ఉత్పత్తిలో సగం.. శ్రమలో సగం.. అవకాశాల్లో మాత్రం దూరం.. ఇది నేటికీ శ్రామిక మహిళల స్థితి. ఇల్లంతా చక్కదిద్ది బతుకు పోరాటానికి బయలుదేరతారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారితో జరుగుతున్న యుద్ధంలోనూ ఓ సైన్యంలా ముందున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రపంచకార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా శ్రామిక మహిళల శ్రమను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది.
మేడే అంటేనే పనిగంటల కోసం జరిగిన పోరాటం. ఎనిమిది గంటల పని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల ఫలితంగానే మేడే ఉద్భవించింది. ఈ ఉద్యమాల్లో మహిళల పాత్ర కీలకం. తీవ్రమైన శ్రమదోపిడిని మహిళా కార్మికులు ఎదుర్కొనే వారు. ఆ దోపిడిన భరించలేక తిరగబడ్డారు. అనేక చట్టాలు, హక్కులు సాధించుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కరోనా కాలాన్ని అడ్డు పెట్టుకుని 12 గంటల పని విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇదే అమలులోకి వస్తే మహిళలు మరింత శ్రమ దోపిడికి గురుకావల్సివస్తుంది. అందుకే ఇలాంటి ఆలోచనలు ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇంటి నుండే మొదలు
ఉదయం నిద్ర లేచింది మొదలు ఓ యంత్రంలో పని చేస్తుంది. ఇంట్లో భర్తకు, పిల్లలకు, కుటుంబ సభ్యులకు అన్నీ సమకూర్చి సర్వసిద్ధం చేస్తుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే వుండడంతో మహిళల శ్రమ మరింత పెరిగింది. మన దగ్గర చాలా మంది ఇంటి పనని అసలు శ్రమగానే గుర్తించారు. పైగా ఇంటి పని అంటే కేవలం మహిళల పనిగానే భావిస్తారు. దీని వల్ల మహిళలపై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ విధంగా ఇంటి శ్రమ నుండే మహిళలు వివక్షకు గురౌతున్నారు.
అనిర్వచనీయమైన సేవలు
ప్రస్తుతం కరోనా రోగులకు సేవలు చేయడంలో మహిళల పాత్ర ఎంతో వుందని చెప్పాలి. డాక్టర్లతో సమానంగా నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్మికులు విశేషమైన సేవలు అందిస్తున్నారు. వీరిలో 80 నుండి 90 శాతం మహిళలే వున్నారు. నర్సులు చాలా మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు. గత పదిహేనేండ్ల నుండి వీరి విశేష మైన సేవలు అందిస్తున్నారు. కుటుంబ సభ్యులే దగ్గరకు రాలేని కరోనా రోగులను కంటికి రెప్పలా చూసుకుం టున్నారు. కానీ వీరికి కనీస వేతనాలు లేవు. సరైన సౌకర్యాలు లేవు.
ఇప్పటికైనా పర్మినెంట్ చేయాలి
ఏన్ఎంలు, ఆశాలు మరింత పాత్ర పోషిస్తున్నారు. కేసులు గుర్తించడం, అనుమానం వున్న ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా రోగులు ఉన్న చోట వీరు సేవలు అందిస్తున్నారు. కానీ దానికి తగ్గట్టు సౌకర్యాలు మాత్రం లేవు. ఆశాలు కేవలం గౌరవ వేతనంతోనే తమ సేవలు అందిస్తున్నారు. అధికారులతో సహా అందరూ వారి సేవలను గుర్తిస్తున్నారు. దేవతలంటూ పొగుడుతున్నారు. కానీ వారికి రావల్సిన ఇన్సెంటివ్ మాత్రం ఇప్పటికి వరకు ఇవ్వలేదు. ఇన్ని సేవలు అందిస్తున్నా నేటికీ చాలా ప్రాంతాల్లో మాస్కులు, శానిటైజర్లు వీరికి అందుబాటులో లేవు. ప్రస్తుత కరోనా సమయంలో అద్దె ఇండ్లలో వుంటూ డ్యూటీలకు వెళ్ళి వస్తుంటే ఓనర్లు ఇల్లు ఖాళీచేయమంటూ ఒత్తిడి చేస్తున్నారు. చివరకు కుటుంబ సభ్యులు కూడా వారి వద్దకు వచ్చే అవకాశం లేదు. వీటన్నింటినీ అధిగమిస్తూ తమ ప్రాణాలను లెక్క చేయడకుండా సేవలు చేస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థలో వీరి శ్రమ ఎంతో కీలకం. ఇలాంటి ఆశాలకు ఫిక్స్డ్ వేతనాన్ని ప్రభుత్వం నిర్ణయించాలి. ఇప్పటికైనా పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి.
అంగన్వాడీల పని భారం పెరిగింది. రికార్డు వర్క్ చేయిస్తున్నారు. అదే పనిని మళ్ళీ స్మార్ట్ఫోన్లో చేయాలి. అనేక సర్వేలు పెరిగాయి. రాష్ట్రంలో 70 వేల మంది కార్మికులు ఉన్నారు. వీరెవరికీ ఇఎస్ఐ, పీఎఫ్ లాంటి సౌకర్యాలు లేవు. గౌరవ వేతనం కిందనే పని చేస్తున్నారు. కరోనా సమయంలో అంగన్వాడీలు మాస్కులు కుట్టి పంచుతున్నారు. ఇప్పటి వరకు 600 గ్రామాల్లో 30 వేల మాస్కులు, 60 క్వింటాల కూరగాయలు, 30 క్వింటాల బియ్యం, పప్పులు, నూనె, చక్కెర ఇలా ఎవరికి తోచినట్టు వారు పంచుతున్నారు. ఇవన్నీ వారి సొంత ఖర్చులతోనే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో అంగన్వాడీలు తమ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. ఆ పోరాటాలకు ప్రజలు వారికి మద్దతుగా నిలబడ్డారు. కాబట్టి ఇలాంటి కష్టకాలంలో ప్రజలకు సేవ చేయడం తమ బాధ్యతగా అంగన్వాడీలు నిర్ణయించుకన్నారు. తాము ఎంత కష్టపడుతున్నా 25 జిల్లాల్లో కరోనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల, అధికారుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఐసీడీఎస్ డ్యూటీలు కూడా చేస్తున్నారు. ప్రారంభంలో ఆశాలతో కలిసి సర్వేలు కూడా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ 15 రోజులకు ఓసారి పోషక ఆహారాన్ని ఇండ్లకు పంచుతున్నారు. ట్రాన్స్పోర్ట్లేకపోయినా సొంత వాహనాలపై వెళుతున్నారు. గ్రామంలో ప్రజలు తీసుకోవల్సిన జాగ్రత్తలు చెబుతున్నారు. ఇలా నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటున్నారు. ఈ విధంగా కరోనా నివారణకు అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకంగా వుంది. ఈ శ్రమను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వం వీరిని కార్మికులుగా గుర్తించాలి.
జయలక్ష్మి, తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఒంటరి మహిళల పరిస్థితి ఘోరం
ప్రస్తుతం మా బ్యాంకు ఉద్యోగులకు ఎవరి స్థాయిలో వారికి రోజుమార్చి రోజు ఇంటి నుండే పని చేసే అవకాశం కల్పించారు. పర్మినెంట్ ఉద్యోగులకు పెద్దగా సమస్య లేకపోయినా ట్రాన్స్పోర్ట్ మాత్రం చాలా ఇబ్బంది వుంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా మంది రకరకాలుగా ఇబ్బందుల పడుతున్నారు. డ్యూటీకి రాని రోజుల్లో వీరికి జీతం కట్ చేస్తున్నారు. రాగలిగిన వాళ్ళు రండి లేదంటే లేదు అంటున్నారు. ఔట్సోర్సింగ్ మహిళా ఉద్యోగుల్లో ఎక్కువమంది ఒంటరి మహిళలు ఉన్నారు. భవిష్యత్లో వచ్చే జీతం సరిపోక, కుటుంబాలు గడవడం కష్టంగా మారే అవకాశం వుంది. రానున్ను కాలంలో ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం వుంది. కరోనా అన్ని రంగాల మాదిరిగానే బ్యాంక్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పైగా ఆర్థిక వ్యవస్థలో భాగమైన రంగం కాబట్టి మరింత ప్రమాదం పొంచి వుంది. ఉద్యోగాలు కోల్పోయేవారిలో మహిళలు ఎక్కువగా వుండే అవకాశం వుంది. కాబట్టి ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఎలాంటి నష్టం కలగకుండా చేసుకోవాలి.
పద్మశ్రీ, బ్యాంక్ ఉద్యోగి
హక్కుల రక్షణకై…
నూతన ఆర్థిక విధానాల ఫలితంగా కార్మిక వర్గం శ్రమ దోపిడికి గురవుతూనే వుంది. అందులో మహిళా కార్మికులుగా మరింత దోపిడికి గురవుతున్నారు. ఉత్పత్తిలో సగంగా వున్నా రెండవ తరగతి పౌరులుగా బతుకుతున్నారు. లైంగిక దాడులకు జరుగుతున్నాయి. పాలకుల విధానాల వల్ల శ్రామిక మహిళల పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతుంది. అతి తక్కువ వేతనాలకు తీవ్రమైన శ్రమ చేస్తున్నారు. మున్సిపల్, గ్రామపంచాయితీ, అశాలు, అంగన్వాడీ ఇలా అందరూ శ్రమ దోపిడీకి గురౌతున్నారు. పనిగంటలు అమల్లో లేవు. సమాన పనికి సమాన వేతనం లేదు. ఎన్నో రంగాల్లో మెటర్నిటీ సెలవులు సరిగ్గా అమలు కావడంలేదు. మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు లేని దుస్థితి ఇప్పటికీ వుంది. హైదరాబాద్ వంటి మహానగరంలో 200 భవన నిర్మాణ సెంటర్లు వున్నాయి. భవన నిర్మాణ రంగంలో 50 శాతం మహిళలు వున్నారు. కానీ ఏ సెంటర్లోనూ మరుగుదొడ్ల సౌకర్యం లేదు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను మహిళలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. మహిళా కార్మికులు ఉపాధి కోల్పోయారు. తాత్కాలిక ఉపశనం కల్పించినా వాటి వల్ల ఉపయోగం లేదు. జగిత్యాలలో ఓ మహిళ ఆకలి చావుకు గురయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యలకు పరిష్కారం చూపకుండా కేంద్ర ప్రభుత్వం పని గంటలు పెంచే ప్రయత్నంలో వుంది. శ్రామిక మహిళల హక్కులపై దాడిగా దీన్ని భావించాలి. అలాగే కరోనా రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లకు ఎన్నో రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ డాక్టర్లకంటే ఎక్కువ సేవలు చేస్తున్న ఏన్ఎంలు, నర్సులు, ఆశాలకు కనీస సౌకర్యాలు లేవు. కేరళలో వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ మన దగ్గర చేయలేక పోతున్నారు. శ్రమజీవుల తరపున నిలబడ్డారు కాబట్టి అక్కడ ఇది సాధ్యమయింది. కాబట్టి హక్కుల రక్షణ కోసం ఈ మేడే స్ఫూర్తితో మరిన్ని ఉద్య మాలను ఉదృతం చేయాలి. ఆ ఉద్యమంలో శ్రామిక మహిళలు భాగస్వాములు కావాలి.
రమాదేవి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ (సీఐటీయూ)
Courtesy: NT