నెలవారీ జీతం ఒక్కసారిగా ఆగిపోవ టంతో వారికి కాళ్లూ చేతులూ ఆడటం లేదు. ఎక్కడికి వెళ్లాలి..ఎవరికి చెప్పుకోవాలి? అని తీవ్రంగా ఆవేదనలో కూరుకుపోతున్నారు.
భారీగా ఉద్యోగాలు గల్లంతు
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వారి అధ్యయనం ప్రకారం, లాక్డౌన్ మొదలయ్యాక దేశంలో కోటీ 89లక్షల మంది ప్రయివేటు ఉద్యోగులు తమ కొలువును కోల్పోయారు. స్థిరంగా నెలవారీ జీతం అందుకునే కార్మికశక్తిలో ఇది 22శాతం. భారత ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత సంక్షోభంలో కూరుకుపోయిందని ‘కేంద్ర గణాంక కార్యాలయం’ ఇటీవల విడుదల చేసిన నివేదిక తెలియజేసింది. జీడీపీ మైనస్ 24శాతానికి క్షీణించింది. వర్ధమాన దేశాల్లో భారత్ ఆర్థిక పరిస్థితి దయనీంగా తయారైందని ఈ గణాంకాలే చెబుతున్నాయి. అయితే ఈ పరిస్థితి కేవలం లాక్డౌన్, కరోనా మహమ్మారి వల్ల వచ్చింది కాదని, 2019నాటికే ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉపాధి దెబ్బతినటంతో గత రెండేండ్లుగా కొనుగోలు శక్తి పడిపోతూ వస్తుందని వారు అన్నారు.
ఏ ఒక్కటైనా జరిగిందా?
లాక్డౌన్ ముందునాటికే ఆర్థికంగా పరిస్థితి బాగా లేదన్న సంగతి మోడీ సర్కార్కు తెలుసు. లాక్డౌన్ విధించటం వల్లే వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నామని కేంద్రంలోని పాలకులు మొదట్లో చెప్పుకున్నారు. కానీ ఇప్పుడా మాట చెప్పటం లేదు. ఎందుకంటే వైరస్విస్తరణ ఏస్థాయిలో ఉందో, మరణాలు ఎంతగా ఉన్నాయో అంతా ఇప్పుడు బయటపడు తున్నది. దాంతో ఆర్థిక కష్టాలు, నష్టాలన్నీ కరోనా వైరస్ వ్యాప్తిపై నెట్టేసి చేతులుదులుపుకునే పని మొదలెట్టారు. రూ.20లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ వస్తోం దని కొద్దిరోజులు ఊరించారు. తీరాప్యాకేజీ వచ్చాక నివ్వెర పోవటం ప్రజల వం తైంది. ప్రజల్ని మభ్యపెట్టడానికి, మాట లతో ఊరడించ డానికి పాలకులు ఆడుతున్న డ్రామా అని అర్థం కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ప్రజల ఆగ్ర హాన్ని, ఆందోళనను తగ్గించడానికి పాలకులు వేస్తున్న పాచికలు ఇవి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎక్కడి పోవాలి: సూర్యపాల్ సింగ్, అంధేరీ, ముంబయి
నోట్లరద్దుతో తిప్పలు మొదలయ్యాయి. జీఎస్టీ తీసుకొచ్చారు. ఎవర్ని ఉద్ధరించారు? ఎవరికి లాభమైంది? ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కరోనా పేరు చెప్పి లాక్డౌన్ అన్నారు. ఏమైంది..ఇప్పుడు. కరోనా పోయిందా? ప్రజలే పారిపోయి తమను తాము రక్షించుకున్నారు. అంధేరీకి సమీపంలో మాకు షాప్ ఉంది. కస్టమర్ల సంఖ్య నాలుగు దాటడం లేదు. లాక్ అన్లాక్ ఆత్మనిర్భర్అంటారు. వీటితో ఎవరికైనా ఉపయోగముందా? ఇప్పుడేంది మా పరిస్థితి. ఎక్కడికిపోవాలి? ఏం చేయాలి?
రంజిత్పాల్, వస్త్ర వ్యాపారి, నోయిడా, ఢిల్లీ
స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు నగరాల్లో మాస్కులు ధరించి అందరం పనిచేసుకున్నాం. ఇప్పుడు కొన్ని పరిమితులతో లాక్డౌన్ అమలుజేసి ఉండాల్సింది. కానీ కఠినమైన లాక్డౌన్ తీవ్రంగా నష్టం చేసింది. వైరస్ భయాలు అన్ని వ్యవస్థల్నీ చిన్నాభిన్నం చేశాయి. కొనుగోలు శక్తి లేకపోతే మార్కెట్ ఎలా నడుస్తుంది? కేంద్రం రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని చెబుతున్నది. ఇది నిజంగా సాయం చేసివుంటే, మేము మా షాప్ నెల కిరాయి, పనివాళ్ల జీతాలు చెల్లించలేక అవస్థ పడతామా? షాప్ మూసుకోవటం ఇష్టం లేక, బయట లక్షలకు లక్షలు అప్పులు చేసి నడిపిస్తున్నాం.
Courtesy: NT