దాన్నుంచి విద్యుత్ సంస్థలకు చెల్లింపు
వచ్చే ఏడాది నుంచి అమలులోకి
త్వరలో ఒక జిల్లాలో పైలట్గా అమలు
మీటర్లు వద్దని నాడు వైఎస్ పోరు
అదే చేస్తున్న ఆయన తనయుడు
కొత్త రుణాలకోసం ‘సంస్కరణలు’
మీటరు పెడితేనే అప్పు అన్న కేంద్రం
రైతుల్లో అనేక సందేహాలు, ఆందోళన
రైతులకు సంబంధించిన సున్నా వడ్డీ పఽథకం కింద అసలు, వడ్డీని
ప్రభుత్వమే చెల్లించాలి. ఇప్పుడు…‘ముందు మీరు చెల్లించండి. తర్వాత మేం రీయింబర్స్ చేస్తాం’ అని అంటోంది. విద్యుత్తు బిల్లుల్లో కూడా ఇదే పరిస్థితి రాదనే నమ్మకం ఏమిటి? – రైతుల సంఘాల సందేహం
అమరావతి: రాష్ట్రంలో మళ్లీ వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు రానున్నాయి. మీటర్ రీడింగ్ ఆధారంగా ప్రభుత్వమే కరెంటు బిల్లులను విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుంది. రైతు ప్రమేయం లేకుండానే ఈ ‘నగదు బదిలీ’ జరిగిపోతుంది. ఇది విద్యుత్ సంస్కరణల్లో భాగం అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ… ఆ పేరు మీద కొత్త అప్పులు తెచ్చుకోవడమే అసలు ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు.
వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా ఏదో ఒక జిల్లాలో డిసెంబరు నుంచి అమలుచేసి, ఫలితాలను పరిశీలించనున్నారు. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ పేరు మీద దీనిపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ్యవసాయ పంప్ సెట్లకు 1983కి ముందు మీటర్లు ఉండేవి. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం మీటర్ల విధానాన్ని తొలగించి, శ్లాబ్ పద్ధతి ప్రవేశపెట్టింది. పంప్సెట్ సామర్థ్యాన్ని బట్టి ఒక హెచ్పీకి ఏడాదికి రూ..50 చెల్లించేలా నిర్ణయించారు. ఐదు హెచ్పీ మోటార్ వాడే రైతు కూడా ఏడాదికి రూ. 250 కడితే సరిపోయేది. అప్పటి నుంచి వ్యవసాయంలో విద్యుత్ మోటార్ల వాడకం పెరిగింది.
1999లో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ప్రయోగాత్మకంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి విద్యుత్ వాడకం లెక్కించాలని భావించింది. ఏ రంగంలో విద్యుత్ వాడకం ఎంత ఉందో లెక్కలు తెలుస్తాయంటూ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులను దొంగల్లా భావించి మీటర్లు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది.
వైఎస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి పూర్తిగా ఉచిత విద్యుత్తు ఇవ్వడం మొదలైంది. ఇప్పటికీ అదే నిర్ణయం అమలులో ఉంది. తాజాగా జగన్ సర్కారు మరోసారి వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లను బిగించాలని నిర్ణయించింది.
బదిలీ చేసేదిలా…
రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సబ్సిడీ డబ్బును విద్యుత్ సంస్థలకు సకాలంలో ఇవ్వడం లేదు. ఏళ్ల తరబడి బకాయి పెడుతున్నాయి. దీంతో విద్యుత్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. తమకు విద్యుత్ సరఫరా చేసిన సంస్థలకు చెల్లింపులు చేయలేకపోతున్నాయి. సమస్య పరిష్కారానికి కేంద్రం ‘నగదు బదిలీ’ని ప్రతిపాదించింది.
దీని ప్రకారం ప్రతి పంప్సెట్కు ప్రతి నెలా బిల్లు తీసి ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతు బ్యాంక్ ఖాతాలో వేయాలి. ఆ రైతు ఆ డబ్బును తిరిగి విద్యుత్ సంస్థలకు ఏ నెలకు ఆ నెల చెల్లించాలి. ప్రతి రైతు పేరు మీద ఒక కొత్త బ్యాంక్ ఖాతాను ప్రభుత్వమే తెరుస్తుంది. సదరు రైతు వ్యవసాయం కోసం వాడిన విద్యుత్ బిల్లు మొత్తం ఆ ఖాతాలోకి జమ చేస్తుంది. ఆ ఖాతా నుంచి ఆ డబ్బు వెంటనే విద్యుత్ సంస్థల ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇందులో రైతు ప్రమేయం ఎక్కడా ఉండదు.
క్షేత్ర స్థాయిలో భూమి చేతులు మారడం వల్ల ఒక్కోసారి పంపుసెట్టు విద్యుత్ కనెక్షన్ ఒకరి పేరు మీద… భూమి మరొకరి పేరు మీద ఉండవచ్చు. అవన్నీ సరిచేసి భూమి పాస్బుక్, విద్యుత్ కనెక్షన్ రెండూ ఒకరి పేరు మీదే ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి రైతుకు పాస్బుక్, టైటిల్ డీడ్ రెండూ ఉండాలి. ఒకవేళ అవి లేకపోతే గ్రామ రెవెన్యూ అధికారి ఒక సర్టిఫికెట్ ఇచ్చినా సరిపోతుంది.
రైతులు ఒకవేళ అనధికారిక విద్యుత్ కనెక్షన్ వాడుతున్నా, తీసుకొన్న అనుమతికి మించి ఎక్కువ సామర్థ్యం కలిగిన పంపుసెట్లు వాడుతున్నా వాటిని రెగ్యులరైజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారాలన్నీ సాఫీగా జరగడం కోసం గ్రామ, మండల, జిల్లాస్థాయిలో కమిటీలు వేయాలని నిర్ణయించారు. గ్రామ స్థాయి కమిటీకి గ్రామ రెవెన్యూ అధికారి, మండల స్థాయి కమిటీకి మండల తహసీల్దార్ అధ్యక్షులుగా ఉంటారు.
విద్యుత్ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది అందులో సభ్యులుగా ఉంటారు. రీడింగ్ తీయడానికి పొలాల్లో ఉన్న బావుల వద్దకు ప్రతి నెలా వెళ్లాల్సిన పని లేకుండా… స్మార్ట్ మీటర్లను పెట్టాలని యోచిస్తున్నారు. అవి పనిచేసే అవకాశం లేనిచోట ఇన్ఫ్రారెడ్ సాంకేతికత కలిగిన మీటర్లు పెడతారు. ప్రతి బోరుకు సంబంధించిన చిరునామా, అక్షాంశ వివరాలను కూడా గ్రామ సచివాలయ సిబ్బంది నమోదు చేయాల్సి ఉంటుంది.
రుణాల కోసమేనా…
మరిన్ని రుణాలు తెచ్చుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని కేంద్రాన్ని కోరుతోంది. జీఎ్సడీపీలో 3 శాతం ఉన్న పరిమితిని కరోనా నేపథ్యంలో కేంద్రం 3.5 శాతానికి పెంచింది. ఐదు శాతం వరకూ పెంచుకోవడానికి వీలుగా చట్టాన్ని కూడా సవరిస్తూ రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
దీనికి కేంద్రం అనుమతి పొందాలంటే… నాలుగు షరతులు పాటించాలి. అందులో ఒకటి… ఉచిత విద్యుత్తుకు ‘నగదు బదిలీ’ అమలు చేయాలన్నది! ఈ విధానం అమలు చేయాలంటే ముందు ప్రతి పంపుసెట్టుకు విద్యుత్ మీటర్ పెట్టాలి. ఆ మీటర్ నుంచి వచ్చే బిల్లు ఆధారంగా నగదు బదిలీ చేయాలి. ఈ షరతులను పాటించడంలో భాగంగా మీటర్ల ఏర్పాటుకు నిర్ణయించారు.
ఎక్కడ ఎన్ని మీటర్లు?
రాష్ట్రంలో 3 హెచ్పీ మోటార్లు 2.90 లక్షలు, ఐదు హెచ్పీ మోటార్లు 7.76 లక్షలు, ఏడున్నర హెచ్పీ మోటార్లు 4.07 లక్షలు, పది హెచ్పీ మోటార్లు 1. 60 లక్షలు, పది హెచ్పీకి పైబడిన సామర్థ్యం ఉన్న మోటార్లు 92 వేలు ఉన్నాయి.
రాష్ట్రంలో అత్యధిక పంపుసెట్లు ఉన్న జిల్లా చిత్తూరు. అక్కడ 2.89 లక్షల మోటార్లు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 2.72 లక్షలు, కర్నూలు జిల్లాలో 1.77 లక్షలు, కడప జిల్లాలో 1.60 లక్షలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 1.92 లక్షల పంపుసెట్లు ఉన్నాయి. శ్రీకాకుళంలో 31 వేలు, విజయనగరంలో 45 వేలు, విశాఖపట్నంలో 45 వేలు, తూర్పు గోదావరిలో 52 వేలు, పశ్చిమ గోదావరిలో 98 వేలు ఉన్నాయి.
సెట్లు 17.50 లక్షలు.. బిల్లు 8,400 కోట్లు
ప్రతి పంపుసెట్టుకు ఎంత కరెంటు పడుతుందనేది ప్రభుత్వం కొన్ని లెక్కలు రూపొందించింది. మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులో ఆ అంశాన్ని కూడా పొందుపరిచారు. సర్కారు అంచనా ప్రకారం… ఖరీఫ్ సీజన్లో ప్రతి మోటార్ సగటున రోజుకు 2గంటల 20 నిమిషాలు పనిచేస్తుంది. ఆ ఆరు నెలలపాటు ఒక హెచ్పీకి సుమారు 66 యూనిట్ల కరెంటు వాడతారని, నెలకు 790 యూనిట్ల వాడకం ఉంటుందని లెక్కగట్టారు.
డిసెంబరు నుంచి మార్చి వరకూ రబీ సీజన్. ఆ సమయంలో ప్రతి పంపుసెట్ సగటున రోజుకు నాలుగున్నర గంటలు పనిచేస్తుందని, ఒక హెచ్పీ మోటార్ రోజుకు 129 యూనిట్ల విద్యుత్ వాడుతుందని అంచనా వేశారు. నెలకు ఒక హెచ్పీకి 1,548 యూనిట్ల వాడకం ఉంటుందని అంచనా. ఏప్రిల్, మే నెలలు అన్ సీజన్. ఆ సమయంలో ఈ పంపులు రోజుకు రెండు గంటలు పనిచేస్తాయని, రోజుకు 54 యూనిట్ల విద్యుత్ వాడకం ఒక హెచ్పీకి ఉంటుందని పేర్కొన్నారు.
నెలకు ఒక హెచ్పీకి 648 యూనిట్ల వాడకం ఉంటుంది. మొత్తం మీద చూసినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒక హెచ్పీ మోటార్ సరాసరిన ఏడాదికి 1059 యూనిట్ల విద్యుత్ వాడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం పదిహేడున్నర లక్షల పంపుసెట్లు ఉన్నాయి. వాటికి ఏడాదికి విద్యుత్ వ్యయం రూ. 8,400 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు.
తేడా వస్తే…
మొదట విద్యుత్ కనెక్షన్ తీసుకున్నప్పుడు తక్కువ సామర్థ్యం మోటార్లు పెట్టినా తర్వాత అవసరాల కోసం రైతులు ఎక్కువ సామర్థ్యం మోటార్లు వాడే అవకాశం ఉంటుంది. వాటిని క్రమబద్ధీకరించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. అది ఉచితమో ఫీజు చెల్లించాలో తేల్చలేదు.
ఆర్థిక ఇబ్బందులతో ఏదైనా ఒక నెల ప్రభుత్వం ఈ డబ్బు చెల్లించలేకపోతే అప్పుడు ఏం జరుగుతుంది? రైతుల మోటార్లకు కరెంటు నిలిపివేస్తారా అన్నది మరో సందేహం. సాగుకు కరెంటు మీటర్లు పెట్టడమంటే తేనె తుట్టెను కదిలించడమేనన్న అభిప్రాయం కొన్ని వర్గాల్లో వినవస్తోంది.